Sunday, May 06, 2007

మన అభాగ్యనగర్

మొన్న ఒక ప్రముఖ బ్లాగరుతో జీటాక్ లో మాట్లాడుతుంటే, విషయం ప్రమాదాల మీదకు, భద్రత మీదకు మళ్లింది. హైదరాబాదు ప్రస్తుతం అన్ని నగరాల కంటే అతి సుఖవంతమైన, భద్రత కలిగిన నగరం అని ఆ బ్లాగరు అంటే నాకు ఒక్క సారి మన నగర ముఖ చిత్రం కళ్ల ముందర గిర్రున తిరిగింది. అందువల్లన ఆ విషయ ముఖంగా నాకు తెలిసిన నాలుగు ముక్కలు, వార్తా పత్రికల ఆధారంగా ఒక చిన్న అవలోకనం.

హైదరాబాదు ప్రస్తుతానికి పౌర జీవన ప్రమాణాల సూచీలో చాలా తక్కువ స్థాయి కలిగివుందని నా అభిప్రాయం. ఎందుకో చూద్దాం.

పౌర జీవన ప్రమాణ సూచీ (Life Index) అనేది అనేక కారణాల మీద అధారపడి వుంటుంది. చక్కని పొందిక కలిగిన సమాజం, ఆరోగ్యకరమైన గాలి, నీరు, శుభ్రత, నాణ్యత కలిగిన సేవలు, ఆర్ధిక సమానతలు, పేదరికం అనే విషయాలు ముఖ్యమైనవి. అయితే ఇవి కాక మరికొన్ని కారణాలు కూడా ఈ సూచీ ని ప్రభావితం చేస్తాయి. అవి మానసిక ఆనందం, ప్రశాంతత, పర్యావరణం, సమాజ చైతన్యం వంటివి. అయితే ఇవన్నీ మన రాజధాని నగరంలో ఎలా వున్నాయి?

శాంతి భద్రతలు : అతి దీనావస్థలో వున్నవి ఇవే. పోలీస్ స్టేషన్లకు కూత వేటు దూరంలో తొమ్మిది కోట్ల చోరీ, అసలు ఇప్పటికి అంతు చిక్కని ఆంధ్రా బ్యాంకు చోరీ, పట్ట పగలు దోపిడీలు లాంటివి మచ్చుకు కొన్నొ. తీవ్ర కొరత వున్న పోలిస్ సిబ్బంది. వున్న కొద్ది మంది కూడా రకరకాల గడ్డి తిని, తినిపించి రాజధాని నగరంలో పోష్టింగులు వెయ్యించుకుని ఏదో కొంత వెనకాద్దామనుకునేవాళ్లే. కొన్ని పోలిస్ స్టేషన్ల యస్.ఐ, సీ.ఐ పోష్టులయితే దాదాపు నలభై లక్షలవరకూ పలుకుతున్నాయి. రోడ్డు మీద అన్యాయం జరిగితే పిలుద్దామంటే కనుచూపు మేరలో కనిపించని పోలీసులు ఇక్కడే వున్నారు. "పోలీస్ ను పిలుస్తా" అంటే…పిల్చుకో ఫో, వాళ్ల సెటిల్మెంట్ ఎప్పుడో అయిపోయిందనే మాటలు ఇక్కడ సర్వ సాధారణం.

అవసరం అయిన దానికంటే కనీసం అరవై శాతం మంది తక్కువున్న ట్రాఫిక్ పోలీసులు. అందులో కొంత మంది సరి అయిన ట్రైనింగు, అధికారం లేని హోమ్ గార్డులు. ఇక ట్రాఫిక్ గురించి మాట్లాడే ముందు ఈ నగరంలో ప్రమాదాల సంగతి చూద్దాం.

dangers

అంటే మిగతా రాష్ట్ర ప్రజలందరి కంటే, ఈ నగర పౌరుడికి రోడ్డు మీద ప్రమాదానికి గురి అయ్యే సంభావ్యత చాలా అధికంగా వుంది. బయటకు బండి వేసుకు వెళ్తే తిరిగి వస్తామో రామో తెలియదు. ఏ టిప్పర్ (ఇవి రాజధాని లోగో కింద పెట్టుకోవచ్చు) ఎటువైపు నుంచి వచ్చి గుద్దేస్తుందో తెలియదు. ఏ బీ.పి.వో కారు (వీటికి ప్రత్యేకంగా ఫార్ములా - 0 రేస్ పెట్టొచ్చు) మనల్ని రాసుకుంటూ పోతుందో తెలియని భయం. అసలు ఆ కార్లకు అన్ని సొట్టలు, గీతలు, మరకలు (ఇవి సర్వ సాధారణం) ఎలా వచ్చాయని మన పోలీస్ లకు ఒక ఆలోచన వచ్చి ఏడిస్తే కదా? రోడ్లన్ని తమవే అనుకుని తిరిగే ఆటోవారి ఆగడాలు ఇక చెప్పనక్కరలేదు. లెక్కకు మించిన ఆటోలు ఇక్కడ వున్నాయి. ఏదో సర్వే వారు హైదరాబాదులో ప్రతీ పన్నెండు మందికీ ఒక ఆటో వుందని తేల్చారు. నిజమో కాదో తెలియదు కానీ, అసలు కొత్త ఆటోలను ఈ ప్రభుత్వం ఆపుతున్నట్లు లేదు. ఒకొక్క ఆటోలో పది మంది ప్రయాణించటం (స్కూలు పిల్లలు కూడా) ఇక్కడ సర్వ సాధారణం. ఎవడో ఎప్పుడో చస్తే అప్పుడు హడావిడిగా ఒక ప్రకటన మాత్రం చేస్తారు, ఇకపై అది నిషిద్ధం, ఇది నిషిద్ధం అని. అది ఒక పది రోజులు అమలు. తర్వాత అందరూ మర్చిపోతారు. ఇద్దరు ముగ్గురు పిల్లల ప్రాణాలు పోతే గానీ క్రాస్ ఓవర్ బ్రిడ్జీలు కట్టారా? ఇక్కడ అన్నీ ప్రాణాలు పణంగా పెడితే గానీ జరగవా?

ఈ రోజు ఈనాడు వార్త చదివితే చాలు…శాంతి భద్రతలు మసి పూసిన మారేడు కాయని అర్ధం అవుతుంది.

ఇక క్రిమినల్స్ సంఖ్య చూస్తే గుండె గుభిల్లు మనే గణాంకాలు కనిపిస్తాయి. ఎక్కడెక్కడి కేసులకూ పుట్టినిల్లు మన వూరే. తాళాలు వేస్తే చాలు, కూరగాయలకు వెళ్లి వచ్చేలోపే ఇళ్ళు ఖాలీ చేసిన కేసులు కనిపిస్తాయి. డబ్బు కోసం ప్రాణాలు తీయడానికి లెక్క చెయ్యని ముఠాలు ఇక్కడే తిరుగుతున్నాయి.

పర్యావరణం : మన నగరం ఇటీవలే దేశ రాజధానిని తోసి అత్యంత కాలుష్య నగరాల పట్టికలో నిలిచింది చల్లగా జలాశయాలలోనికి విషాన్ని వదిలేసే ఫ్యాక్టరీలు, అవి అస్సలు కనిపించని గుడ్డి పీ.సీ.బీ ఇక్కడ వున్నాయి. పత్రికలు విషయాలు బయట పెడితే కానీ పని చెయ్యని సంస్థ అది.

వందల సంఖ్యలో అక్రమ బోరు బావులు తవ్వి, ఆ నీటిని ట్యాంకర్ల లెక్కన అమ్మేస్తున్నారు. దీని వలన భూగర్బ జలాలు తీవ్ర స్థాయిలో పడి పోతున్నాయి. ఎక్కడో వున్న బాబ్లీనీరు రాక పోవటం కాదు, మన క్రింద పారుతున్న నీరు మనమే పోగొట్టుకుంటున్నాం. ఇది అస్సలు రాజకీయ పార్టీలకు, రాష్త్ట్ర సమితులకు బుర్రకు పొరపాటున కూడా అందని విషయం. ఇది ఇలానే జరిగితే రానున్న పదేళ్లలో హైదరాబాదు ఒక చెన్నయి లా మారుతుంది.

రోడ్ల పక్కన వున్న చెట్లను పెంచటం మాట తరువాయి. వాటిని చల్లగా నరికేస్తున్నారు, వాటి స్థానే యాడ్ బోర్డులు పుట్ట గొడుగుల్లా వస్తున్నయి.

వున్న వేల ఆటోలు అన్నీ కిరోసిన్ కల్తీ పెట్రోలును వాడుతున్నాయి. అలా అయితే డబ్బులు వెనకేసుకోవచ్చనే ఆశ. దీనివలన కాలుష్యం భూతంలా నగరాన్ని కమ్ముకుంటుంది.

సమాజం: అతి దరిద్రంగా వుంది. పక్కింటోల్లు ఎవడో కూడా తెలియని ఆపార్టుమెంట్లు వేలు వున్నాయి. మొహంలో నవ్వు కాదు సరికదా, పలకరింపు కూడా ఇక్కడ దొరకదు. అందరూ సీరియస్ గా అగ్ని మాపక సిబ్బందిలా రోడ్డు మీద హార్న్ కొట్టుకుంటూ వెళ్లిపోవటమే. ఆంబులెన్స్ లకే దారి దొరకడం లేదంటే ఇక ఇంకేముంది? ఇక్కడ గుండె పోటొస్తే దగ్గరలో వున్న గుడికి వెళ్లటమే మంచిది. కనీసం రోడ్డు మీద కన్ను మూయకుండా వుంటాం.

ప్రపంచ అతి లంచావతారాలన్నీ ఈ నగరంలోనే తిష్ట వేసాయి. MLA, MP, IPS, IAS ల నుంచి గుమాస్తాల వరకూ చెయ్య తడపనిదే పని జరగదు. అసలు ఇప్పుడు ఇక్కడ లంచం అనే దానికి అర్ధం లేదు. అది కూడా పనిలో ఒక భాగం.

తెలుగు వారు సహజంగా పాటించే గౌరవం ఇక్కడ మీకు దొరకదు. అతి నిర్దాక్షిణ్యమైన, కరుకైన సమాధానాలు, స్వార్ధం పొంగుతో కలసి వస్తుంటాయి. ఎంతో బిజీ నగరం అయినా ముంబయిలో కూడా ఇలాంటి ప్రజని చూడలేదు. ముంబయ్ ప్రజలు కష్టంలో ఆదుకునే తీరు చూస్తే ముచ్చటేస్తుంది.

ఇక ఈవ్ టీజింగు గురించి చెప్పనక్కరలేదు…చెప్పలేని సంఘటనలు, అసభ్య మూకలు లెక్కకు మిక్కిలిగా వున్నాయ్.

ఇక మిగతా భాగాలు వీలు చిక్కినపుడు రాస్తా….

Monday, April 23, 2007

శత చిత్ర టప టప చిటపట టప టపావళి

హమ్మయ్య చాన్నాళ్లకు కొన్ని నవయవ్వన చిత్ర రాజాలను క్లిక్కు మనిపించి నా చిత్ర బ్లాగు సెంచరీ పూర్తి చేసా :-) ఈ సందర్భంగా నా చిత్ర టపాలకు ప్రేరణనిచ్చిన గురు ద్రోణులెందరికో మనసారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాతో మూడు కళ్లూ పంచుకున్న నా కెమెరాలకు (ముఖ్యంగా నా DSC - P72 కు) ఈ సంధర్భంగా నా కృతజ్ఞతలు.

ఈ మధ్య జత చేసిన మూడు చిత్రాలు రామోజీ చిత్ర ప్రపంచ వీధిలో అసలు కనిపించని అందాలను బంధించినవి.

కూల్ క్లిక్కుల కిక్కులకు ఇక్కడ నొక్కండి

Saturday, April 21, 2007

పెరటి దేవుడీ వెంకటేశ్వరుడు

అసలే వేసవి. ఆపై భయంకరమైన రద్దీ. దేవుడిపై భారం వేసి రోజుల తరబడి క్యూ కాంప్లెక్సులలో కాపురాలు గడిపే పరమ భక్తులు..ఆహా ఏమి విశేష అభిమానులునారయ్యా వెంకు బాబు నీకు :-)

మరి వీళ్లందరిని ఇలా పడిగాపులు కాయించి పెరట్లో నుంచి అమితాబు కుటుంబానికి పెరటి దేవుడివైపోయావే? ఇది న్యాయమా? అసలే వీ.ఐ.పీ విహారాలతో పోటెత్తి పోతున్న తిరుమలలో ఇదొక కొస మెరుపా? లేదా 'సిరి' ఉన్నవాడిదే వేంకటేశ్వరమా?

రేపు చి..ల.సౌ. ఐష్ బచ్చన్ గారు, తన నూతన భర్త చి. అభి తో నీ దర్శనానికి వచ్చి కేవలం గంట అంటే గంటలో అన్నీ ముగించుకుని విమానమెక్కి పోతారంట గదా? ఆహా దేశ అభివృద్ధితో పాటు నీ పూజారుల బుర్రలు కూడా ఏమి అభివృధ్ధి చెందుతున్నాయి స్వామీ ? అటు ముగ్గురు, ఇటు ముగ్గురు పూజారులు ఐషమ్మ చుట్టూ రేపు వుండక పోతే నన్నడుగు. పందెమా?

Wednesday, April 18, 2007

మొబైల్ ఫోన్ ను వెతికి పట్టుకోవటం ఎలా?

మీ గర్ల్ ఫ్రెండు గానీ, బాయ్ ఫ్రెండు గానీ "నేను ఆఫీసులో వున్నాను, పని మీద వున్నాను" లాంటి సాకులు చెప్తున్నట్లు మీకనిపిస్తే తక్షణం ఈ ఉపగ్రహ సాఫ్టువేర్ ద్వారా వారిని ఎక్కడున్నారో ఇట్టే పట్టెయ్యొచ్చు. కేవలం వారి మొబైల్ నంబరు ఇస్తే చాలు...వారి మొబైల్ సిగ్నల్ బట్టి ఏ ప్రాంతం (కూకట్ పల్లి, అమీర్ పేట లాంటివి) చెప్తుంది.

మొదటి నాలుగు సంఖ్యలు ఒక పెట్టెలో, మిగతావి మరొక పెట్టెలో వేసి సెర్చ్ నొక్కండిక.....

http://www.sat-gps-locate.com/

Thursday, April 12, 2007

పిల్లికి చెలగాటం…ఎలుకకి ప్రాణ సంకటం [కొసరుతో]

అంత అనుకున్నట్లే అయ్యింది. నేను ఎప్పుడు ఈ యూనిపోల్ జైంట్ హోర్డింగులు చూసినా ఒకటే అనుకుండే వాడిని. ఏదైనా తుఫాన్ వస్తే ఏంటబ్బా సంగతి అని. సరేలే చాలా బలమైనవి కాబోలు అనుకునే వాడిని. MCH వారి ధన దాహానికి మరొక ప్రాణం బలి అయ్యింది. ప్రతీ కిలోమీటరుకూ ఒక హోర్డింగు. పార్కుల మధ్యలో, ఆఖరుకు ఇళ్ల మధ్యలో కూడా…వై.యస్ ఇంటి ముందర అయితే మరీ దారుణం. మొత్తం హోర్డింగు రోడ్డు పైనే వుంటుంది. వీటికి సర్వ వేళలా విద్యుత్తు సరఫరా వుంటుంది. దాని పైన యాడ్ లేక పోయినా సరే….ఫలానా వారిని యాడ్ కోసం సంప్రదించండి అని రాత్రంతా వందల యూనిట్లు ఖర్చు చేస్తూనే వుంటారు.

అసలు ఎందుకు ఇవి పెరిగాయి? అని చూసుకుంటే MCH వారి ఆశ తప్ప మరోటి కనిపించదు.

రోడ్డు మధ్యలో చెట్లు వున్నాయో లేవో గానీ, చిన్న చిన్న విద్యుత్తు బోర్డులు వందలు, వేలు నగరమంతటా…ఒకే యాడ్ ను ఆ రోడ్డు మొత్తం చూపించటం వీటి ప్రత్యేకత. ఇవి తెల్లవారు ఝాము వరకూ వెలుగుతూనే వుంటాయి. విచిత్రంగా సైబర్ గేట్ వే దగ్గర అయితే ఇవి మాత్రమే వెలుగుతుంటాయి..వీధి దీపాలు వెలగవు. అదీ సంగతి.

ఇక హోర్డింగులు….ఒకొక్కటి ఇరవై టన్నుల బరువు. హోరిత్తేస్తున్నాయి. ఎక్కడ చూసినా అవే. సీరియస్ గా నడుపుతున్న వాడికి హఠాత్తుగా ఆకర్షించే హోర్డింగులు ఎన్నో. ఒక్క మాదాపూర్ లోనే ఇవి దాదాపు పది వరకూ వున్నాయి. ప్రతీ నగరం పైన ఒక రకమైన వాయు వాతావరణం వుంటుంది. గాలి రకరకాల దిశలలో తిరుగుతూ వుంటుంది. పార్కులు, జలాశయాలు ఎక్కువ వుంటే ప్రజలకు మంచి గాలి అనుభూతి కూడా వస్తుంది. ఇప్పుడు ఈ హోర్డింగులు దానిని కాల రాస్తున్నాయి. ఈ భారీ హోర్డింగులు మొత్తం నగర ఉపరితలంలో వుండే గాలిని అడ్డుకుని స్థంభింప చేస్తున్నాయి. ఈ కారణం వలన ముంబయి కొలాబా ప్రాంతంలో హోర్డింగులు నిషేధించారు. మన పాలకులకు అసలు బుర్రలు ఎప్పుడు పని చేస్తాయో ఇంక. దీనికి తోడు ప్రాణ నష్టం. ఇరవై టన్నుల హోర్డింగు పడితే? ఎలా వుంటుంది? నిన్ననే చూసాను. భీభత్సంగా వుంది ఆ ప్రాంతం. మూడు కార్లు నుజ్జు, కనీసం ఒక పది మంది చనిపోయే ప్రమాదం..అదృష్టవశాత్తు ఆ సమయంలో అంతగా ట్రాఫిక్ లేదు.

ఇప్పుడు కొత్తగా LCD హోర్డింగులు వస్తున్నాయి. ఇందులో ఏకంగా పాటలు, సినిమా యాడ్లు చూపిస్తున్నారు, అసలు డ్రైవింగ్ చెయ్యాలా, ఇవి చూడాలో తిక మక. చాలా మంది ఇప్పటికే సెల్ ఫోన్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తున్నారు, దానికి తోడు ఇప్పుడు ఇవి. ఎవడి ప్రాణాన్నో తీసుకుని గానీ వీటి వైపు చూడదు ప్రభుత్వం.

ఇక పాద చారుల వంతెనలు…బాగా కడుతున్నారు. అయితే…వాటిని హోర్డింగులు పెట్టుకోవటానికే కడుతున్నారేమో అనిపిస్తుంది. సింగపూర్ లా చేస్తాం అని వాగేటఫ్పుడు, కనీసం కొన్ని అయినా సింగపూర్ లా చెయ్యాలి కదా. సింగపూర్లో ఈ పాద చారుల వంతెనలు చాలా ఎక్కువ. అయితే వాటిని అందంగా పూల తీగెలతో అలంకిరిస్తారు. మనం వాటిపై కూడా ఫోటోలు దిగేంత అందంగా…మరి ఇక్కడా? అసలు ఆ వంతెన మీద ఒకరి మీద అత్యాచారం చేసినా బయటకు కనపడనంతటి భారీ హోర్డింగులతో మొత్తం వంతనలను కప్పేస్తున్నారు. ఎవరైనా సరే ఆ యాడ్ చూసుకుంటూ వెళ్లవలసిందేనన్న్న మాట.

ఇలా చెప్పుకుంటు పోతే టన్నుల కొద్ది మేధావి తనం బయటపడుతూనే వుంటుంది.

వారికది కాసులాట…మన ప్రాణాలకు సంకటం. నగరజీవి…నీ సగటు ఆయుష్షు ప్రతి రోజు లెక్క పెట్టుకోవాల్సిందే..

 

నిన్న చెప్పటం మరిచా…కొత్త రకం యాడ్‌ మార్కెటింగు కూడా వస్తోందిప్పుడు. అదేమిటంటే ఒక పెద్ద ట్రక్ వాహనం మీద భారీ హోర్డింగును వూరంతా తిప్పడం. అది కూడా మంచి ట్రాఫిక్ రద్దీ సమయాలలో. ఆ సమయంలో అయితే ఎక్కువ మంది చూస్తారు కదా…అదీ అవుడియా అన్నమాట.

కొస మెరుపు :

నిన్నటి ఈదురు గాలులకు చిరిగిపోయిన జైంట్ యాడ్ హోర్డింగుల ప్రకటనలను మొత్తం శుభ్రం చేశారు. ఇప్పుడు చాలా వాటికి కేవలం ఫ్రేములు మాత్రమే వున్నాయి. అయితే కళ్ళు జిగేల్మనిపించే విద్యుత్తు కాంతులు మాత్రం యధాతధం. ఈ భాధ్యతారాహిత్యం మీద ఎవరికి, ఎలా ఫిర్యాదు చెయ్యాలో కాస్త తెలిస్తే చెప్పండి దయ చేసి..

Wednesday, April 11, 2007

ప్రాణ సంకట బాదు

మన భాగ్యనగరంలో ఒక రోడ్డును దాటాలంటే సామాన్యమా? మన మీద నుంచైనా వాహనాన్ని పోనిస్తారేమో కానీ, ఆపే సమస్యే లేదు. ఇది చూడండి. తీసిన వ్యక్తి ఎవరో గానీ గుండె ధైర్యం మస్తుగా వున్నవాడు.

Saturday, April 07, 2007

మౌనమేలనోయి...ఈ మరపురాని రేయీ

గాత్రం : ఎస్.జానకి

చిత్రం : సాగరసంగమం

Thursday, April 05, 2007

ఆకాశం ఏనాటిదో...అనురాగం ఆనాటిది.

మనందరిని సుస్వర స్వర ఝరిలో ముంచి తేల్చడమే ఊపిరిగా బ్రతుకుతున్న మన జానకి పాటలలో కొన్ని వరుసగా ఇక్కడ వుంచడానికి ప్రయత్నిస్తా. 

Wednesday, April 04, 2007

మూడు వందల వీరులు

300. ఇది ఒక సినిమా పేరు. గత ఆదివారం ఈ సినిమా చూశాను. లక్షల మంది వున్న పర్షియన్ సైన్యాన్ని స్వేచ్చనే వూపిరిగా, వీరత్వాన్ని ఆభరణంగా ధరించే ఒక స్పార్టన్ రాజు (లియొనార్డైస్) మెరికల్లాంటి, మడమ తిప్పని మూడు వందల యోధులతో ఎలా ఎదుర్కున్నాడో చూపే చిత్రం ఇది. 480 BC లో జరిగిన థెర్మోపైలే యుద్ధ అధారంగా దీనిని నిర్మించారు.

అద్భుతమైన సినిమాటోగ్రఫీ ఈ చిత్రంలో చూడదగ్గది. గ్లాడియేటర్ చిత్రాన్ని కొన్ని చోట్ల గుర్తుకు తెస్తుంది. అరే రస్సెల్ క్రో ఈ చిత్రంలో రాజు పాత్ర పోషించాల్సింది అని అనిపించింది కాసేపు.

దర్శకుడు గంటన్నర పాటూ అసలు సుత్తి అనేదే కొట్టకుండా ప్రేక్షకులను ఆ యుగంలోనికి తీసుకు పోయాడు.

క్సెరెక్సెస్ అనే పర్షియన్ రాజు వేషధారణ కూడా చాలా విచిత్రంగా వుంటుంది. దీనిపై ఇరాన్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.

అయితే చిన్న పిల్లలను మాత్రం ఈ సినిమా చూడనివ్వక పోవటం మంచిది. రక్తం ఏరులై పారటం, శవాలు గుట్టలై పడటం అతియోశక్తులు అసలే కావు ఈ చిత్రంలో…అసలు శవాలతో ఒక గోడనే కట్టే సీను కూడా ఉంది.

స్పెషల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా వుంటాయి. సాంకేతికంగా "ఇరగ దీసారు" :-) యుద్ధ సన్నివేశాలు అయితే చెప్పనక్కరలేదు. లక్షల మంది వచ్చి పడినా సడలని ధైర్యం, యుద్ధ నైపుణ్యం చూపించడంలో చాలా శ్రద్ధ చూపించారు.

ప్రేమ, స్వేచ్చ, రాజ కర్తవ్యం, నాయకత్వ పటిమ, ధీరత్వం వంటివి ఈ చిత్రం తాలుకా కధా వస్తువులు.

2007 ఆస్కార్ పందెంలో పాల్గొనే ధైర్యం నిండుగా వున్న చిత్రం ఇది.

Thursday, March 29, 2007

గ్రహాంతరవాసులు - క్రికెటాట

toondoo.com అనే అతి చల్లని (cool) వెబ్ సైటు మనకు అతి సులభంగా వ్యంగ్య చిత్రాలు చేసుకునే సదుపాయం ఇస్తుంది. నా మొదటి కార్టూను ఇలా ఏడిసింది :-)

alien cricket

Tuesday, March 27, 2007

కదులుతున్న క్రికెట్ డొంక..సంచలనాత్మక SMS

ఫ్లాష్ న్యూస్ : సీ.యన్.యన్ ఐ.బి.యన్ లైవ్ వారు ఇప్పుడే సమర్పించిన వార్త కదంబం (లైవ్) సంచలనాత్మక విషయాలను బయట పెట్టింది.

వారి ప్రకారం…

గ్రెగ్ ఛాపెల్ ఒక బాంబు లాంటి SMS ను సీనియర్ క్రికెట్ పాత్రికేయుడు రాజన్ బాలా కు పంపాడు…అది చాలా కొత్త విషయాలను, BCCI లో లుకలుకలను బయట పెడుతోంది. అందరూ గ్రెగ్ ఛాపెల్ మీద మండి పడటం సహించలేని రాజన్ బాల ఆ SMS ను బహిర్గతం చేసారు.

అందులోని కొన్ని విషయాలు…

  • గ్రెగ్ ఛాపెల్ సీనియర్లు (సచిన్, సౌరవ్, ద్రావిడ్, సెహ్వాగ్) లను ఇంటికి పంపమని పోరుతూనే వున్నాడు.
  • మీడియా భయంతో BCCI అందుకు అంగీకరించలేదు
  • సురేశ్ రైనా తప్పని సరిగా వుండాలని ఛాపెల్ పట్టుబట్టాడు
  • సురేశ్ రైనా వుండటం BCCI కి ఇష్టం లేదు
  • సెహ్వాగ్ వుండి తీరాల్సిందే అని ద్రావిడ్ పట్టు పట్టాడు (కరణ్ థాపర్ తో వెంగ్ సర్కార్)
  • కార్తీక్ ను తీసుకోవాలని ఛాపెల్ కోరాడు. అతనిలో నాయకత్వ లక్షణాలు వున్నాయని అలా కోరాడు
  • సచిన్ వైస్ కెప్టెన్ అవ్వటం ఛాపెల్ ను విస్మయ పరిచింది. సచిన్ కెప్టెన్ గా పూర్తిగా విఫలం చెందిన రికార్డ్ వుండటం అందుకు కారణం.
  • సీనియర్లు, యువ క్రికెటర్లను వరల్డ్ కప్ టీమ్ లోనికి ఎంచుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు
  • ఛాపెల్ రాజన్ తో : మీరన్నట్లు యువరాజ్ ను తీసుకోవటం ఒక రిస్క్. అతడు తననొక స్టార్ క్రికెటర్ గా భావించుకుంటాడు. అతను ఒక ఎదుగుతున్న క్రికెటర్ మాత్రమే.
  • రాజన్ బాల : మొహమ్మద్ కైఫ్ కు ఇండియా-A టీమ్ కెప్టెన్ గా అద్భుతమైన రికార్డులున్నాయి. అతడిని ఎందుకు పక్కన పెట్టారో అర్ధం కాలేదు.


ఇదిలా వుండగా BCCI , ఛాపెల్ విషయమై నిలువుగా చీలిందని వార్త

Saturday, March 24, 2007

భారతీయులు…క్రీడా స్పూర్థి

హమ్మయ్య ఒక పని అయిపోయింది.

  • ఇక నోరు తెరుచుకుని TV చూసే పని తప్పింది.
  • కూరలు మాడిపోయే ప్రమాదం తప్పింది.
  • గుండె పోట్లతో అభిమానులు పోయే ప్రమాదాలు తప్పాయి.
  • వెధవ పాచి పళ్ల దాసరి TV Ads అదే పనిగా చూసే పనీ తప్పింది.
  • ఆఫీసుల్లో పని మానేసి టీవీ గదిలో పని చేసే పని తప్పింది
  • లక్షల యూనిట్ల విద్యుత్తు ఆదా కాబోతున్నది.
  • మరి కొన్ని లక్షల కేలరీల శక్తి మనందరిలో ఆదా కాబోతున్నది
  • కొన్ని వేల మందికి కంటి చూపు కొద్దిగా మందగించే ప్రమాదమూ తప్పింది.

ఇన్ని మంచి పనులు జరుగుతుంటే ఈ మీడియా ఏంటో ….ఏదో ఇండియా క్రికెట్ జట్టు కలసికట్టుగా సతీ సహగమనం చేసినట్లు గోల పెడుతుంది? నిజానికి మన భారత ప్రజలకు ఈ తిట్టే హక్కు వుందా?

 

చూద్దాం !

 

మన ఉపఖండంలో మనం పట్టించుకునే ఒకే ఒక ఆట "క్రికెట్టు". అది కూడా భారత జట్టు ప్రపంచ కప్పు గెలిచాకనే ఎక్కువయింది. అసలు మనలో ఈ ఆట పట్ల నిజంగా అంత అభిమానం వుందా? లేదా విజయం పట్ల అభిమానం వున్నదా? పశ్చిమ దేశాలలో, రష్యన్ దేశాలలో తీసుకుంటే…వారు ఆటను అభిమానిస్తే అన్ని స్థాయిలలో అభిమానిస్తారు. అంటే హైస్కూలు స్థాయిలో జరిగినా ఒక రెండు వందల మంది అభిమానులు గుమిగూడుతారు. ఆ స్థాయిలో కూడా చాలా మనసు పెట్టి ఆడుతారు. నిజానికి పెద్ద పెద్ద కోచ్‍లు అందరూ అక్కడి నుంచే వస్తారు. ప్రతీ రాష్ట్రానికి ఒక అంతర్జాతీయ స్థాయి జట్టు వుంటుంది. వారికి ఎనలేని అభిమానులూ వుంటారు.

 

మన దేశంలో మిగతా ఆటలు వదిలేస్తే…క్రికెట్టుకు కూడా ఈ స్థాయి ఇంకా లేదు. రెండు రాష్ట్రాల మధ్య రంజీ మ్యాచ్ అయితే ఎంత మంది చూస్తున్నాం? మనోళ్లు అభిమానించేది ఒక స్థాయికి వెళ్లి, గ్లామర్ సంపాదించుకున్న ఆటగాళ్లనే అనటంలో సందేహం లేదు. ఈ అభిమానం ముదిరి, వెర్రిగా మారి, తరువాత హక్కుగా మారింది. నిజానికి ఇప్పుడున్న క్రికెట్ జట్టు ఒక ప్రొఫెషనల్ జట్టు. అంటే వారు ప్రభుత్వం తరపున అధికారకంగా ఏమీ ఆడటం లేదు. వారికి ఒక స్వతంత్ర కార్యాలయం వుంది. అయితే మన అభిమానం వారికి ఎనలేని సిరి సంపదలు తెచ్చిపెట్టిన విషయం మాత్రం వాస్తవం. అయితే ఆ కారణంగా మనం వాళ్లని ప్రతీ వైఫల్యానికి తిట్టవచ్చా అంటే…అది మన విజ్ఞత మీద, హుందాతనం మీద ఆధారపడి వుంది. ప్రొఫెషనల్ స్థాయి క్రీడ అయిన టెన్నిస్ లో కూడా ఈ అవస్థ తప్పలేదు. మోనికా సెలెస్ వంటి అద్భుత క్రీడాకారిణి శాశ్వతంగా తప్పుకోవాల్సివచ్చింది. మన దేశంలో ఆ స్థాయి రాకూడదని ఆశిద్దాం.

 

ఆటలో గెలుపు, ఓటములు సర్వ సాధారణం. అందులో ఒక రోజు క్రికెట్టు అనేది శకుని జూదం లాంటింది. ఒక మేఘం కూడా ఆటలో భాగం కావచ్చు. గంటకు దాదాపు 135 మైళ్ల వేగంతో దూసుకు వచ్చే బంతి బ్యాటును తాకే మధ్య సమయం దాదాపు 2 సెకండ్లు మాత్రమే. అంత తక్కువ సమయంలో కూడా బంతి తాలుకా వాలు, వేగం, పిచ్ స్వభావం అంచనా వేస్తూ, క్రికెట్లో వున్న పదకొండు రకాల షాట్లలో ఏది ఆడాలో నిర్ణయించుకుని ఆటగాడు సిద్ధం కావాలి. ఇదంతా ఆటగాడి నాడీ వ్యవస్థ పైన, మెదడు, రక్త ప్రసరణ పైన అత్యంత విపరీతమైన వత్తిడికి గురిచేస్తుంది…ప్రతీ బంతికి కూడా…అది కూడా కోట్ల అభిమానుల ఆశల మధ్య. ఇవన్నీ చాలక ఇప్పుడు మన అభిమానం వెర్రిగా మారితే అది మరింత ఒత్తిడిని పెంచి, స్థైర్యతను దెబ్బతీయక మానదు. కంగారూలు జగజ్జేతలవటానికి కారణం ఇదే…ఆసీయులు క్రికెట్ ని అభిమానిస్తారే తప్ప….శాసించరు. ఇళ్ల మీద దాడి చెయ్యరు.

 

వీటికి తోడు మన చెత్త మీడియా…సగం దరిద్రానికి కారణం వీళ్లే…దండలు వేసి పులులు అనేది వీరే….కాగితం పులులు అనేదీ వీరే…ఒక్క క్రికెటర్ కూడా ఇప్పటి వరకు "మన జట్టు పులుల జట్టు" అని ఎప్పుడూ అనలేదు. ఆఖరికి BCCI కూడా…ఇక మనం మీడియా గురించి మాట్లాడితే అంతు వుండదు.

 

కాబట్టి…మనం క్రీడా స్పూర్థికి ముందు పదును పెట్టుకుని…ఓడితే హాయిగా నవ్వేసి వదిలెయ్యటం అలవాటు చేసుకుంటే మంచిది. అంతే గానీ ఏదో మన జేబు నుంచి ప్రతీ నెలా క్రికెట్ జట్టుకు ఒక పది రూపాయలు చందా కడుతున్నట్లు రెచ్చి పోయి తిట్టడం, కాల్చడం, దాడి చెయ్యటం చేస్తే అది ఈ దేశానికి భవిష్యత్తులో చాలా చెడ్డ పేరు తెచ్చే ప్రమాదం వుంది.

Sunday, March 11, 2007

ది దోహా డిబేట్ : బి.బి.సి

ఈ కార్యక్రమం మన దేశంలో చేసివుంటే BBC ని నరకయాతనకు గురిచేసేవారు మన రాజకీయనాయకులు. ది దోహా డిబేట్స్ అనే కార్యక్రమం అరబ్ దేశాలలో BBC చేస్తున్న అత్యంత సాహసోపేతమైన చర్చా కార్యక్రమం. మహామహులు పాల్గొనే ఈ కార్యక్రమంలో ఉన్నదున్నట్లు కుండ బద్దలుకొట్టి మరీ మాట్లాడుతారు. నిన్న రాత్రి నేను చూసిన కార్యక్రమం కూడా అలానే వుంది. వీలయితే మీరూ చూడండి..

The Doha Debates (ఈ రోజు ఆదివారం మరలా 9:40 PM IST కి)

ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది టిమ్ సెబాష్టియన్ (ప్రఖ్యాత BBC HardTalk నిర్వాహకులు).

ఇది చూసాక అనిపించింది...మన దేశంలో ఇంత ధైర్యంగా నిజం మాట్లాడే రోజు ఎప్పుడొస్తుందా అని. BBC అభినందనీయురాలు.

Saturday, March 10, 2007

ప్రజాసాహిత్యం అంటే ఏమిటి? కాస్త చెప్పండీ...

ఈ మధ్యనే ఆంధ్రజ్యోతిలో ఒక వ్యాసం చదివాను. దాని లంకె ఇక్కడ ఇస్తున్నాను. అందులో చెప్పిందేమిటంటే రచయతలు "ఇజాలలో" పడి పాళీల ములుకులు వంకర చేసుకుంటున్నారని. ఒకటే మూసలో రాసేస్తూ, ఒకటే కోణం నుంచి చూస్తు రాయటం అన్న మాట. ఉదాహరణలు రంగనాయకమ్మ గారు. మొదట్లో నాకు తెగ నచ్చిన రామాయణ విష వృక్షం రెండు అధ్యాయాలు దాటే సరికి రంగనాయకమ్మ గారికి రాయటంలో మరీ వెకిలితనం శృతి మించినట్లు కనిపించింది. అయితే ఆమెను తప్పుపట్టే స్థాయి నాకు లేదనుకోండి. నా అభిప్రాయం అది. అంతే.

ఇక విషయానికొస్తే…

మూస రచన అంటే ఇది.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రజాకళ వారు ప్రచురించిన కవిత చదవండి. బుర్ర బద్దలు కొట్టుకున్నా దాని భావమేంటో నాకర్ధం కాలేదు. దానికి తోడు ఆ బొమ్మ తాలుకా అంతరార్ధం ఏమిటో కూడా అర్ధం కాలేదు. (మార్పు : బొమ్మ ఇప్పుడు మార్చబడింది)

అర్ధం అయ్యిందల్లా...ప్రజాకళ లేదా ప్రజా సాహిత్యం అంటే "యుద్ధోన్మాది, రక్తం, శవాలు, రష్యా" లాంటివి వుండి తీరాలేమో అనిపిస్తుంది. నేనైతే "ఏరువాకా సాగరో .." లాంటి పాటలు కూడా ప్రజల సాహిత్యం అని నమ్మేవాడిని. ఈనాటి ప్రజా సాహిత్యం మనకర్ధం కావటం అటుంచి, పల్లె ప్రజలలో ఒక్క ముక్క అర్ధం అవుతుందో లేదో తెలియటం లేదు. సాదా మాటలలో, ఉదాత్త సాహిత్యంతో ప్రజలను రంజించి, ఆలోచింప చేసిన పాటలు, సాహిత్యం ఎన్ని రాలేదు? పాటల వరకూ ఎందుకు, "నిగ్గ దీసి అడుగు, సిగ్గు లేని జనాన్ని….మారదు లోకం" అంటూ మాటలతోనే పరుగులు పెట్టించిన సాహిత్యం ప్రజా సాహిత్యం కాదా? "ఘర్జన, దూషణ, ఘోషన, అమెరికా, రక్తం, కామ్రేడ్, శవాలు, నక్కలు, ముక్కలు, కుక్కలు, బూర్జువా" లాంటి పదాలు దాటి ఈ ప్రజా కవులు ముందుకు పోలేరా?

నిజం ఒప్పుకోండి…ప్రజా సాహిత్యం విఫలం కావటానికి కేవలం రచయతలే కారణం. ప్రతీ ఒక్కడు మోనార్కే. రాస్తే సద్దాం మీద ఒక వంద కవితలు…లేక పోతే ప్రపంచ బ్యాంకుపై కోటి తిట్లు…ఇవేనా ప్రజా సాహిత్యం…చస్తే కాదు..కావాలంటే మక్సీమ్ గోర్కీని పోయి అడగండి…లేదా పావెల్ తాలుకా "అమ్మ" ని అడగండి.

Thursday, March 08, 2007

అంతర్జాతీయ మహిళల దగా దినోత్సవం

ఈ రోజంతా ప్రపంచంలో వున్న సర్వ మహిళా జనం అమాయకంగా మురిసిపోయిన రోజు ఇది. ఓహో మీరు అదుర్స్, మీరు కత్తి, మీరు కమాల్ అని ఈ రోజంతా ఒకటే ఊదర. రకరకాల కంపనీలు మహిళా సాధికార దినోత్సవాలు హడావిడిగా జరిపేసాయి. అందులో కూడా పాల్గొన్న వారంతా సాధికారత సాధించిన వారే. మళ్ళీ వారికి దగ్గులు నేర్పడం ఎందుకో అర్ధం కాదు. ఏదైనా పల్లెటూరుకో, సిటీలో ఏదో గల్ల్లీకి వెళ్లి, అక్కడ అమ్మలక్కలందరికి అవసరమైన సాధికారత గూర్చి చెప్పొచ్చు కదా…

RTC బస్సులలో ఈ విధంగా రాసి వుంటుంది. "మహిళను గౌరవించటం మన సంప్రదాయం. వారి సీట్లలో వారినే కూర్చోనిద్దాం". ఇక్కడ "మనం" ఎవరు? ఆ "మనం"లో మహిళలు లేరా? "కూర్చోనిద్దాం" ఏమిటి? ఏదో "అవి కుక్క బిస్కట్టు, దానినే తిననిద్దాం" అన్నట్లు? ఇవి రాసిన వెధవలకున్న భావ దారిద్ర్యం మనలో చాలా మందికి ఉంది. బయట ఒప్పుకోలేకపోతే…టాయిలెట్లోకి వెళ్లి ఒప్పేసుకోవచ్చు. అక్కడెవరూ వుండరు.

ఇదే మంచి రోజని ఒక ఎక్స్ ప్రెస్ రైలులో మహిళా బోగీ దోపిడీకి గురి అయింది. రాజకీయ నాయకులందరికీ ఒక్క సారి మహిళా బిల్లు గుర్తుకొచ్చింది (ఊహించిందే…) పాపం మహిళా ప్రజా ప్రతినిధులందరూ ఒకే తాటిపై నిలబడినా లాభం లేక పోయింది. అందరు మగరాయిళ్ళు నిశ్శబ్ధంగా చోద్యం చూసారు. బల్లలు చరచడం ..పోడియం పైకి దూసుకుపోవడం అంతకన్నా మరచిపోయారు. చివరికి చప్పటి గొంతుతో మన ప్రధాని "అందరి సానుకూలతతో" ఈ బిల్లును ప్రవేశపెడతామని చెప్పారు. నేరస్తుల మీద ఒక ఫైలును తిప్పిన రాష్ట్రపతినే ఏకగ్రీవ తీర్మానంతో ఖంగు తినిపించి సంతకం పెట్టించిన మన ప్రజా ప్రతినిధులకు ఈ బిల్లు అంటే తెగ చేదు. అసలు 33% ఏమిటి? 50% శాతం ఎందుకు ఇవ్వకూడదు? అలా జరిగిన రోజు తప్పని సరిగా మన పార్లమెంటులో మంచి వాతావరణం, పనికి వచ్చే చర్చలు జరుగుతాయి.

ఒక టీవీలో సాధికారత సాధించిన మహిళలంటూ ర్యాంప్ మోడల్లు, వర్ద్గమాన తెలుగు సినీ హీరోయిన్లను (పేర్లు మనకు తెలియవు లెండి) తెగ ఇంటర్వూలు చేసేసారు. మహిళలంటే అత్యంత నీచంగా ప్రవర్తించే సినిమా పరిశ్రమ నుంచా ఉదాహరణలు? అదా సాధికారత?

గత సంవత్సరం లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో జరిగిన అత్యాచారాల సంఖ్య దాదాపు 900. అంటే 356 రోజులలో 900. ఇవి కేవలం ఠాణాలలో నమోదు అయినవి మాత్రమే. రోజుకు దాదాపు నలుగురి అన్యాయానికి గురి అవుతున్నారు మన రాష్ట్రంలో. ఇదే విషయం మీద ఆ మధ్య రాఖీ అని ఒక మంచి సినిమా వచ్చింది. ఇవి ఏమైనా తగ్గుతున్నాయా? లేవే? అసలు మహిళా కమీషన్ ఏం చేస్తుంది? వారి ప్రోగ్రెస్ ఫలితాలు ఎక్కడ?

ఇకనైనా ఈ మహా మగ లోకం కుహానా స్త్రీ వాదాలు మాని, స్త్రీని ముందు మనిషిగా గౌరవించటం నేర్చుకుని మసలుకోవడం మంచిది. అదేదో ఇంట్లో నుంచే మొదలు పెడితే మరీ మంచిది.

(ఈ వ్యాసం లో మీ మగ పాత్ర లేదని అనిపిస్తే మీరు మా మంచి మగరాజన్న మాట, ఏ మాత్రం వున్నట్లనిపించినా…ఏమి అనుకోమాకండి…ఇది నా ఆలోచనలకు ఒక రూపం, ఒక ఆశ అంతే)

Wednesday, March 07, 2007

క్రికెటాభిమానులూ ..జర భధ్రం

ఈ నెల రోజులూ ప్రపంచ క్రికెట్ దేవతలు కనువిందు చెయ్యనుండటం చేత…మీ అందరూ తీసుకోవలసిన ఒకే ఒక జాగ్రత్త ఒకటున్నది…

మ్యాచ్ విశేషాలను చచ్చినా ఒక ఛానల్లో మాత్రం చూడవద్దు. ఏ ఛానలో అర్ధం అయిందా? కాకపోతే ఇవి చదివి అర్ధం చేసుకోండేం !

౦౧. ఇది ఒక వార్తా ప్రసార వాహిక

౦౨. సమాజం కోసం పడి….చచ్చి పోతూ వుంది.

౦౩. నిరభ్యంతరంగా అసభ్య దృశ్యాలను సమాజ శ్రేయస్సు కోసం ప్రసారం చేయగల సత్త వుంది

౦౪. అందరూ అదృష్ట సంఖ్యగా భావించే ఒక సంఖ్యతో వీరికి చాలా దగ్గర

ఇప్పుడు బుర్రలో దీపం వెలిగుంటుంది.

క్రికెట్ వ్యాఖ్యానన్ని వీరి కంటే పరమ దరిద్రంగా, నీచంగా ఎవరూ చెప్పలేరు. కావాలంటే పందెం కాస్తా…

మచ్చుకు ఈ రోజు వారి వ్యాఖ్యానం ఇలా వుంది….

" వన్ ట్వంటీ రేంజి దాటలేని పఠాన్ తో ఎటాక్ స్టార్టు చెయ్యించటమే మన బౌలింగ్ రిసోర్సెస్ కెపాసిటికి అద్దం పట్టింది. యువరాజు డ్రీమ్ స్పెల్, స్పిన్ ట్విన్స్ కుంబ్లే, హరభజన్ రొటీన్ కంట్రిబ్యుషన్స్ తో……"

మీకి నాకి మాట్లు నమ్మకమ్ లేక్పోతే ఈ రోజుది రాత్రి వార్తలలో ఆ ఛానల్ సూసి నాకి మర్‌లా చెప్పండి. (ఇదే కాస్త నయమేమో…వారి తెగులు కన్నా) :-)

కాబట్టి…ఇక చెప్పడానికి ఏమీ లేదు…చూస్తే Live చూడండి. లేకపోతే హాయిగా కూడలిలో ఎవరో ఒకరు వ్యాఖ్యానం రాస్తారు..చదవండి..లేకపోతే మంచి వార్తా పత్రికలోనో చదవండి. అది కాదనుకుంటే హాయిగా పడుకోండి.

ఇలా అయితే కష్టం

ఇండియా చెత్త బౌలింగు...దానికి పోటీనా అన్నట్లు నెదర్లాండు టెస్టు బ్యాటింగు. ఎంత ప్రాక్టీసు మ్యాచ్ అయినా ఇంత చెత్తగా ఆడాలా? :-(   పదిహేను ఓవర్లలో ఒక వికెట్టుకు నలభై పరుగులా...ఛీ ఛీ

నేను తీవ్రంగా ఈ బ్లాగుముఖంగా నిరసన వ్యక్తం చేస్తూ నిద్రకుపక్రమిస్తున్నాను(ఇంకేమీ చెయ్యలేక)

Sunday, March 04, 2007

ఈ విషయం మరో ముగ్గురికి చెప్పండి...

చాలా రోజుల తర్వాత ఏపి మీడియాలో వజ్రోత్సవ తగవు మీద ఒక జాబు వచ్చింది. ఆ జాబు పాఠంలో కొంత యూనికోడ్లో మీ కోసం. ఇందులో ప్రస్తావించిన పేర్లు, విషయాల మీద నాకు ఏ మాత్రం సంభంధం లేదు. మీకు ఏమైనా అభిప్రాయాలు రచయతకు తెల్పాలని అనిపిస్తే apmedia.blogspot.com లో తెలపండి.

"రాజకీయాలు, సినిమాలు - రెండు రంగాల్లోనూ ఎంతో డ్రామా ఉంటుంది. ఎందరో నటులు కూడా ఉంటారు. ఆప్యాయంగా పలకరించుకోవటం, అభిమానంగా మాట్లాడుకోవడం- ఇవన్నీ బయటకు కనిపించేవి అయితే లోపల్లోపల కారాలు, మిరియాలు నూరుతూ వీలయునంత లోతైన గోతులు తవ్వటం కూడా మనకు తెలుసు. …..

ఇక పూర్తి పాఠం ఇక్కడ చదవండి.

రంగు పడిందిరో !

ఈ రోజు హోలీ…మన దేశంలో జరిగే అందమైన పండుగలలో ఒకటి. అయితే ఈ రోజు నేను ఎక్కడికీ బయటకు వెళ్లలేదు. చాలా రోజుల క్రితం జరిగిన ఒక కామెడీ సంఘటన వలన హోలీ అంటేనే ఏదో తెలియని అయిష్టత ఏర్పడిపోయింది. ఆ సంఘటన గుర్తుకొస్తే ఇప్పటికీ మా స్నేహితులందరం తెగ నవ్వుకుంటాం.

పీ.జీ చేస్తున్న రోజులలో కొంతమంది స్నేహితులతో కలసి విశాఖలో మద్దిలపాలెంలో కొన్ని రోజులు వున్నాను. అప్పుడు వచ్చిన హోలీ రోజు జరిగినది ఎప్పటికీ మర్చిపోలేని కామెడీ.

తెల్లవారు జామున ఏడు గంటలకు అనుకుంటా తలుపు ఎవరో చాలా వైల్డ్ గా బాదుతున్నారు. బద్ధకంగా అటు ఇటూ దొర్లుతున్న నేను "ఇది కల…ఇది కలే కదా" అని కోట శ్రీనివాసరావు టైపులో అనుకుంటుండగా, అలా అనుకోలేని నా స్నేహితుడు వెళ్లి తలుపు తీసేశాడు. అప్పుడు తీసిన తలుపు మరలా తియ్యటానికి మాకు మధ్యాహ్నం రెండు వరకూ కుదరలేదు..ఎందుకో తెలియాలంటే మొత్తం చదవాలి మరి.

తలుపు తీసి చూసిన వెంటనే మెరుపు వేగంతో మొహాల మీద రంగులు ఎవరో పులిమేస్తున్నారు. నిద్రలోనుంచి మొత్తం తేరుకుని చూస్తే మా రాజు గాడు. వాడు తెళ్లారే సరికి మరో కోతి పనుల స్పెషలిష్టు అమర్, మిగతా వాళ్లను వేసుకుని మా మీదకు దండయాత్రకు వచ్చాడన్న మాట. మాకు జరిగిన సత్కారమే మిగిలిన వారికి జరిగిందనటానికి వాళ్ల మొహాల్లో కనిపిస్తున్న అతి ఆనందం తెలుపుతుంది. అదీ కాక మమ్మల్ని త్వరగా తయారు కమ్మని ఆదేశాలు జారీ అయ్యాయి. కష్టం మీద కాలకృత్యాలు తీర్చుకుని, ఒక పనికి రాని టీ-షర్టు వేసుకుని ఆ గుంపులో పడి రోడ్డు మీద పడ్డాం. రోడ్ల మీద ఎక్కడ చూసిన తెగ హడావిడిగా రంగులు జల్లుకుంటూ తిరుగుతున్నారు. అలా వెళ్తూ మా బెంగాలీ ఫ్రెండు సౌరవ్ భౌమిక్ ఇంటికి వెళ్లాం…వాడి సుడి బాగుండి ఎక్కడికో తెలియని ప్రదేశానికి అజ్ఞాతంలోనికి వెళ్లిపోయాడు. వాడికి ఎవరయినా ఉప్పందించారో ఏమో మరి.

మొత్తానికి ఎలా అయితేనేం బయలు దేరి అలా RTC X Roads కు వచ్చాం. ఇంతలో అతి దగ్గరలో ఒక పోలీస్ జీప్ కనిపించింది. వైజాగ్‌లో ఎలాగూ పోలిస్ హడావిడి ఎక్కువే గదా అని వారి దగ్గరగా వెళ్లాం. అందరూ త్వరగా ఎక్కాలమ్మా…త్వరగా అని వినిపించింది. ఎవరిని వీళ్లు ఎక్కమంటున్నార్రా అని చూస్తే…అక్కడ మేం తప్ప ఇంకెవరూ లేరని అర్ధం అయింది. కానిష్టేబుల్ కొద్దిగా మర్యాదగా చెప్పాడన్నమాట. మా వాడు ధైర్యంగా ఎందుకు,ఏమిటి, ఎలా అని వారిని అడిగాడు. పోలీస్ ఎప్పుడయినా జవాబు చెప్తాడా..? ఉట్టిదేనమ్మా…కొద్దిగా అల్లర్లు అవుతున్నాయి. మిమ్మల్ని తీసుకెల్లి ప్రశ్నలు నాలుగడిగి వదిలేస్తారంతే అన్నాడు. సరే ప్రశ్నలన్ని స్టేషన్ హెడ్డు గారినడగండి, ముందు ఎక్కండి బాబు అన్నాడు. మేము ఏం తప్పు చెయ్యలేదు కనక హాయిగా లిఫ్టు అడిగి ఎక్కి కూర్చున్నట్లు జీపులో మొత్తం పొలో అని ఎక్కేసాం. మేం పోలీసుల మీద, వారు మా మీద జోకులేసుకుంటుండగా 2-టౌన్ పోలీస్ స్టేషన్ వచ్చేసింది. అదే జీవితంలో మొదటి సారి ఒక పోలీస్ స్టేషన్లోనికి పోయి కూర్చోవటం. అక్కడా ఒక ఏభై మంది వరకూ విధ్యార్ధులు వున్నారు. అందరి మొహాలు రంగు రంగులతో కోతుల్లా వున్నారు.

కాసేపు హెడ్డు గారిని సతాయించితే మాకొక దండం పెట్టేసి అక్కడ గోల చెయ్యకుండా కూచోండి బాబు అని బెంచీలు చూపించారు. సరే అని కూర్చున్నాం. మనసు వూరుకోక అలా వైర్లెస్ సెట్లో వస్తున్న మాటలు వినసాగాం..

ఆ సార్ ఇక్కడ ఒక పది మందిని తెస్తున్నాం సార్…ఓవర్

లేదు సార్..నేను బీచ్ పార్టీ సార్…అవును సార్ మొత్తం ఒక ఇరవై మంది వుంటారు సార్ ఓవర్

ఇలా సాగిపోతుంటే…ఒకరి మొహాలు ఒకరం చూసుకున్నాం. నవ్వటానికి కండరాలు మొరాయిస్తున్నాయ్. మెల్లగా ఒక కానిస్టేబుల్ ని కదిపితే అసలు విషయం తెలిసింది. అదేమిటంటే…

ఆ రోజు చాలా మంది ఆకతాయిలు రంగులలో కోడిగుడ్లు కలిపేసి జనాల మీద చల్లటం మొదలు పెట్టారు. కొంత మంది దారిన పోతున్న నన్స్ మీద పొయ్యటంతో వాళ్లు ఫిర్యాదు చేసారంట. అంతే ఇక విశాఖ పోలీసులకు అసలే పని వుండదు. ఇలాంటి అవకాశాలు వదులుతారా? జీపులేసుకుని రోడ్ల మీద పడ్దారు. ఫలితం మేం ఇక్కడా ఈ విషయాన్ని గురించి ఆరా తీస్తూ….కూర్చున్నాం. నాకు ఆ భయం కంటే ఆ రోజు కాలేజీలో వున్న ఇంటర్నల్ పరీక్ష మీదే దృష్టంతా….డుమ్మా కొడితే ఫలితాలు ఎలా వుంటాయో చెప్పలేం. కాసేపయ్యాక మేమందరం ఒక వంద మంది తయారయ్యాం. అప్పట్లో సెల్ ఫోన్లు అంతగా లేవు కనక ఎవరినీ పిలవలేని పరిస్థితి. ఒక పక్క ఆకలి.

మా అందరినీ మేడ పైన ఉన్న ఒక పెద్ద రూములో సమావేశపరిచి మమ్మల్ని అసలు ఎందుకు తీసుకొచ్చారో ఒకతను వివరించాడు. అందరూ పిల్లి గుడ్లేసుకుని విని "ఆ మనం కాదులే" అనుకున్నారు. నిజానికి అక్కడున్న వాళ్లందరూ అమాయకులే. మొహాన రంగున్న పాపానికి అక్కడ వున్నారు.ఒకడు మెల్లగా హెడ్డు దగ్గరకు వెళ్లి, "సార్ నేను AVN College సీనియర్ ని సార్" అన్నాడు…ఏదో డాన్ కి ఇంట్రడక్షన్ ఇస్తున్నట్లు. హెడ్డు అదోలా మొహం పెట్టి…"అహా అలాగా…అయితే ఇప్పుడు ఏంటి?" అన్నాడు. పప్పులుడకవని అర్ధం అయ్యి వాడు మెల్లగా జారుకున్నాడు.

మా స్నేహితులలోని ఒకడు లాయర్ గారి అబ్బాయి. వాడు మెల్లగా ఎలాగో ఒక ఫోన్ చెయ్యించాడు ఇంటికి. ఆ తరువాత మేం ధీమా సరదాగా కూర్చుని మాట్లాడుకున్నాం. మధ్యాహ్నం దాదాపు ఒంటి గంటకు మా ఎనిమిది మందిని మాత్రమే వదిలారు. అది కూడా ఆ లాయర్ గారు చేసిన కాల్ వలన. మేం హమ్మ్యయ్య అనుకుని ఇంటికి వచ్చి తలుపు మరలా తీసే సరికి మధ్యాహ్నం రెండు గంటలయ్యింది. ఆ తరువాత తెలిసిందేమిటంటే, పాపం మిగిలిన వాళ్లందరికి రాత్రి ఎనిమిది గంటల వరకూ వుంచేసారంట. అప్పుడు వేసింది మాకు భయం :-)

అలా జరిగింది ఆ హోలీ. రంగులన్నీ కలిస్తే తెలుపు రంగు అవుతుంది. మాకు మాత్రం ఎరుపు రంగు తయారయింది. చివరికి రంగు పడింది :-)

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name