ఈ మధ్య రాష్ట్ర రాజకీయాలు చూస్తుంటే, ఎందుకురా బాబు పుట్టాం ఈ రాష్ట్రంలో పోయి పోయి అనిపిస్తుంది. భాషా ప్రాతిపదిక మీద ఒక రాష్ట్రం పుట్టినందుకు కోపమొస్తుంది. ఎక్కడి నుంచో ఒక తెల్లోడు వచ్చు నాలుగు వేల కోట్ల భూమి నాలుగు కోట్లకు ఇక్కడ కొనుక్కోవచ్చంట. ఇదే రాష్ట్రంలో పుట్టి పెరిగి, ఒకే భాష ఇంకో యాసలో మాట్లాడే వాడు మాత్రం నాలుగు వేల జీతానికి పనిచెయ్యకూడదు. ఈ ముష్టి జీవోలతో ఎవరి కడుపు కొడుతున్నారో అర్ధం అవ్వటం లేదు.
- పిచ్చ పిచ్చగా డబ్బులు సంపాదించుకున్న భూస్వాములు
- సినిమాలు చూపించి బెంజిలలో తిరుగుతున్న కులనట శేఖరులు (వీరిది నటకులం కాదు)
- రెండెకరాలతో మొదలెట్టి రెండు వేల కోట్లతో రాజకీయాలు చేస్తున్న నాయకులు
- రోడ్డు మీద రోడ్డు ప్రతి సంవత్సరం వేస్తున్న కాంట్రాక్టరులు
పైన పేర్కొన్న వారిలో ఒక్కడిని కూడా ఈ జీవో కనీసం ఈగ వాలినంత కూడా ముట్టుకోదు. మూటా ముల్లె సర్దుకుపోయే వాళ్లంతా కూడా మధ్యతరగతి బడుగు జీవులే. ఒక అయిదు శాతం పెద్ద అధికారులు వుంటారేమో. మొదటి విడతగా నాలుగు వందల మంది కానిష్టేబుల్లు పంప బడ్డారు. అసలు ఇక్కడ అర్ధం కానిదేమిటంటే అసలు మనం వున్నది ఎక్కడ? పాకిస్థాన్ లోనా? లేకా ఇంకేమైనా దేశమా? లండన్ లో వున్నమన డాక్టర్లను మాత్రం వారు ఇంటికి పంపబోతే మనకు ఎక్కడలేని ఎన్.ఆర్.ఐ ప్రేమ పుట్టుకొస్తుందే? అలాంటిది రెసిడెంట్స్ మీద ఎందుకీ కక్ష? ఈ కక్ష ద్వారా ఎవరి వోట్లు సాధిద్దామని?
దీనికి తోడు నోటికి హద్దులేని కె.సీ.ఆర్ వ్యాఖ్యలు…."లుంగీలు కట్టుకుని, చెప్పులు చేత పట్టుకొచ్చిన ఆంధ్రా వాళ్లు"…ఎవరీ ఆంధ్రా వాళ్లు? తెలంగాణాలో దాష్టీకం సాగించిన నవాబుల మోచేతి నీళ్లు తాగిన కె.సి.ఆర్ లాంటి దొరలైతే కానే కాదు. అప్పటికీ, ఇప్పటికీ తెలంగాణా పేదోల్లు మీలా బిర్యానీలు తింటూ, షాయరీలు చెప్పుకోలేదు, చెప్పుకోవటం లేదు. తాగుబోతు మాట్లాడే కె.సీ.ఆర్ కు తన వీధిలోని పేదోళ్ల సంగతి తెలుసా కనీసం? ఏమైనా ఛారిటీ నడుపుతున్నాడా అనేది ఒక పెద్ద ప్రశ్న. మరి ఏ అర్హత చూసుకుని, ఏ జ్ఞానంతో ఎవరిని ఆంధ్రా అని అంటున్నాడో, అసలు తెలంగాణ తప్పితే చుట్టుపక్కల వున్న రాష్ట్ర సంస్కృతి, ప్రాభవాలు అతనికి నిజంగా స్కూల్లో మాష్టారులు నేర్పలేదో మనకర్ధం కాదు.
కాకతీయుల అద్భుత సంస్కృతి చెప్పుకుంటే ఆంధ్రుడనేవాడికెవరికయినా ఒళ్ళు పులకరిస్తుంది. మరి మన ముక్కు బాబు గారికి నవాబులు, బిర్యానిలు దాటి మానసిక వికాసం లేకపోవటం చాలా చెత్తగా వుంది. వరంగల్ లో వేయి స్థంభాల గుడిని చూసి అప్పటి టూరిజం శాఖా మంత్రి రేణుకను మా మిత్ర బృందం తిట్టుకున్న సందర్భం ఇప్పటికీ గుర్తుంది. అంతవరకెందుకు ఈయన చంకలు గుద్దులునే నవాబులు కట్టించిన అద్భుత కట్టడం గోల్కొండ అతి దీన స్థితిలో వుంది.
ఇవనీ వదిలేస్తే…
ఈయన, ఇతని పులిరాజా (ఇప్పుడు శత్రువు) ఇద్దరూ జనాలని అక్రమంగా దుబాయి తరలించే కేసులలో నిందితులుగా నిలబడ్డారు. రెండు రోజులలో పులిరాజాని అరెష్టు చేస్తారని నమ్మబలికన ముక్కుబాబు గారు ఇప్పుడు కిమ్మనకుండా వున్నారెందుకో అర్ధం కాదు. ముక్కుబాబు ముఠా కధలన్నీ విప్పుతానన్న పులిరాజా ఇంకా గడ్డి ఎందుకు మేస్తుందో అసలు అర్దం కాదు. వీరిద్దరికి నాలుగు తగిలించి నిజాలను రప్పించకుండా అసలు పోలీసు కుక్కలేం చేస్తున్నాయో ఆ బ్రహ్మ దేవుడికి కూడా అర్ధం కాదు. రషీదే వీరి పేర్లు కాక ఎవరైనా సామాన్యుల పేర్లు చెప్పివుంటే వారి తాట ఈ పాటికి లేచి పోయి వుండేది.
అమాయక చలి చీమలు క్రూర సర్పాన్ని వాటి తలల మీదగా ఎక్కించుకుని రక్షణ కల్పిస్తున్నట్లు వుంది ఇప్పటి రాజకీయ ప్రజా ప్రతినిధుల హవా.
గమనిక : ఈ టపా నా వ్యక్తిగత ఆలోచనల నుంచి పుట్టింది కాబట్టి, అందులో కొన్నిఆలోచనలు, అభిప్రాయాలు అందరికీ నచ్చక పోవచ్చు.
అది వ్యాఖ్యల ద్వారా తెలుపగలరు. అంతకు మించి నాకు ఏ కుల,రాజకీయ పక్షాల మీద ప్రత్యేక సానుభూతి గాని, అభిమానం గానీ లేదని మనవి చేసుకుంటున్నాను. :-)