Monday, December 25, 2006

మన ఇంటి సావి3

తల్లి, చెల్లి, భార్య, వదిన, ప్రియురాలు ఎవరైనా వారికి ఒక మోడల్ మన మహాభినేత్రి సావిత్రి. చిలిపిగా హాస్యాన్ని ఒలికించాలన్నా,గంభీరంగా మగరాయిడులా నటించాలన్నా ఆమెకే సాధ్యం, ఆ నటన అద్వితీయం. అగ్రస్థాయి నటీమణులకే అభిమాన నటీమణి, మన సావిత్రి 1981, december 26 న పరమపదించారు.


ఆ మహానటి వర్ధంతి సందర్భంగా ఆమెకు ఇవే నా హ్రుదయపూర్వక అంజలి.

 

మహానటి సావిత్రి గురించి మరింత తెలుసుకోవాలంటే ఈ వికీ వ్యాసం చదవండి

Sunday, December 24, 2006

పావుకిలో పేరు మార్చాలి

పావుకిలో పేరు మార్చాల్సిందిగా ఈ భారత ప్రభుత్వానికివే నా విన్నపాలు. పావుకిలో అనే దానిని ఇక మీదట కిలో అని పేరు మారిస్తే, కనీసం మధ్య తరగతి ప్రజలు "అబ్బా కిలో టొమేటో ఆరు రూపాయలేనా" అని సంతోష పడతారు.

రైతుకు దక్కుతున్న టొమేటో ధర కిలోకు (1000 gms) రూ. 0.50. మహా అయితే రెండు రూపాయలు. జూబిలీ హిల్స్ ఫ్రెష్ అండ్ నాచురల్ లో టొమేటో ధర కిలోకు రూ. 28.00. వీరు ఈ టొమేటోలను ఆల్ప్స్ పర్వతాలనుంచి దిగుమతి చేసుకోవటం లేదు. ఇక్కడే రంగారెడ్డి జిల్లా రైతుల రక్తం కన్నీరుగా మారితే ఎర్రగా పండిన టొమేటోలు అవి. వారు పడుతున్న బాధలు చూస్తే మనిషనే వాడికి కంట తడి రాక మానదు.


ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలు? ఈ ప్రభుత్వాలకు మైనారిటీలు, రిజర్వేషన్లు తప్పితే ఇంకేమీ పట్టవా? ఎప్పటికి గ్రామీణ రైతు స్వావలంబన సాధ్యమవుతుంది. ఈ భారత దేశంలో మైనారిటీలు ఎవరంటే కళ్ళు మూసుకుని "రైతులు" అని చెప్పవచ్చు. వీరు ఎవరికి అవసరం లేదు. వీరు చావు ఎవరికి పట్టదు. ఎందుకంటే రైతులు ఏ మతానికి సంభందించిన, కులానికి సంభందించిన వర్గం కారు. వారు ఈ రాజకీయ కుల మహా సభలు నిర్వహించి రాజకీయ నాయకులకు ఓటు బ్యాంకు బలం చూపి హెచ్చరికలు పంపలేరు.

రైతు బజార్లు మొదలయినప్పుడు కొంతవరకూ దాని ప్రభావం కనిపించింది. RTC  ప్రత్యేక బస్సులు కూడా నడిపింది. ఈ పధ్ధతి చాలా ఉత్తమ మైనది. కాకపోతే ఈ బజార్లలో కూడా దళారీలు ప్రవేశించటం, అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావటం, అవినీతి విజృంభించింది. వీటిని బాగు చేస్తే ఎక్కడ తెలుగు దేశానికి పేరు వస్తుందో అని కాంగ్రెస్ వాటిని అలానే వదిలేసింది తప్పితే రైతుల గురించి పట్టించుకోవటం మానేసింది. అదీ కాక సిగ్గు లేకుండా మాది రైతు ప్రభుత్వం అని బాజా ఒకటి.

 

రైతులకు మేలు చెయ్యాలంటే, ఈ ప్రభుత్వాల దృష్టిలో వారికి ఉచిత విద్యుత్తు ఇచ్చెయ్యటమో (మాట వరసకు), రుణాలు ఇచ్చెయ్యటమో అనుకుంటే అంతకంటే గుడ్డితనం మరొకటి ఉండదు. పట్టణాల మోజులో పడి, వేసిన రోడ్లనే మళ్లీ మళ్ళీ వెయ్యటం, పరిశ్రమలన్ని పట్టణాలలో పెట్టుకుని, రింగు రోడ్లకు మాత్రం పొలాలని తవ్వుకుంటూ పోవటం...ఏమిటి ఈ దోపిడీ? ఇంత చిన్న అంశం కూడా ఆలోచించలేని పరిస్థితులలో ఉందా భారత ప్రభుత్వం?

 

రైతుల విద్యపై ప్రభుత్వం గట్టిగా చూపు సారించాలి. వారికోసం ప్రతి జిల్లాలో ఒక వ్యవసాయ కళాశాల నెలకొల్పాలి. వ్యవసాయ కళాశాలలో పట్టబధ్రులయిన రైతులను ఇతర రైతులకు మార్గదర్శులుగా (mentors) గా నియమించాలి. ఈ మార్గదర్శులకు ఏటా అవార్డులను ప్రదానం చెయ్యాలి(ఉత్పత్తి ప్రకారం). ప్రతి జిల్లా నుంచి వీరు ఆయా జిల్లాల వ్యవసాయ కార్యాలయాల ప్రోటొకాల్ లో ఒక భాగస్వామ్యులుగా చెయ్యాలి.

ప్రతి గ్రామంలో వ్యవసాయ సంఘాలను పరిపుష్టం చెయ్యాలి. ఈ సంఘాల నిధులకు NRI లు కూడా ఒక హస్తం వేసేలా చేస్తే గ్రామీణ సౌభాగ్యం సాధించటం చాలా సులభం. మన ఊరు బాగుపడాలి, మన ఊరి రైతులు బాగు పడాలి అని ఏ NRI కోరుకోరు? నేను NRI అని ప్రత్యేకంగా ఎందుకు అన్నానంటే...వారికి కన్న భూమిమీద, సొంత ఊరు మీద ఉన్న అభిమానం మనలో ఉండదు మరి.

దేశంలో రిటైల్ చైనులు పెరగాలి. రిలయన్స్, భారతి, సుభిక్ష, వాల్ మార్టు వంటివి ఎన్ని ఎక్కువయితే రైతుకు అంత లాభం. వీరు రైతుల నుంచి మార్కెట్ ధరకు కొంటారు. కొద్దిగ లాభానికి ఎక్కువ మొత్తంలో సరుకును తక్కువ ధరలకు వినియోగదారులకు అందిస్తారు. ఈ మార్టులు ఎక్కువ అవుతున్నాయని రాజకీయ పార్టీలు చేసే గోల పట్టించుకోనక్కరలేదు. వారు ఆ సరుకులను ఎక్కడినుంచో కొనటం లేదు, మన రైతుల నుంచే, మన దళారీల కంటే ఎక్కువ ధర చెల్లించి కొంటున్నారు. చిన్న చిన్న కిరాణా కొట్లలో ఉండే అపరిశుభ్రత, మోసం, కల్తీ అందరికీ తెలిసిందే...వారు నష్టపోతారని గొంతు చించుకోనక్కరలేదు.


నేను అమెరికాలో కూరగాయల దుకాణం చూసాను. ఒక అంధుడు కూడా నిరభ్యంతరంగా కూరగాయలను కొనుక్కోవచ్చు. అంతటి ప్రమాణాలు పాటిస్తారు. ఒక రోజు ధరలు తగ్గుతాయి, ఒక రోజు పెరుగుతాయి...అంతా రైతు దగ్గర కొన్న ధరల ప్రకారమే. ఎక్కువగా అమ్ముడయ్యేవి తక్కువ ధరకు దొరుకుతాయి (మనకు పూర్తి వ్యతిరేకం). ఏది నచ్చక పోయినా మర్యాదగా మార్చెయ్యటమో లేదా డబ్బులు తిరిగి ఇచ్చెయ్యటమో చేస్తారు. అదంతా చూస్తే నాకనిపించింది. "ఎక్కడ నిజాయతీ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది".

Wednesday, December 20, 2006

తెలుగు పుస్తక ప్రియుల కోసం...

ఒక మంచి తెలుగు పుస్తకాలమ్మే ఆన్ లైన్ దుకాణం లేదేంట్రా అని బాధ పడే వారికి శుభవార్త...

ఇండియన్ ఎక్స్ ప్రెస్ వారి ఇండియా వార్త పుస్తక శాల చూడండి.

ధర కూడా ఒక్క పైసా కూడా అసలు ధరకు ఎక్కువ లేదు. (నేను కొన్న పుస్తకాలతో సరి చూసా).
కొన్ని పుస్తకాలు

సాక్షి చివరకు మిగిలేది బాపు కార్టూన్లు దర్గా మిట్ట కతలు

Tuesday, December 19, 2006

పొద్దు పొడిచింది

poddu

పొద్దు ఈ-పత్రిక చూసారా? ఇది మరొక బ్లాగో, లేదా పత్రికో మాత్రం కాదు. ఇంటర్నెట్ లో తెలుగు తేజాన్ని అన్ని కోణాలలో పరిశోధిస్తూ, అభినందిస్తూ చక్కని పరిశోధనాత్మక వ్యాసాలు అందించే తెలుగు కుసుమం అని చెప్పవచ్చు.

ఈ ప్రయోగకర్తలు చదువరి గారికి, త్రివిక్రం గారికి, మరియూ వీవెన్ గారికి హార్దిక శుభాభినందనలు.

మొదటి సంచికలో నా అభిమాన బ్లాగరు రా.నా.రె పరిచయం కావటం ఎంతో ఆనందంగా ఉంది.

Tuesday, December 12, 2006

మీటనక్కరలేని రాతలు

కంప్యూటర్ తో, ఇంటర్నెట్ తో కాస్తో కూస్తో పరిచయం ఉన్నవారందరు ఈలేఖలు రాయటం అనేది తప్పని సరిగా చేసి తీరుతారు. లేక పోయినా ఏదో ఒక రకంగా పదాలను టైప్ చెయ్యటం మాత్రం తప్పించుకోలేరు. రోజూ కంప్యూటర్ తోనే సహవాసం చేసే వాళ్ళకు కీబోర్డు వాడటం బాగానే ఉంటుంది గానీ, వయస్సులో పెద్ద వారికి, వికలాంగులకు ఇది చాలా సంకటంగా ఉంటుంది. ఇక తెలుగులో రాయాలంటే చెప్పాలా?

సరిగ్గ ఇటువంటి వారికోసమే తయారు చేసిన సాఫ్టువేరు "డాషర్"

ఒక్క ముక్కలో చెప్పాలంటే దీనిని ఉపయోగించి రాయాలంటే ఒక కీ కూడా నొక్కనక్కరలేదు. అక్షరాలను త్రిమితి అంతరిక్షంలో ఏరుకుంటూ ఒక పక్క పేర్చుకుంటూ పోవటమే. ఇది చాలా భాషలలో ఉపయోగించవచ్చు. మన తెలుగు కూడా అందులో ఉంది.


పైన సరి చూసే గీత చూసారు కదా. అది స్థిరంగా ఉంటుంది.  ఎంపిక గీత అనేది ఒక పాయింటర్ లా నాలుగు వైపులా తిప్పవచ్చు. ఈ గీతను పదాల అక్షాంశానికి దగ్గరగా, దూరంగా తీసుకుపోతూ ఉంటే అవి పెద్దవిగా,చిన్నవి గా మారుతూ ఉంటాయి. మనకు కావాల్సిన అక్షరం సరి చూసే గీత మీద ఉన్న + మీదగా పోనించి దాటిస్తే దానిని ఏరుకున్నట్లే. అలా ఏరుకున్న పదాలు "రాసిన పదాలు" అనే చోట చేర్చ బడతాయి. ఇది చూస్తే చాలా కష్టంగా అనిపిస్తుంది గానీ, అత్యంత సులభమైన రాత పధ్ధతి.

ఇక ఆంగ్లబాష అయితే T9 (predictive text input) సౌలభ్యం కూడా ఉంది. అంటే Hello అని రాసిన తరువాత How, are, you  అనే అక్షరాలు నన్ను ఎంచుకుంటావా అన్నట్లు మన దగ్గరలోకి వచ్చేస్తాయి :-)


ఇది పక్కగా పరిశోధనలతొ చేసిన సాఫ్టువేరు. దీనిని గొంతుతో, కళ్ళతో కూడా అక్షరాలను ఎంచుకునే సౌలభ్యం కల్పించారంటే ఇక దీని స్థాయి అర్ధం అవుతుంది.

మీరు ఇంకా తెల్లమొహంతోనే ఉంటే ఈ వీడియో చూడండి. అర్ధం అవుతుంది.

Monday, December 11, 2006

చొప్పదంటు పరిశీలన...

గతంలో మీకు ఆంధ్ర జ్యోతి లో దంటు కనకదుర్గ గారు రాసిన ఒక చొప్పదంటు పరిశీలన గుర్తు ఉండే ఉంటుంది. లేకపోతే ముందర ఇది చదవండి. కాసేపు కింద పడి నవ్వుకుని మరలా ఇక్కడికి రండి.


కనకదుర్గ గారు వీరావేశంతో చేసిన ఆ పరిశీలన (ఈవిడకి కొంపతీసి డాక్టరేటు రాలేదు కదా?) చదివి చాలా మంది ఆవేశపడ్దారు, కొంత మంది చిరాకు పడ్డారు, కొంత మంది నవ్వుకున్నారు, కొంత మంది తిక మక పడ్డారు. నేను మాత్రం నోరు ముయ్యటం మర్చి పోయాను. ఎందుకంటే తెలుగు అనే పదాన్ని సృష్టించింది ముస్లిం పాలకులని ఈవిడ అభిప్రాయం. ఈమె ప్రకారం పోతన భాగవతం కూడా తెలంగాణ యాస లోనే రాశాడు కానీ, ఆంధ్ర ప్రచురణ కర్తలు దాన్ని శ్రీ మధాంధ్ర భాగవతం చేసి పారేశారంట...కాళోజి అనే కవి (ఇతనాంధ్రుడో, తెలుగు వాడో, తెలంగాణా వాడో...) రాసిన ఆంధ్ర తిట్ల పురాణం (అతగాడి యాసని ఎవడో వెక్కిరించాడంట విజయవాడలో..అందుకని ఇక ఆ వెక్కిరింత తెలంగాణ అందరికి వెక్కిరింత అని అనేసుకుని రంగంలోకి దిగి పేజీలకు పేజీలు ప్రజా కవిత్వం రాసారీయన) ఉదాహరణగా చూపటం ఒక మూర్ఖత్వం అవుతుంది. కాళోజీకి ఆ మాత్రం సువిశాల భావ చైతన్యం లేకుండా అంత పేరు ఎలా వచ్చిందా అని నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎవరు ఆంగ్లం కలపి మాట్లాడం లేదు తెలంగాణ గడ్డ మీద? తరతరాలుగా ఎకసెక్కాలకు గురవుతున్న ఉత్తరాంధ్ర యాస సంగతి ఏమిటి? వంద శాతం తెలుగు ఉండి కూడా అపహాస్యానికి గురి అవుతున్నదే? ఆ లెక్కన తప్పు తడకల బానిస బతుకుల ఉర్దూ సంకరం ఉన్న యాసకు ఒక జాతి అని పేరు ఎలా పెట్టిందో ఈ మహానుభావురాలు నాకు అర్ధం కావటం లేదు. యాసకైనా తల్లి భాషే...అది తెలుగు తల్లి మాత్రమే. ఎవరైనా భాషను అన్య భాషలతో సంకరం చేసుకుంటే అది వారు ఖర్మ, అంతే గాని కాళోజీలా దానికి ఆంధ్ర భాష అని పేరు పెట్టనక్కరలేదు.

ఈ దంటు దుర్గ గారి వ్యాసం మీద తాజాగా ఆంధ్ర జ్యోతిలో పులికొండ సుబ్బాచారి గారు రాసిన వ్యాఖ్య చదవండి..సాయి బ్రహ్మానందం గారు రాసిన వ్యాఖ్యలు కూడా చదవండి.

రాజకీయాలు ధనానికి, మద్యానికి, బంధు ప్రీతికి పట్టం కట్టి, జనాలను కొల్లగొట్టినా సహిస్తున్నారు ప్రజలు, గానీ ఇలా తల్లి రొమ్ము గుద్ది పాలు తాగాలనుకోవటం భయంకరమైన ఆలోచన.

Wednesday, December 06, 2006

పిచ్చి భారతం

తెరాస ప్రతినిధి TV9 లో : "భారత రాజకీయాలు ఒక తులసి వనం అయితే, కాంగ్రెస్ అందులో ఒక కలుపు మొక్క"

పిచ్చి పుల్లయ్య : వార్నీ నీకు మన రాజకీయాలు తులసీ వనంలా అగుపిత్తాన్నాయట్రా...ధూ...మన రాజకీయాలను పేడతో పోలిస్తే పిడకలు అలుగుతాయి, గొబ్బెమ్మలు నీలుగుతాయి. మిమ్మల్ని గాడిదలతో పోలిత్తే అవి సేస్తున్న పని మానేసి పారిపోతాయి. మీకు ఇంకొకిరితో పోలికేంది సామీ..మీరందరూ మీకు మీరే సాటి. అందరూ ఆ తాను ముక్కలే.

 

నరేంద్ర విజయ దరహాసంతో : "కరీంనగర్ ప్రజలు తెలంగాణా పోరాటానికి ఒక కొత్త అర్ధం చెప్పినారు, ఈ ఫలితం చాలు తెలంగాణా సాధనకు"

పిచ్చి పుల్లయ్య : పులి బాబు గారు, మరక్కడ ఏభై శాతమే పోలయినాయంట గందా? గుర్తింపు కార్డున్న ఓటరులెంతమంది? అందులో ఏభై శాతం ఎంత మంది? ఈ ఏభై శాతంల రిగ్గుంగు ఎవరూ (అంటే తవరు గాదు, ఎగస్పార్టీ వాళ్ళు..అట్టా గుర్రుగా సూడమాకండి బావు) సెయ్యనేదంటారా? పోలీసులు జనాల్ని బయపెట్టేసినారంట గందా? సారా, దుడ్డుకోసరమని పోలీసులకు బయపడకుండా లగెత్తుకొచ్చిన జనాలు ఓటేసేటప్పుడు బయపడ్డమేంది సెప్మా? అహా...నాకు సిన్న డౌటండి సారు.ఇవన్నీ తీసేత్తే అసలు మనస్పూరకంగా ఓటేసినోల్లెంతమందండి బాబు?

 

కరుణానిధి : "అతనికి టెండూల్కర్ అని పేరు రావటానికి కారణం అతని పరుగులన్నీ పది లోపల ఉండటమే"

పిచ్చి పుల్లయ్య : మరి తమరి పేరు లోని "కరుణ" ఎంత ? నిధి ఎంత సారు? తమరికి ఆ జయ అమ్మాయిగోరి చీరూడిపించిన సెరిత్ర ఉంది గందా...

 

తెరాస ప్రతినిధి TV9 లో : "మాకు వస్తున్న అభినందనల ఫోన్ కాల్స్ లో చాలా మంది కాంగ్రెస్, తెలుగు దేశం కార్యకర్తలు ఉన్నారు. వారు వారి పార్టీలకు ప్రచారం చేసినా మాకే ఓటేసారంట. దీని బట్టి అర్ధం చేసుకోవచ్చు ఎవరు గెలుస్తారో"

పిచ్చి పుల్లయ్య : ఆచ్హెర్యంగా ఉంది సామి. తవరి ఆనందం సూత్తే నవ్వాల్నో, ఏడవాల్నో తెలియగుందుండి. చానా మంచిది. కానీ అట్టాంటి నీచ్ కమీన్ కుత్తే కార్యకర్తలని తవరు పార్టీలోకి పొరపాటన రానీకండి సామీ...తమరి వీపు ఎప్పుడో ఇలానే విమానం మోత మోగించేత్తారు...

Tuesday, December 05, 2006

దీనినే 'అతి' అందురూ...

ఇది చదివి ఢామ్మని కింద పడబోయి ఆపుకున్నాను. దీని బట్టి చిరంజీవి రోజుకు ఎంత మంది భట్రాజులతో వేగుతున్నాడో కదా...ఈ అవుడియా మన అద్భుత భట్రాజ సోదర ద్వయం పరుచూరి వారికి రాలేదెందుకబ్బా !


నాయనా! చిరు జర జాగర్తగుండు...శ్రేయోభిలాషిని చెప్తుండాను.

గంధర్వ గళానికివే నివాళులు

తెలుగు ప్రజలు తెలుగుకు చెవి కోసుకుంటారో లేదో కానీ, ఈ సుమధుర గాయకుడి గళానికి మాత్రం తన్మయత్వంతో చెవులప్పగించేస్తారు. సంగీత దర్శకునిగా, గాయకుడిగా అతడు సంపాదించిన ఖ్యాతి, కంటి చూపుకు అందనంత ఎత్తులో ఉంది. తెలుగులో ఒకప్పటి అగ్ర కధానాయకులందరికి ఊపిరి అందించిన ఖ్యాతి మన ప్రియతమ పద్మశ్రీ ఘంటసాల వారిది.


భగవద్గీత అయినా, భక్తి పారవశ్యంతో కూడిన గీతమైనా అవి తెలుగు ప్రజలకు ఘంటసాల గొంతు ద్వారా పరిచయమైనవే.


అపర గాన గంధర్వునికివే జయంతి సందర్భంగా నా నివాళులు. ఈ సందర్భంగా మచ్చుకు కొన్ని జాతి రత్నాల్లాంటి పాటలు ఇక్కడ వినండి. భగవద్గీత ను ఇక్కడ వినండి.

Monday, December 04, 2006

ఈ వారం "కధా" కమామీషు

ఈ వారాంతం హైదరాబాదు పుస్తక జాతరకు వెళ్ళాను. తెలుగులో కొని చదవాల్సిన చాలా పుస్తకాలు అక్కడ ఉన్నాయి. ఈ సారి రష్యన్ బాల సాహిత్యం కూడా లభ్యమవుతుంది. నేను ఆంధ్ర కేసరి ఆత్మ కధ, బారిష్టరు పార్వతీశం, దర్గామిట్ట కతలు, పోలేరమ్మ బండ కతలు కొన్నాను... విచిత్రం ఏమిటంటే బారిష్టరు పార్వతీశం రాసిన మొక్కపాటి, ఆంధ్ర కేసరి ప్రకాశం దగ్గర ప్లీడరు గా ఉండేవారు. ఆ విధంగా గురు శిష్యులిద్దరి రచనలు ఒకే రోజు కొన్నట్లు అయ్యింది. అక్కడే కలసిన చావా కిరణ్ కూడా ఆంధ్ర కేసరి పుస్తకంతోనే కనిపించటం మరొక విషయం :-).

ప్రస్తుతం పి.వి "లోపలి మనిషి" చదువుతున్నాను. పి.వి.నరసింహరావు గారి రచనా శైలి, భావ ఉన్నతి అద్భుతం అని చెప్పక తప్పదు. ముఖ్యంగా బాల్యం గురించి వివరించేటప్పుడు....


ఇక పోతే, ఈ మధ్య జరుగుతున్న వెధవ రాజకీయాల గురించి చాలా ఆసక్తికరమైన చర్చలు మిత్రులతో జరిగాయి. ప్రతి ఒక్కరు రాజకీయాన్ని తిట్టి మరీ సంభాషణ మొదలు పెడుతున్నారు.

శుభ్రంగా ఎన్నుకున్న ప్రజలని కాలదన్ని కె.సి.ఆర్ రాజీనామా చెయ్యటం ఏమిటీ? చేసాక మరలా ఎన్నిక కావటం కోసం అష్టకష్టాలు పడటం ఏమిటి? అతగాడు ఆరోపిస్తున్నట్లుగా కాంగ్రెస్, టి.డి.పి లకు సారా, డబ్బు పంచడానికి అవకాశం ఇవ్వటం ఏమిటి? ఇవన్నీ జరగటానికి ఎవరు కారణం ? శుభ్రంగా ఉన్న సీటుకు రాజీనామా చేసి, ఇప్పుడు ఆ ఎన్నిక తెలంగాణ ఆత్మభిమానానికి పరీక్ష అనటం ఏమిటి? రెండు సంవత్సరాలు కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు జరిగినది అస్సలు తెలియనట్లు ఇప్పుడు శఫధాలు చెయ్యటం ఏమిటి?

కేవలం, కరీంనగర్ ఎన్నిక దానిని ఎలా నిర్ణయిస్తుంది? అలా అయితే దారుణంగా ఒడిపోయిన జిల్లా పరిషత్, పంచాయతీ ఎన్నికల సంగతి ఏమిటి?

ఈ రోజు, ఈనాడు ప్రతిధ్వనిలో ఒకతను భలే చెప్పాడు...

తెలంగాణ : ప్రతి పార్టి అంటుంది, మేమే మొదలు పెట్టాం. మేమే తెస్తాం.

బీడి పుర్రె : ప్రతి పార్టి అంటుంది, మేము చెయ్యలేదు, మేమే తీసెయ్యగలం.


దాదాపు వందకోట్ల అవినీతి ధనం, మూడు కోట్ల వరకు ప్రజాధనం కరీంనగర్ ఎన్నికలలో ఖర్చు అవుతున్నాయి. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ పాపం వోక్స్ అవినీతిని కూడా మించిపోయింది. ఇది ప్రజాస్వామ్యాన్ని తీవ్రస్థాయిలో మానభంగం చెయ్యటమే.

నా అంచనా నిజమైతే..కరీంనగర్ కె.సి.ఆర్ కు దక్కుతుంది, బొబ్బిలి తెలుగుదేశంకు దక్కుతుంది. కాంగ్రెస్ కు వోటేసి గెలిపించే ధైర్యం బొబ్బిలిలో అయితే చెయ్యరు. అసలే అక్కడ కుటుంబాలకు కుటుంబాలు అవినీతి గబ్బిలాలు వేలాడుతున్నాయి.

Sunday, November 26, 2006

మన మున్సిపాలిటీ బ్రాండ్ ఎన్నికలు

మనందరికి తెలుసు, భాగ్యనగరం ఒక మేడిపండు అని. కొత్తగా ఋజువులు కూడా అక్కరలేదు. ఇప్పుడు ఆ మేడిపండుకు మన ఎమ్.సి.హెచ్ కొత్త రంగులద్దబోతుంది. వారి ప్రకారం మన నగరానికి ఒక బ్రాండ్ ఇమేజ్ కావాలిట. నగరానికి బ్రాండ్ ఏమిటో ఆ దేవుడికే తెలియాలి. అదీ పక్కా ఇంగిలిపీసులో. నిజంగా చెప్పలంటే భాగ్యనగరానికి ఒక లోగో కావలంటే ఇలా ఉండాలి...(అపహాస్యానికి క్షమించాలి..కానీ పరిస్థితి ఇలానే ఉంది మరి).

hydlogo

 

ఈ హాస్యాన్ని పక్కన పెడితే, మనకు ఎంచుకోవటానికి ఇక్కడ నాలుగు లోగోలు ఉన్నాయి..నేను B కి వోటేసా...అది కొద్దిగా బిర్యాని పద్ధతిలో ఉంది, రాజసంగా...:-) మరి మీరు ఓటెయ్యండి మరి...www.ourmch.com లో నవంబరు 28 లోపు మీరు మీ ఓటు నమోదు చెయ్యవచ్చు.

Hyd LogosHyd logoSnagIt CaptureSnagIt Capture

తెలుగు బ్లాగర్లను దోచుకొనుట

ఈ మధ్య అద్భుతమైన తెలుగు బ్లాగర్లు పుట్టుకొస్తున్నారు. మంచి మంచి వంటకాలతో నోరూరించేవి కొన్ని అయితే, గడ గడ లాడించే రాజకీయాల విసుర్లతో కొన్ని. చిన్ననాటి ముచ్చట్లు, నసీరుద్దీన్ పకపకలు, అందమైన భావాలు, గేయాలు, నీతి కధలు, సాంకేతిక విషయాలు ఒకటేమిటి...చదవటానికి తీరిక లేనన్ని...మరి ఇవన్నీ ఎలా చదవకుండా వదిలెయ్యటం? అందుకని మనం చెయ్యగలిగేది ఒక్కటే...వాటిని తస్కరించి మన దగ్గర భధ్రపరచుకుని, తీరిగ్గా పకోడీలు (బ్లాగులో నేర్చుకున్నవి) నముల్తూ ఏదో ఒక రోజు చదువుకుంటే బాగుంటుంది కదా...

సరిగ్గా మన లాంటి వారికోసమే ఉంది ఈ క్లిప్ మార్క్స్ అనే ఉపకరణం...

ఇది ఒక్క సారి మన బ్రౌజరులో వ్యవస్థాపితం చేసుకుంటే...ఒక పండగే పండగ..:-)...ముందుగా ఈ క్లిప్ మార్క్స్ ని ఇక్కడి నుంచి వ్యవస్థాపితం చేసుకోండి...


SnagIt Capture

మనము ఏదైనా పేజిలో ఉన్నప్పుడు ఈ క్లిప్ మార్కు బటన్ (బ్రౌజరు టూలు బార్ మీద ఉంటుంది) ని నొక్కితే పేజీ మొత్తం ఎంపిక మోడ్ లోనికి మారుతుంది. అప్పుడు మనకు కావలసిన విషయం, పేరాల మీద మౌస్ ను ఉంచితే వాటి చుట్టూ ఒక గీతతో డబ్బా కనిపిస్తుంది. మనకు సరిపోయే విధంగా డబ్బా కనిపిస్తే ఒక్క మౌస్ నొక్కు నొక్కటమే...ఆ డబ్బాలో ఉన్నదంతా మన క్లిప్ స్టోర్ లోనికి వచ్చేస్తుంది...అప్పుడు చివరిసారిగా "సేవ్ క్లిప్ మార్కు" బొమ్మను నొక్కటమే...లాగిన్ అయ్యాక మన క్లిప్పులను అది సురక్షితంగా భధ్రపరుస్తుంది. వీటిని ఎక్కడినుంచి అయినా చదువుకోవచ్చు...ఇంకొకరి చేత చదివించ వచ్చూ...నా క్లిప్పులను ఇక్కడ మీరు చూడవచ్చు..

SnagIt Capture

భలే ఉంది కదా ! ఇక ఆలస్యం ఎందుకూ? క్లిప్పుల వేట మొదలుపెట్టండి...రండి...పకోడీలను మరింత రుచికరంగా చేద్దాం ...:-)

Saturday, November 25, 2006

బీడీకట్ట రాజకీయాలు

రాష్ట్రంలో నవ్వు పుట్టించే కుళ్ళు రాజకీయాలు ఊపందుకున్నాయి...అందులో కొన్ని..

  •  హటాత్తుగా బీడీ కార్మికుల మీద ప్రేమ పుట్టుకొచ్చింది మన కె.సీ.ఆర్ కు. ఈ రోజు ఆవేశంగా ప్రసంగించేస్తున్నాడు..మీ తోనే నా బతుకు, నా చావు అని...తమరు రెండు సంవత్సరాలుగా వెలగ బెట్టిన కేంద్ర మంత్రి పదవిలో ఏం చేసారు సారూ ! ఈగలు తోలుతున్నారా? అసలు పుర్రె వలన ఎంత మంది పొగ తాగటం మానేస్తారబ్బా? అసలు ఈ తాగే వాళ్లందరూ పొగ తాగితే అనారోగ్యం అని తెలియకుండా తాగుతున్నారా? ఒక వేళ తాగినా సరే, వాళ్ళ ఆరోగ్యం సంగతి ఏమిటి? ఏది ముఖ్యం? ఆరోగ్యమా ? ఓట్లా?
  • హఠాత్తుగా నరేంద్ర గారికి విజయశాంతి (అదేనండీ తెలంగాణాకు ఏదో రకంగా మానస పుత్రిక) ని ఆహ్వానించడానికి అనుమతి లభించింది. పాపం ఇతను చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తే ఇన్నాల్లకు కె.సి.ఆర్ గులాబీ ఊపాడు. మన విశాంతి గారు మద్రాసు యాస తెలుగులో ఒక రకంగా ఎదో వాగారు టీవీలలో...ఇక ఈవిడ జనాలమీద తన సినిమ తైతక్కలు ప్రదర్శించటమే తరువాయి.
  • సంవత్సరాల నుంచి సినిమాలలో అపహాస్యం పాలవుతున్న ఉత్తరాంధ్ర యాస ఇప్పటికి రాజకీయ నాయకుల కళ్ళకు ఆనింది. కుళ్ళును కుళ్ళపొడుస్తున్న ఈనాడును మరేటీ సెయ్యనేక, ఇదో ఇలాగ నరుక్కొత్తన్నారు...ఇప్పటికైనా భాషకు, యాసకు ఉన్న సంబంధాన్ని అందరు గమనిస్తే మంచిది. కళ్ళు చిదంబరం చేత ఈ యాసతో అపహాస్యం చేస్తే తప్పులేదు కానీ, అన్నింటినీ బొక్కే బొత్సను అనేటప్పటికి ఎక్కడి లేని రోషం వచ్చేసింది..ఎవరికీ? మన రాజమహేంద్రంలో వున్న డిటెక్టివ్ ఉండవల్లి గారికి.

Thursday, November 16, 2006

శోధన వంద టపాలు పూర్తి




ప్రస్తుత తెలుగు బ్లాగుల హోరులో, అత్యంత చురుకయిన గుంపు అయిన తెలుగు బ్లాగర్ల ఆశీస్సులు, అభినందనలతో శోధన వంద బ్లాగు టపాల సంబరం పూర్తి చేసుకుంది..ఇది 101 వ టపా.పార్టీ...అంటున్నారా? డిసెంబర్ తెలుగు బ్లాగర్ల సమావేశానికి రండి, అక్కడే తీసుకోవచ్చు ;-)

సొమ్ములు పోనాయా? మరేం పరవానేదులే

మనకి సొమ్ములన్ని మళ్ళీ వచ్చేత్తాయి. ఎవరికబ్బా అనుకుంటున్నారా? మరెవరికి ? మన బొత్స గారికి..

అవసరంలేని అతి తెలివితో పదకొండు కోట్లు "పోనాయి" అనిపించారు..దానికి బహుమతి ఎంట్రా అంటే...ఈ బహుముఖ ప్రతిభావంతుడి భార్య గారికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వటం. ఆవిడ గారి అర్హత ఏమిటంటే...పెద్దగా ఏమి లేవు, ఎంతో కొంత కట్నం ఇచ్చి పెళ్ళి చేసుకోవటమే...ఈ కుటుంబ వారసత్వ దురాక్రమణలు ఎప్పుడు పోతాయిరా బాబు...ఏదైనా ఒక చట్టం వచ్చినా బాగున్ను...ఒక కుటుంబంలో ఒక్క రాజకీయవేత్త మాత్రం ఉండాలని.

 

ఇంతకీ ఆ పదకొండు కోట్లు ఏటయిపోనాయండి? నాకేటీ అర్ధం కాట్లేదు..మీకు తెలిస్తే నాకు కుసింత సెప్త్దురూ...

Tuesday, November 14, 2006

తెలుగులో అపురూప గీతాలు

సీ.ఎన్.ఎన్ ఐ.బి.యన్ వారు ఒక సర్వే చేసి ఆంధ్రులకు అత్యంత ప్రీతి పాత్రమైన ఐదు పాటలను పట్టుకున్నారు.

ఆ పాటలు ఇవి..

 

  •  05 . ఓం నమహా అధర జతులకు (ఇళయరాజా)
  •  04. కుడి ఎడమయితే పొరపాటు లేదోయి (సి.ఆర్ సుబ్రమణ్యం)
  •  03. శివ శంకరీ, శివానందలహరీ (పీ.ఎన్. రావు)
  •  02. శంకరా నాదశరీరాపరా (కె.వి.మహదేవన్)
  •  01. నీవేనా నను పిలచినదీ, నీవేనా నను తలచినది? (జీ.వి. రావు)

నా అరాధ్య సంగీత దర్శకుడు రాజా ఈ పట్టికలో చోటు చేసుకోవటం అంతో ఆనందంగా ఉంది...

కొన్ని ఇళయరాజా వజ్రాలు

  •  జిలిబిలి పలుకులు చిలిపిగ పలికే ఓ మైనా మైనా
  •  వెన్నెల్లో గోదారి అందం
  •  ఆమనీ పాడవే హాయిగా
  •  అరె ఏమైందీ ఒక మనసుకు రెక్కలోచ్చి ఎక్కడికొ ఎగిరిందీ
  •  ఇలాగే ఇలాగే సరాగమాడితె..వయ్యారం నీ యవ్వనం
  •  మాటే మంత్రమూ మనసే బంధమూ
  • మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా
  • మౌనమేలనోయి ఈ మరపురాని రేయి
  •  ప్రేమ లేదనీ...ప్రేమించరాదనీ..సాక్ష్యమే నీవనీ
  • సాగర సంగమమే..ప్రణయ....సాగర సంగమమే..
  • తరలి రాద తనే వసంతం
  • వాగర్ధావివ సంప్రుక్తౌ...నాద వినోదము

Saturday, November 11, 2006

అపహాస్యం అంటని నంది అవార్డులు

విచిత్రంగా ఉంది కదా...బురదకు బురద అంటితే ఏమవుతుంది...బురదే అవుతుంది. ఈ సారి కూడా మన నంది అవార్డులు అదే విషయాన్ని నిరూపించాయి. మహేష్ బాబు, సిరివెన్నెల, శ్రీహరి, అనుకోకుండా ఒక రోజు తప్పితే మిగతా అవార్డులన్నీ పోటీ ఎవరూ లేక ఇవ్వలేదనిపిస్తోంది. అసలు ఈ నంది అవార్డు కమిటీలో ఎవరుంటారో, వారి భావ చైతన్యం స్థాయి ఎంత ఉందో అర్ధం కాదు..

నాకు చిరాకు పుట్టిన కొన్ని అవార్డులు...

01. ఉత్తమ కధానాయకి : కుమారి త్రిష (ను.వ.నే.ఒ ?) - ఇందులో త్రిష బాగానే చేసింది కాదనటం లేదు, కానీ అవార్డు స్థాయి మాత్రం అస్సలు లేదు. నా మట్టుకు ఈ అవార్డు ఛార్మికి (అనుకోకుండా ఒక రోజు) దక్కాలి.

02. ఉత్తమ చిత్రం : పోతే పోనీ (ఎప్పుడైనా విన్నారా ఈ పేరు?)...ఇది ఒక భారీ పరాజయం పొందిన చిత్రం...ఇది వారికి ఉత్తమ చిత్రం ఎలా అయిందో మరి. తమ్మారెడ్డి భరద్వాజ గారి ప్రభావం అనుకుంటా...ఎంతైనా నిర్మాతల మండలి అధ్యక్షుడు కదా..

03. ఉత్తమ సంపూర్ణ హాస్య చిత్రం : పెళ్ళాం పిచ్చోడు ...జుగుప్స కలిగించే ఒక కధనంతో చిరాకు పుట్టించే చిత్రం ఇది.

04. ఉత్తమ సహాయక నటి : భానుప్రియ (ఛత్రపతి) : నేను ఈ చిత్రం చూసాను. భానుప్రియ నటన ఎంత కృత్రిమంగా ఉంటుంది అంటే..పావలా ఇస్తే పది రూపాయల నటన చేసినంతగా...

 

తెలుగు చిత్ర పరిశ్రమా నువ్వు బాగుపడవు....హాలీవుడ్ వర్ధిల్లాలి. ఉత్తమ విలువలకు పెట్టింది పేరు హాలీవుడ్ చిత్రాలే...

Thursday, November 09, 2006

ఆడలేక మద్దెల ఓడు

మన చిత్ర నిర్మాతల మండలి పరిస్థితి అలానే ఉంది మరి. ఎద్దు తోక తొక్కితే పిల్లి ఎలక వైపు ఎర్రగా చూసినట్లు...పస లేని సినిమాలు తియ్యలేక, వాటిని ఆడించుకోలేక డబ్బింగు సినిమాల నిషేధం వైపు చూడటం మొదలు పెట్టారు. ఉదయం ఆఫీసుకు వెళ్తూ ఉంటే "అనువాద చిత్రాల నిషేధం పై నిరాహార దీక్ష ద్వారా నిరసన" అని బ్యానర్ లు కనిపించాయి. విచారిస్తే అసలు సంగతి తెలిసింది.

ప్రస్తుతం మన తెలుగు సినిమాల దుస్థితి అందరికీ తెలిసిందే...కోట్లు ఖర్చు పెట్టేసి ఫ్లాపులు మీద ఫ్లాపులు ఇస్తున్న xxxxxxయ్యలు, xxxxxస్టారులతో వ్యాపారం నడుస్తుంది. జనాలు ఏ చిత్రాన్ని ఆదరిస్తున్నారు అనే సమీక్ష లేనే లేదు..ఒక సగటు భారీ నిర్మాత ప్లాన్ ఎలా ఉంటుంది అంటే..ఈ సంవత్సరం నేను ఫలానా అయ్యతోనో, ఫలానా మైక్రో స్టార్ తోనో ఒక సినేమా (నిర్మాతల భాష అట్లనే ఉంటది) తీసెయ్యాల. కాల్షీట్లు దొరికితే అదే పది వేలు...కధ సంగతంటారా? హెచ్.బీ.ఓ ఒక నెల రోజులు చూస్తే పది కధలు తయారౌతాయి కదా? మరి ఇలా తీసిన చిత్రాలు తెలుగు ప్రేక్షకుడు చూస్తాడా? ఈ మధ్య లాగి పెట్టి తంతున్నారు...అక్కడే చిక్కొచ్చి పడింది. జనాలకు తెలివి పెరిగింది. మునుపటి రోజుల్లో సినిమా తప్ప ఇంకొక వినోదం ఉండేది కాదు, కాబట్టి ఎలాంటి పిచ్చి సినిమా అయినా ఆడేది. ఇప్పుడలా కాదే...రేడియోలు, శాటిలైట్ దూరదర్శినులు, ఇంటర్నెట్ ఒకటేమిటి..సవాలక్ష శత్రువులున్నాయి తెలుగు సినిమాకి...అన్నింటిలోకి అతి పెద్ద శత్రువు మన తెలుగు ప్రసార వాహికలలో వచ్చే ఏడుపుగొట్టు ధారావాహికలు. వీటి మీద నిషేధం విధిస్తే సగం గొడవ తీరుతుంది...ఏ.పి. ట్రాన్స్ కో ఊపిరి పీల్చుకుంటుంది. (సీరియల్ల వలనే 40% అధిక విద్యుత్తు మనం వాడేస్తున్నామని ఒక అంచనా.).

ఇక విషయానికొస్తే...ఈ అనువాద చిత్రాల వలన చిన్న తెలుగు చిత్రాలకు సినిమా హాల్లు దొరకటం లేదట (అని అసలు సినిమాలు తియ్యటమే మానేసిన నిర్మాత తమ్మారెడ్డి గారి ఉవాచ). అందువలన ఏకంగా అనువాద చిత్రాలనే కత్తిరించేద్దామని ప్లాను. మరి అపరిచితుడు, చంద్ర ముఖి లాంటి చిత్రాలు మన తెలుగులో రావటం లేదే...ఇదంతా వదిలేస్తే మన తెలుగు చిత్రాలను ఏకంగా నలభై నకలులతో కర్ణాటకలో విడుదల చేస్తున్నారే...మరి వాళ్ళు ఏమని ఏడవాలి? మొన్న బంగళూరు లో చూసా...ఎక్కడ చూసినా "అతడు", "స్టాలిన్", "బాస్" ఇవే...ఇప్పుడు అనువాద చిత్రాలను నిషేధిస్తే మొత్తం అనువాద యంత్రాంగం మూలన పడతారు. చిన్న సినిమా హాల్లు మూత పడతాయి.

చిన్న చిత్రాలకు హాల్లు దొరకవు అనేది మన చిత్ర పరిశ్రమ చేసుకున్న స్వయంకృతాపరాధం. మన వాళ్ళు హీరో బట్టి అది చిన్నదా, పెద్దదా అని లెక్క కడతారు. చిరంజీవి ఒక డాక్యుమెంటరీ లో నటించినా అది పేద్ద సినిమా హాల్లో విడుదల కావాల్సిందే..అయితే జనాలు మాత్రం ఈ మధ్య సినిమా బాగుంటేనే ఆదరిస్తున్నారు. "అయితే" చిత్రం కేవలం రెండు ప్రింట్లతో ఎక్కడో చిన్న ధియేటర్లో విడుదల అయ్యింది, పది రోజులు గడవక ముందే బ్రహ్మాండమయిన విజయం దిశగా పరుగులు తీసింది..అందరినీ ఊదరగొట్టిన స్టాలిన్, బాస్ అంతంత మాత్రమే ఆడుతున్నాయి...

దీని బట్టి అర్ధమయ్యేదేమిటి?

పస ఉండాలిరా ప్రొడ్యూసురుడా ! పదుగురు మెచ్చిన హీరో ఉన్నా !

Wednesday, November 08, 2006

బంగారు దక్షిణ భారతం -ఆంధ్ర ప్రదేశ్

సీ.ఎన్.ఎన్ - ఐ.బి.ఎన్ వారు దక్షిణ భారత దేశం ఏభై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భాన అన్ని రాష్ట్రాలలో సుపరిచిత వ్యక్తులపై ఎన్నిక నిర్వహిస్తున్నారు.

ఈ లంకె ను అనుసరించండి....

మీ ఎంపిక కూడా నమోదు చెయ్యండి.

Monday, November 06, 2006

నవంబరు రచన పత్రిక : వాహిని ట్రష్టు వారి కానుక

ఈ నెల రచన సంచిక ఒక మంచి కానుక తాలుకా సమాచారంతో వచ్చింది. ఆ పత్రికలో ఉన్నది ఇక్కడ రాస్తున్నా...

1946 నుంచి ఈనాటి దాకా అవిరామంగా తెలుగువారిని తమ అపురూప చిత్రకళా - రచనా రీతులతో అలరిస్తున్న సుప్రసిధ్ధ జంట 'బాపు రమణ'.

శ్రీ బాపుగారు వేసిన బొమ్మల కధలన్నింటిని, ఒక దగ్గర కూర్చి, కొంచెం అటూ ఇటూ 400  పేజిలతో (80  పేజీలు రంగులలో) 1/4 డెమీ సైజులో, అతి చక్కని బైండింగుతో ప్రచురిస్తున్నాము.

  •  దాదాపు 400  పేజీల ఈ 'బొమ్మల కధలు' గ్రంధం ఖరీదు :  495/- మాత్రమే.
  •  15 డిసెంబరు 2006 లోపల ప్రచురణలు ముందే కొనుగోలు చేసే వారికి కేవలం రు.450/- లకే లభ్యం.

ఎలా పొందగలరు?

నగదు/ఎమ్.ఓ/డి.డి/లోకల్ చెక్ (బయటి ఊరి చెక్కులు అంగీకరింపబడవు) ద్వారా "వాహిని బుక్ ట్రష్టు" పేరిట, "హైదరాబాదు" లో చెల్లింపబడే విధంగా రు.450/-  పంపిన వారికి గ్రంధం, ఖర్చులు భరించి రిజిష్టరు పోష్టు ద్వారా, 15.12.2006  తర్వాత జరుగుతుంది. వి.పి.పి పధ్ధతి లేదు.

ఎం.వో లు పంపేటప్పుడు స్ప్రష్టంగా మీ చిరునామా, ఫోన్ నెంబరుతో సహా "స్పేస్ ఫర్ కమ్యూనికేషన్" అని ఉన్న చోట రాయడం తప్పని సరి.

ఇక ఆలస్యం ఎందుకు...ఈ సంచికను మీ మిత్రులకు బహుమతిగా కొని ఇవ్వండి. వారు ప్రత్యేకంగా ఆనందించటం మీరే గమనిస్తారు.

Sunday, November 05, 2006

మౌల్వీ నసీరుద్దీన్ జోకు

నాగ రాజా గారు ఒక మంచి నసీరుద్దీన్ జోకు రాసారు..అది చదివి నాకు మహీధర నళినీ మోహన్ రావ్ గారి మౌల్వీ నసీరుద్దీన్ కధలు చదివిన చిన్ననాటి రోజులు గుర్తుకొచ్చాయి. ఈ సందర్చంలో నాకు గుర్తుకొచ్చిన ఒక మౌ.న.క జోకు..

తైమూరు యుధ్ధానికి బయలు దేరాడు. నసీరుద్దీన్ ను కూడా మూటా ముల్లె సర్దుకుని బయలు దేరన్నాడు. అది నసీరుద్దిన్ కు ప్రాణ సంకటం గా తయారయ్యింది.

చివరికి ఒక ముసలి గాడిద సంపాదించి దాని మీద బయలు దెరాడు. అది చూసి తైమూరు నవ్వు అపుకోలేక "నసీరుద్దీన్..గాడిద ఉంది సరే, మరి బాణాలేవి అన్నాడు.."

"శత్రువులు మన పైకి బాణాలు వేస్తారు కదా! అవే తిరిగి వారి మీద ప్రయోగిస్తా! " అన్నాడు నసీరుద్దీన్.

"మరి శత్రువులు బాణాలు వెయ్యకపోతే?" అన్నాడు తైమూరు తెలివిగా..

"దొడ్డ ప్రభువులు, క్షమించాలి..మీకు చెప్పేంతటి వాడిని కాదు...శత్రువులు మన పైకి బాణాలు వెయ్యకపోతే యుద్ధమే ఉండదు కదా..అప్పుడు నాకు బాణాలతో పని ఏముంది?" అన్నాడు నసీరుద్దీన్. smile_confused

తెలుగు అక్షర దశతంత్ర యజ్ఞ్ఙం

ఇది ఒక అద్భుత యజ్ఞ్ఙం. కుక్క పిల్లా, సబ్బు బిల్లా కాదేదీ అక్షరానికి అనర్హం...మెదక్ జిల్లా లో ఈ మంత్రంతో శంఖం పూరించిన విశ్వనాథుల భీమాచారి మాష్టారు అక్షరాలను దిద్దటానికి పలకొక్కటే మార్గం కాదంటున్నారు. ముగ్గులు, దీపాలు, గోవులు, కరడాలు, జంతికలు...ఏవైనా, ఎక్కడైనా, ఏ రూపంలో అయినా మీరు అక్షరాన్ని సృష్టించి పూజించవచ్చునంటున్నారు. దీనినే అక్షర దశ తంత్రం అంటున్నారు.

మెదక్ లో జిల్ల కలెక్టర్ గారి చొరవతో డబ్బై రోజుల తెలుగు అక్షర యజ్ఞ్ఙం (సంక్రాంతి వరకూ) మొదలు పెట్టారు. ఈ సందర్భంగా అక్షర దీపారాధన, అక్షర దశ తంత్రం మొదలైనవి పాటించనున్నారు.

మన నాయకులు పనికిరాని ప్రాచీన హోదా మాటలు ఆపి, ఇలాంటివి మరిన్ని చేపడితే అదే తెలుగు తల్లికి కనకాభిషేకం...తెలుగు ప్రాచీనమైనది అయినా, తెలుగు తల్లి నిత్య యవ్వన సంపన్నురాలని చాటినట్లు అవుతుంది.

Thursday, November 02, 2006

నేను నష్టపోయాన్రా బాబు..

రామూ చాలా అసహనంగా తిరుగుతూ ఎవరినో తిడుతున్నాడు...

సోము అది చూసి మెల్లగా కారణం అడిగాడు..

మన ఇండియా క్రికెటర్లు చెత్తగా ఆడి మన సొమ్మంతా తినేస్తున్నారు...ఇప్పటికే కోట్లు నష్టం అని మరౌలా తిట్టడం మొదలు పెట్టాడు.

సోము తెల్లబోయి, అది ఎలారా? నువ్వు ఎక్కడైనా సొమ్ము పెట్టుబడి గానీ పెట్టావా వాళ్ళ మీద? అన్నాడు.

లేదు..నేను పెప్సీ, కోక్ తాగుతుంటా అని చెప్పాడు..

ఇంకా తెల్ల బోవటానికి శక్తి లేక, "మరి నీ అలవాటుకి కోట్ల నష్టానికి సంబంధం ఎంట్రా?" అన్నాడు సోమూ అయోమయంగా..

రామూ : నేను కొన్న ప్రతీ కోక్, పెప్సీల మీద ఒక 20 పైసలు ప్రకటనల మీద ఖర్చు అవుతుంది. ఆ 20 పైసలు నేను ఇస్తున్నాను కదా ?. రోజూ మన వంద కోట్ల జనాలలో ఒక 50 లక్షల మంది అయినా ఇవి తాగుతారా?

సోమూ (అయోమయంగా) : అవును ..అయితే ?

రామూ : అంటే రోజుకి అధమం పది లక్షలు...సంవత్సరానికి 36.5 కోట్లు అవునా? మరి ఈ కోట్లన్ని క్రికెటర్లు హూ హా ఇండియా అనడానికి ఖర్చు అవుతున్నాయా లేడా?

సోమూ (కొయ్యబారిన మొహంతో) : అవును..

రామూ : మరి మన డబ్బు తింటున్న వీళ్ళు బాగా ఆడాలా వద్దా? ఆడకపోతే మనం ఒక పెట్టుబడిదారుడిగా తనివి తీరా తిట్టాలా వద్దా?

సోమూ : నిజమే గనీ, నువ్వు అవి తాగటం మానెయ్యొచ్చు కదా? ఎలాగూ పురుగులు కోసమే అవి తయారవుతున్నాయని అన్నారు..

రామూ (చల్లగా) : అందరూ మానేస్తే, మన క్రికెటర్లకు వచ్చిన డబ్బులు కూడా రావు, ఈ ఆట కూడా ఆడరు. అందువల్ల ఒక నిజమైన భారతీయ క్రికెట్ ఫ్యాన్ గా వారి కోసం నేను ఈ సాఫ్టు డ్రింకులు తాగుతున్నా...అని ఒక డ్రింకు ఎత్తి గట గటా తాగి..హూ హా ఇండియా..ఆయా ఇండియా అని గాఠ్ఠిగా అరిచాడు...

సోమూ : ^%$%*&^*&^%$^%$##$

అంకితం : ఈ జోకు మన భారత క్రికెటర్లలో అత్యధిక పారితోషికం తీసుకునే ఒక అద్భుత ఆటగాడికి..

నల్ల రాజకీయాలు

  • కేసీయార్ నల్ల రాజకీయాలు శ్రుతి మించి పాకాన పడ్డాయి...త్యాగాలు, ప్రాణాలు బలిగొన్న ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం నల్ల దినంగా పాటించమనటం ఒక దుస్సాహసం. పోతే ఆ సందర్భంగా ప్రాంతాలతో సంబంధం లేకుండా మాట్లాడే తెలుగు మీద, తెలుగు తల్లి అనే భావన మీద దాడి మరీ నీచం . మరి ఈ వికారపు ఆలోచనలు ఎవరికి వస్తున్నాయో తెరాసలోని మేధావులమని చెప్పుకునే వారినే అడగాలి. ఇలాంటి వెధవలు రేపు హైదరాబాదు, కాశ్మీరు పాకిస్తాన్ కు చెందుతాయని వాదించే సందర్భం రావచ్చు. ఈ బాషా విద్రోహం ఎవరు క్షమిస్తారు? వీరసలు తెలంగాణా ప్రాంత ప్రజలు మాట్లాడే బాష ఏ బాష అనుకుంటున్నారు?
  • ఈ రోజు బంద్ అంట. కేవలం నాలుగు జిల్లాలలో మాత్రమే బంద్ జరిగిందని ప్రసారవాహికలు చెప్తుంటే, తెరాసా మాత్రం బంద్ సంపూర్ణం అంటోంది smile_sarcastic. ప్రసార వాహికలలో చూపించిన ప్రకారం...పాఠశాలలోనికి దౌర్జన్యంగా ప్రవేశించి విద్యార్ధులను బలవంతంగా పంపటం, బస్సుల టైర్లలోని గాలి తియ్యటం, రైల్లను ఆపివేయటం, దుకాణాలు మూసివేయించటం...ఏమిటివి? దీన్ని సంపూర్ణ బంద్ అని ఎలా అంటారో వారికే తెలియాలి..అల్లరి మూకల్ని వెంటేసుకుని దేనినయినా ఆపవచ్చు. కాని అది ఎంత మందిని ఇబ్బందికి గురి చేస్తుందో తెలుసుకోవటం మంచిది...మీరు మీ వీ.ఐ.పి వాహనాలలో వస్తే మేమందరం గంటలు ఆగి మరి దారి ఇస్తున్నామే? మరి మీరు మా జీవిత గమనాన్ని ఎందుకు స్థంభింప చేస్తారు? smile_angry
  • తెలుగు దేశం, కాంగ్రెస్ పిచ్చోల్లందరూ మూగ ప్రాణాల మీద పడ్డారు. వాటిని పేర్లు పెట్టి, కొడుతూ  రోడ్ల మీద తిప్పటం...ఎంత సిగ్గు మాలిన పని? పార్టీ పెద్దోల్లు మొట్టి కాయలు వేస్తే గాని ఆగడాలు ఆపలేదు...దేవుడా ఎందుకు ఈ సృష్టిలో ఈ నీచ రాజకీయ జాతిని పుట్టించావు? లోక్ సత్తా ఏమి చేస్తుందో చూడాలి మరి.

Wednesday, November 01, 2006

గురజాడ పై గుర్రు...రెండవ భాగం

ముందర దీనిని చదవండి : గురజాడపై గుర్రు....

ఇప్పుడు నేను దీనిని రెండవ భాగం అని ఎందుకు అన్నానంటే, ఎక్కడైయితే ఈ గురజాడ పై యుధ్ధం మొదలయిందో అక్కడ ఇంకా జనాలు కొట్టుకుంటున్నారు కాబట్టి...:-)


ఆంధ్రభూమి సాహితి నాకు బాగా నచ్చింది...నాణేనికి రెండు వైపులా అది ప్రచురిస్తుంది. ఇక్కడ ఇప్పుడు ఒకే సంచికలో ఒకరు తిట్టారు...ఒకరు పొగిడారు...ఏది ఏమైనా, ఇలాంటి సాహితి సాంఘిక రచ్చలు భలే ఉంటాయి.


... గురజాడ మహా రచయతా కాదా అనేది ముఖ్యం కాదు..అతను ఒక రచయతగా తన బాధ్యత నెరవేర్చాడా లేదా అనేదే ముఖ్యం. అలా చూస్తే గురజాడ తప్పని సరిగా ఒక అద్భుతమైన రచయత. రచయత కలంతో దాడి చేస్తాడ. గురజాడ యుగ పురుషుడా? అని ఒకరి డౌటూ...!

 ఇక యుగ పురుషులు అంటారా? యుగస్త్రీ అనే పదమే లేని కాలంలో పుట్టిన పదం "యుగ పురుషుడు"....నా వరకు ఆ పదం ఒట్టి మిథ్య. రాజులను పొగడటానికి వంధి మాగధులు సృష్టించిన వందల పదాలలో అది ఒకటి.

 

సమాజం ఒక ఈగలు మూగిన బెల్లం లాంటిది. ఒకరిద్దరు వాటిని తరిమినా అవి మూగక మానవు. సమాజానికి పట్టిన జాడ్యం కూడా అంతే. తెలుగు తల్లి ఎవరు? అని ప్రశ్నించే మహా మాయగాల్లు ఉన్న సంఘంలో ఎవరు ఎవరి చరిత్రను ఎలా అయినా చూపించవచ్చు....వీరప్పన్ భార్య ఎమ్.పి కావచ్చు...అఫ్జల్ గురు కాశ్మీరు సీ.ఎమ్ కావచ్చు.

 

ఆంధ్ర భూమి ప్రతీ సాహితీ సంచిక, ముందరి సంచికను తీసివేసి పెట్టబడుతుంది, అందువలన నేను వీటిని ఫ్లికర్ లో పెట్టా..

sahi1

sahi2

sahi3

sahi4

 

sahi14sahi15sahi16

Tuesday, October 31, 2006

రాష్ట్ర అవతరణోత్సవం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా తోటి తెలుగు వారందరికి ఇవే నా శుభాకాంక్షలు. ఆ తెలుగు తల్లికి వందనాలు. ఈ సందర్భంగా ఈ వ్యాసాలు తప్పక చదవండి.

(తెలుగు వికీ నుంచి)

మా తెలుగు తల్లికి మల్లె పూదండ
మా కన్న తల్లికి మంగళారతులు
కడుపులో బంగారు కను చూపులో కరుణ
చిరునవ్వు లో సిరులు దొరలించు మా తల్లి

గల గలా గోదారి కదలి పోతుంటేను
బిర బిరా కృష్ణమ్మ పరులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలు తాయి

అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి యుండే దాక

రుద్రమ్మ భుజ శక్తి
మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి కృష్ణరాయల కీర్తి
మా చెవుల రింగుమని మరు మ్రోగే దాక

నీ ఆటలే ఆడుతాం
నీ పాటలే పాడుతాం

జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ!

Friday, October 27, 2006

చిత్ర బ్లాగు పునర్దర్శనం

నా కూర్గు పర్యటన ఒక మోస్తరుగా ముగిసింది. అయితే ఈ పర్యటనలో నేను తీసిన కొన్ని చిత్రాల వలన మరలా నా చిత్ర బ్లాగును కొనసాగించటం మొదలుపెట్టాను.

కూల్ క్లిక్స్ : http://coolclicks.blogspot.com

తెలుగు మీకు ఇప్పుడు బ్రౌజరులో ఒక భాగం

మనం రోజూ చాలా తెలుగు పత్రికలు, బ్లాగులు చదువుతుంటాం. కానీ అవన్నీ గుర్తుంచుకోవటం పెద్ద సమస్య. దీన్ని అధిగమించటం కోసం నేను ఈ తెలుగు ఉపకరణ పట్టీ తయారు చేశాను. దీన్ని వ్యవస్థాపితం చేసుకుని మీరు కూడలిని శోధించగలరు, తెలుగు సైట్లకు వెళ్ళగలరు, తెలుగు పత్రికలు, కూడలి మరియు లేఖినిని దర్శించగలరు.

ఈ ఉపకరణ పట్టీ ప్రస్తుతం మీరు ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ 5+, ఫైర్ ఫాక్స్ 1+ లలో వ్యవస్థాపితం చెయ్యగలరు. దీనిలో ఇంకొక సౌలభ్యం ఏమిటంటే, మీరు ఈ పట్టీ కొత్త పరికరాలను ఎప్పటికప్పుడు పొందుతారు. మరలా మీరు ఎన్నడూ దీన్ని వ్యవస్థాపితం చెయ్యనక్కరలేదు.

ఇంకా ఆలస్యం ఎందుకూ? ఈ తెలుగోపకరణ పట్టీని దిగువ లంకె నుంచి ఆనందించండి.

తెలుగోపకరణ పట్టీ (ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ 5+, ఫైర్ ఫాక్స్ 1+)

గమనిక : ఈ పట్టీలో నాకు తెలిసి ఏ స్పైవేరు, మాల్వేరు, ఏడ్ వేర్ జత చెయ్యబడలేదు. ఈ సాఫ్ట్ వేరు యొక్క ప్రవర్తన, కలగ చేసే అదనపు ఇక్కట్లతో నాకు సంబంధం లేదు.  మరిన్ని వివరాలకై

Friday, October 20, 2006

తెలుగులో మాట్లాడండి ఇక యాహూ మెసెంజర్లో...

 

యాహూ తన నూతన యాహూ గ్యాలరీ లో భారతీయ బాషలలో సందేశం పంపుకునే వీలు కల్పించే ప్లగిన్ లను జత చేసింది. జోల్ అనే ఈ ప్లగిన్ వ్యవస్థాపితం చేసుకొనటం వలన మీరు ఇక తెలుగులో హాయిగా తిట్టుకోవచ్చు..

yahoojoha

మీరు జోల్ ని వ్యవస్థాపితం చేసుకోవాలంటే ఇక్కడ సందర్శించండి.

Thursday, October 19, 2006

బాబోయ్ టీవీ 9

టీ.వీ 9 తెలుగుకు నా శత కోటి నమస్కారాలు...వీళ్ళని ఆ దేవుడు కూడా బాగు చెయ్యలేడు. ఏదో బీ.బీ.సి వాళ్లు తయారుచేసిన తెలుగును చదువుతున్నట్లుగా ఉంది. నానాటికి తీసికట్టు అంటే ఇదే మరి. ఈ భాషా ఖూనీ ఎక్కువగా దీప్తి వాజ్ పేయి చదువుతున్నప్పుడే జరగటం గమనార్హం.

కొన్ని ఉదాహరణలు...

లంక బౌలర్స్ అద్భుతంగా ఫైట్ బ్యాక్ చేసి పాక్ బ్యాటింగ్ను కొలాప్స్ చేసారు...

వివరాలు యాడ్స్ తరువాత, ఐ విల్ కమ్ బ్యాక్, డోంట్ గో ఎవే ఎనీవేర్...వెల్కమ్ బ్యాక్ అగైన్

ఇలాంటివి కోకొల్లలు...నాకర్ధం అయ్యింది ఏమిటంటే, ఎన్.ఆర్.ఐ తెలుగు వాళ్ళకు అర్ధం అయ్యేలా చదువుతున్నారేమో అని...కాని ఎన్.ఆర్.ఐ తెలుగు ఆంధ్ర తెలుగు కంటే ఇంకా స్వఛ్ఛంగా ఉంటుందని వారు తెలుసుకుంటే మంచిది.

Monday, October 16, 2006

దిక్కు మాలిన తెలివితేటలు

రాజకీయ నాయకులకు దిక్కుమాలిన తెలివితేటలు మెండు అని నిరూపించాలంటే మన కె.సి.ఆర్ ని ఒక పది నిమిషాలు మాట్లాడిస్తే చాలు. అతని ది.మా.తె లకు కొన్ని మచ్చు తునకలు.

"ఆంధ్రా వాళ్ళు సొరకాయ అంటారు, తెలంగాణా వాళ్ళు ఆనపకాయ అంటారు."  :- ఇతనెప్పుడైనా ఉత్తరాంధ్ర మొహం చూస్తే కదా తెలిసేది. మా వైపు సొరకాయ అంటే ఎవడికీ అర్ధం కాదు, ఆనపకాయ అనే వాడుతారు. అయినా కూరగాయ పేర్లు కూడా వివాదాస్పదం చెయ్యటం ఒక పరాకాష్ట. ఆల్ప్స్ పర్వతాలలో పుట్టిన టొమేటో పండుకు రామ ములగ పండు అని ఓ జమాన కాలం నుంచి పేరు...మరి కె.సి.ఆర్ బజారుకు వెలితే ఏ పదం వాడుతాడో? తెలంగాణా కూరగాయలపై ఆధిపత్యం వహిస్తున్న ఈ యూరోపియన్ కూరగాయల్ని తరిమేద్దాం అంటాడేమో !

 

తెలంగాణా వారికి తెలివి లేదని ఆంధ్రా వాళ్లు అంటారంట. ఏంటీ విచిత్ర వాదన? అయ్యా మీతో అలా ఎవరైనా అన్నప్పుడు ఇంత వరకు ఎందుకు ఊరుకున్నారు? పళ్లు రాలగొట్టండి పర్వాలేదు. ఏ ప్రాంతంలోనైనా మీ లాంటి రాజకీయ నాయకులు మాత్రమే ప్రజలంతా తెలివితక్కువ వారని భావిస్తారు. దానికి మీకు ప్రాంతాలతో సంబంధం లేదులెండి.


జొన్నన్నం తిని బతికి గుంటూరు వాసులు ఇప్పుడు తెలంగాణా నీటి వనరులు కొల్ల గొట్టి సన్నన్నం తినే స్తాయికి చేరి మనల్ని జొన్నన్నం తినే స్తాయికి దిగ జార్చిండ్రు. సారూ...జొన్నన్నం తినే స్తాయి గానీ, పత్తి పురుగుల రైతుల ఆత్మహత్యలు గాని, తెలంగాణాలో తీవ్రమైన ఫ్లోరైడు సమస్య గానీ మీ రాజకీయనాయకుల పుణ్యమే ! మీరు ఎన్ని తెలంగాణా ఊర్లను ఈ సమస్యలనుంచి బయట పడేసారు? ఎన్ని ఊర్లకు మీ ఖర్చుతో టాంకర్లతో నీరు అందిచారు? గుంటూరులో జొన్నన్నం తింటారని ఇప్పటి వరకూ తెలియదు. మీరు ఇంకొకటి తెలుసుకోవాలి. రాయలసీమలో ఇప్పటికి సంకటి తిని పడుకునే ఊర్లు వేల కొలది ఉన్నాయి. కోస్తాలో గంజి తాగి బతికే కుటుంబాలు లక్షలున్నాయి. వారికి జొన్నలు పండవు, సన్నన్నం దొరకదు...మీ రాజకీయ నాయకులిచ్చే ముక్కిపోయిన బియ్యం డీలరు తినేస్తాడు.


చిత్తశుద్ధితో ప్రయత్నించితే తెలంగాణా అదే వస్తుంది, అంతే గానీ ఇలాంటి దిక్కు మాలిన మాటలు మాట్లాడితే మీ వెనక ఉన్న సిద్ధాంతకర్త జయశంకర్ గారే సిగ్గు పడాల్సి వస్తుంది. మీరు సిధ్ధార్ధుడిలా ఇంటిలోనే ఉండి కబుర్లు చెప్పకుండా ఒక్క సారి రధం బయటకు తీసి మొత్తం రాష్ట్రం తిరిగి మాట్లాడితే కొద్దిగా బాగుంటుందేమో కదా?

Wednesday, October 11, 2006

కె.కె సంగీత విభావరి

నిన్న రాత్రి మా కంపెనీ వారి వార్షిక ఉత్సవం ఒకటి జరిగింది. చాల చిత్రంగా దానికి కుటుంబాలను అనుమతించలేదు, అందువలన కార్యక్రమంలో అందరూ కాస్త కృత్రిమంగా ప్రవర్తించినా చివరికి వినోద కార్యక్రమాలతో ఫరవాలేదనిపించారు. ఈ కార్యక్రమంలో మొట్టమొదటి లోనే జరిపిన అవార్డుల కార్యక్రమంలో తొలి అవార్డు గ్రహీత గైర్హాజరు...ఘనంగా అవార్డును చదివి పిలిచినా ఆ శాల్తీ అందుకోవాటానికి రాలేదు. ఆ శాల్తీ మరెవరో కాదు....మనమే...ఆ టైములో తీరిగ్గా బయలుదేరుతుంటే ఇక ఇడియట్ బాక్సు-2 మోగటం మొదలు పెట్టింది. ఆప్పుడు వచ్చిన కాల్సు వలన  అర్ధం అయ్యింది మిస్సయిపోయాన్రా బాబు అని. మరి అది ఈ సందర్భంలో ఇస్తారని నాకెవ్వరూ చెప్పలేదు. smile_sad. తీరా హుటాహుటిన అక్కడికి వెళ్ళాక ఎందుకు రాలేదు, ఎక్కడున్నావు అని జనాల ప్రశ్నల పరంపర. అలా విచారంగా మొదలయ్యింది నా సాయింత్రం.

తరువాత , వీర్ దాస్ అని ఒక కమెడియన్ (గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ షో ఫేమ్) కడుపుబ్బా నవ్వించాడు. ఆడవాళ్ళను పొగుడుతూనే వారి మీద జోకులు వేసి అదరగొట్టాడు. అదొక తప్పనిసరిగా రావలసిన  ఇంటి విద్య లా అనిపించింది. (పెళ్ళయిన మగ వాళ్ళకు ).

 

తరువాత కొన్ని వినోద కార్యక్రమాల తర్వాత, కెకె సంగీత విభావరి మొదలయ్యింది. మొదట్లో మెల్లగా సాగే పాటలు పాడినా, తర్వాత మంచి బీట్ ఉండే పాటలు, శంకర్ మహదేవన్ పాటలు, బ్రయాన్ ఆడమ్స్ పాట (Summer of 69) అద్భుతంగా పాడాడు.

 

kk_me

మా ఇద్దరం కలసి పెయింట్.నెట్ లో ఒక ఫోటో తీయుంచుకున్నాం ఇలా...smile_tongue

నాకు నచ్చిన కె.కె పాడిన పాటలు ..

  •  చెలియ చెలియా (ఘర్షణ)
  •  Summer of 69 (బ్రయాన్ ఆడమ్స్)
  •  ఆవారాపన్ బంజారాపన్ (జిస్మ్)
  •  ఓ హమ్ దమ్ సోనియారే (సాథియా)
  •  తూ ఆషికీ హై (ఝంకార్ బీట్స్)
  •  దస్ బహానే (దస్)

Thursday, October 05, 2006

గురజాడ పై గుర్రు

చదువరి గారు అందించిన ఈ వ్యాసం చదువుతుంటే కొంచెం నవ్వు, ఆలోచనా, చిరాకు కలిగి నా అభిప్రాయం రాయలనుకుంటున్నాను. నాకు తెలుగు భాషా శిల్పం, అది ఎలా ఉండాలి? ఇది ఇలా ఉండాలీ ..ఇవన్నీ తెలియవు కానీ గురజాడ రాసిన నవలను చదివిన సామాన్యుడిగా నా అభిప్రాయం ఇది..

నా మొదటి అభిప్రాయం : ఈ వ్యాస రచయత పక్కా కమ్యూనిష్టులా రాశాడు. అసలు తన సమస్య ఏంటో సూటిగా చెప్పకుండా ఎవరినో ఎందుకు తిడుతున్నామో తెలియకుండా తిట్టాడు. బాగానే ఉంది. నాకు అర్ఢం కానిది ఏమిటంటే, జాతి సంస్కృతి విధ్వంసం ఒక్కటే...అసలు గురజాడ కన్యాశుల్కం జాతిని ఏమైనా ఉద్ధరించిందా? లేదు కదా ! మరి ఈ విధ్వంసం ఏమిటి? కొంప తీసి వరకట్నం తీసుకోవటం గురజాడ వలన మొదలయ్యిందటారేమో మన నవరసాల గారు. (వీరిలో పిరికితనం, భయం అడుగడుగునా కనిపిస్తూ ఉంది...అసలు పేరుతో రాయొచ్చు కదా?). దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, దేశంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని ఒక విధ్వంసకారుడు ఎలా రాయగలడు...?

అసలు ఒక పక్క అప్పట్లో బలమైన వర్గమైన బ్రాహ్మణ వర్గ ఆచారాలపై కన్యాశుల్కం లో విరుచుకు పడిన తీరు చూస్తే పిరికితనం, భయం ఎక్కడ కనిపించాయో అర్ధం కావటం లేదు. గురజాడ పనికట్టుకుని ఏమి రాయలేదు, అప్పటికి ఏంటి ఖర్మ, ఇప్పటికీ మనం చాలా అరుదుగా కన్యాశుల్కంలో హాస్యానికి వాడుకున్న ఘట్టాలను చూడవచ్చు.

 

గురజాడ బ్రిటీషు వారిని కీర్తించాడు అన్నారు...బ్రిటీష్ వారు నయవంచకులు, విభజించి పాలించ వారు అన్నారు..మరి వారు మన దేశాన్ని పరిపాలించక మునుపు ఉన్న రాజులు ఏమి చేస్తున్నారు? జనాలను నాలుగు ప్రధాన కులాలుగా విభజించి పరిపాలించడానికి కారకులెవ్వరు? రాజుల పంచన వేల సంవత్సరాల నుంచి బతుకుతున్న ప్రధాన సామజిక వర్గమేది ? సీ.పి బ్రౌన్ ఎవరు? ఆర్ధర్ కాటన్ ఎవరు?

 

కాంగ్రెస్ ను అవహేళన చేశాడన్నారు, మరి ఎలానో రాయలేదు. విమర్శ అనుకోవచ్చుగా? అయినా కాంగ్రెస్ అంత కడిగిన ముత్యమేమీ కాదే? గురజాడ పతితలను వెనెకేసుకొస్తాడు అని నవరసాల గారి ఉవాచ. అతను ఒక్క  సారి "కన్యక" కావ్యం చదివితే మంచిది. పతిత అని ఒకరిని సంభోదించడంలో వినిపించే మగ దురహంకారం, భ్రష్టత్వం నాకు గురజాడ "జాతి విధ్వంసకర" కన్యాశులంలో కనిపించలేదేంటబ్బా?

Tuesday, October 03, 2006

శ్రీవారి ఆదాయం : తొమ్మిది కోట్లు

అయితే ఏంటంటా గొప్ప? తొమ్మిది రోజులు కష్టపడి, కిలోల కొద్ది ఆభరణాలు ధరించి, రక రకాలుగా ఊరేగి నిద్ర కూడా లేకుండా భక్తులకు అలసి సొలసి దర్శనమిస్తే తొమ్మిది కోట్లు వచ్చాయి పాపం.

హైదరాబాదులో రోజుకు మూడున్నర కోట్లు వసూలవుతాయి...స్వామీ వింటున్నారా? ఈ నగరంలో మందుబాబులందరూ కలసి అక్షరాలా రోజుకు మూడున్నర కోట్లు మధుపాత్రకు సమర్పిస్తారు.... అంటే తొమ్మిది రోజులలో ముప్ఫైరెండు కోట్లు...:-)...పాపం గాంధీ గారు కూడా ఈ రాబడి ఒక్క రోజు ఆపలేకపోయారు.

అలా నీళ్ళు నమలకుండా ఏదో చెయ్యొచ్చు కదా? మీకూ హుండీ ఆదాయం పెరగొచ్చు, ఈ తాగుబోతులు తగ్గితే...అసలు మీకు ఏమైనా ఆలోచించటానికి భక్తులు సమయమిస్తే కదా !

Monday, October 02, 2006

ఒక్కడు

రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం

సీతారాం సీతారాం, భజ ప్యారే తు సీతారాం

ఈశ్వర్ అల్లా తేరే నామ్, సబ్ కో సన్మతి దే భగవాన్. ||

పుట్టిన తరువాత, నూటా ముప్పై ఏళ్ళకు పైగా గడచినా, ఈ ఒకే ఒక్కడు కలలు గన్న దార్శనిక లోకం, యావత్ ప్రపంచాన్ని ఇంకా విభ్రమంలో ముంచెత్తుతూనే ఉంది.

భగవంతుడు, భారతీయులకు ఉమ్మడిగా ఇచ్చిన వరం "బాపు" జన్మదిన సంధర్భంగా, వారికివే హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.

ఈ సంవత్సరం యధావిధిగా "ఈనాడు గాంధిగిరీ పనిచేస్తుందా?" అనే విషయం మీద చాల ప్రసార వాహికలు చర్చలు జరిపాయి. అందులో నాకు నచ్చింది సీ.యన్.యన్-ఐ.బి.యన్ వారు నిర్వచించిన కార్యక్రమం. సంతోషకరమైన విషయం ఏమిటంటే, యువతరం ఇంకా కొంత వరకు గాంధీ అడుగు జాడలపైన ఆశలు పెట్టుకోవటం.అయితే కొంత మంది చాలా ప్రాక్టికల్ గా ఆలోచించి చెప్పినదేమంటే, "ఒక చెంప మీద కొడితే, రెండో చెంప చూపిస్తే, దాన్నీ వాయించి, ఉచితంగా వీపు గూడా వాయగొట్టే కాలం ఇది" :-) కొంత వరకూ నిజమే కదా ! ఇప్పుడు నాకు తెలిసీ గాంధీగిరి కొద్దిగా పనికొస్తున్నది "మౌన పోరటాలు" వరకే. అంత వరకూ ఎందుకూ, గాంధీ బాటలో చిత్త శుద్ధితో నడచిన పొట్టి శ్రీరాములు చనిపోయే వరకూ అప్పటి ప్రభుత్వం దిగి రాలేదు కదా ! నా స్నేహితులొకరు చెప్పినట్లు "బ్రిటీషు వారు కాబట్టి గాంధీ సిధ్ధాంతాలు పని చేశాయి, అదే కనక జర్మన్లు అయితే, భారత దేశ జనాభా సగం తుడిచిపెట్టుకుకు పొయేది, గాంధీతో సహా". అంతే మరి ...శత్రువు బట్టే శరం కూడా ఎంపిక చేసుకోవాలి.

ఐన్‍స్టీన్ అన్నట్లు : రాబోయే తరాలు, అస్సలు ఇలాంటి మనిషి భూమి మీద రక్త, మాంసాలతో నడచేడంటే నమ్మలేకపోవచ్చు.

Saturday, September 30, 2006

నిమజ్జనం చేసాక వినాయకుడు ఏం చేస్తాడబ్బా?

మనం లక్షల గణపతులను నిమజ్జణం చేస్తాం కదా...నీటిలో మునిగాక గణేశుడు ఏం చేస్తాడబ్బా అని వచ్చిన కొంటే ఊహకు రూపం కల్పిస్తే ?

ఉల్టా చోర్ కొత్వాల్‍కో డాంటే

దీన్నే కాస్త తెలుగులో చెప్పుకోవాలంటే : ఎద్దు తన తోక మీద కాలేస్తే పిల్లి ఎలక వంక ఎర్రగా చూసిందంట :-)

కాకపోతే ఇక్కడ 'ఈనాడు' ఎలక కానే కాదు, అక్కడే వచ్చింది చిక్కు మన "భగవంతుని పాలనకు".

దొరికింది దొరికినట్లు మేసెయ్యవచ్చు అనుకొని వేసుకున్న డొంకలు తీగలు లేకున్న కదుల్తున్నాయి. మీరు మీ ప్రభుత్వం లో తిన్నారు, మేము ఎందుకు తినకూడదు అన్నట్లుగా ఉంది ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. తాము చిక్కుల్లో పడ్డట్లు తెలియగానే ఇక అతి దరిద్రమైన రాజకీయం మొదలయింది. గత ప్రభుత్వం ఐ.ఎమ్.జి సంస్థ కు లీజుకు ఇచ్చిన భూములను వెనక్కు తీసుకుని దానిపై సీ.బీ.ఐ విచారణ మొదలుపెట్టింది. ఎంత సిగ్గు చేటు. అంటే పత్రికలు ఈ భూబాగోతం బయటపెడితేనే ఇట్లాంటివి ప్రభుత్వానికి గుర్తొస్తాయా? లేకపోతే చూసీ చూడనట్లు సర్దుకుపోవటమేనా?

 

ఇవన్నీ కాక పత్రికల మీద దుమ్మెత్తి పొయ్యటం, ప్రెస్ కౌన్సిల్ కి ఫిర్యాదు చేస్తామనటం పరిపక్వత లేని, హుందాతనం అస్సలు లేని చేతకానితనాన్ని చూపిస్తుంది. ఈ రోజు ఈనాడు తన మీద వస్తున్న ఆరోపణల మీద విరుచుకు పడిన తీరు నాకు చాలా నచ్చింది.

కొన్ని మంచి చెణుకులు

"పత్రికల మీద విశ్వాసం లేకుంటే ఒక్క రోజులో వాటిని వదిలించుకోవచ్చు, కానీ వచ్చిన చిక్కల్లా, మీ లాంటి నాయకులను ఒక సారి ఎన్నుకున్న తరువాత , ఐదేళ్ళ పాటూ మోయక తప్పదు ప్రజలకు !"

"పత్రికలు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నయని ఆక్షేపిస్తున్నారు వై.ఎస్. అవును అందులో తప్పేముంది? ప్రతిపక్షాల్లా కాక అధికార రాజపత్రికలలా ఉండాలా?"

ఇక ఇందిరమ్మ రాజ్యం మీద మంచి వ్యాఖ్యలు పడ్డాయి. ఇందిరమ్మ రాజ్యం అనిచెప్పి అమాయకులను మోసం చెయ్యొచ్చేమో గానీ, ఆ ఇందిరమ్మ గారు ఏలిన చీకటి రాజ్యం, మొండిగా భ్రష్టు పట్టించిన విదేశీ సంబంధాలు, అవివాహితులకు బలవంతపు కుటుంబ నియంత్రణలు, తమిళ తీవ్రవాదులకు పెరటి సాయం తెలిసిన వాడెవడయినా నవ్విపోతాడు. ఇంకా ఇందిరమ్మ వ్యక్తిత్వం మీద ఏవైనా భ్రమలు ఉంటే పుపుల్ జయకర్ (ఇందిర స్నేహితురాలు) రాసిన బయోగ్రఫీ చదవాల్సిందే. ఎమ్బీఎస్ ప్రసాద్ గార "పడక్కుర్చీ కబుర్లు" లో చెప్పినట్లు భారత దేశం లో నెహ్రూ కుటుంబ పరిపాలన నెహ్రూ తోనే అంతమయ్యింది. తరువాత నుంచి ఇందిరమ్మ కుటుంబ పాలనే !

ప్రజాస్వామ్యాన్ని నక్క తెలివితేటలతో హత్య చేసెయ్యటం ఇందిర తోనే మొదలయ్యింది. ఇందిర హత్య గానీ, రాజీవ్ హత్య గానీ త్యాగలనీ చెప్పలేము. నా పుట్టలో వేలు పెడితే కుట్టనా అందంట ఒక చీమ; రాజీవ్ విషయంలో అది చీమ కాదు, తమిళ పులి. ఇప్పుడు బుష్ చేస్తున్నదీ అదే...అనుభవిస్తాడు.

Thursday, September 28, 2006

మరో పద్మ వ్యూహమా? - 1

భాగ్యనగరంలో రోజు రోజుకు ట్రాఫిక్ సమస్య భూతంలా పెరిగిపోతుంది.ఇది ఎంత తీవ్రంగా ఉంది అంటే;గ్రామ ప్రాంతాలలోని ప్రజలు,మా నగరంలో ట్రాఫిక్ ఇలా ఉంటుంది అంటే నవ్వి పోతారు. అయితే దీనికి ఎవరు బాధ్యులు? అతి వేగంగా అభివృధ్ధి చెందుతున్న ఈ నగరం ఇకనైనా మేలుకోకుంటే త్వరలోనే బెంగుళూరులా చెడ్డపేరు తెచ్చుకోవటం ఖాయం.ఇక మనం ఈ నాణేనికి రెండు వైపులా చూద్దాం.


పోలీసులు మాత్రం ట్రాఫిక్ అనేది మాకు సంబంధించిన విషయం కాదన్నట్లే ఉన్నారు. నగర అదనపు కమీషనరు మాత్రం నెలకోసారి తూతూ అని ఒక రెండు పత్రికా సమావేశాలు నిర్వహించేస్తున్నారు.

నేను గమనించిన విషయాలలో ముఖ్యమైనవి ఇవి. (ఈ రోజు సమస్యలు మాత్రమే రాస్తా...పరిష్కారాలు తరువాతి టపాలో)

  • మన రోడ్లు, వాటి ప్రమాణాలు అతి చెత్తగా ఉన్నాయి.
  • వాటి నిర్మాణం కూడా చాలా అశాస్త్రీయం.
  • పోలీసులు అతి కొద్ది మంది ఉన్నారు. (కావలసిన దానికంటే ఒక పది రెట్లు తక్కువ)
  • అతి చెత్త ఆటో డ్రయివర్లు
  • బాధ్యతలేని ఆర్టీసి బస్సు డ్రయివర్లు
  • అస్సలు లేనే లేని ర్యాపిడ్ రోడ్ ప్యాచింగ్ టీములు
  • సరిగ్గా రోడ్డు వంపులలోనే నిర్మించిన బస్ (ఆటో?) స్టాపులు
  • నామ మాత్రం అక్కడక్కడా నిర్మించిన ఫుట్‍పాత్ లు.
  • రోడ్ మీద మాత్రమే నడిచే తొంభై శాతం జనాభా
  • నత్త నడక నడిచే ఫ్లై ఓవర్ నిర్మాణాలు
  • రోడ్లను మింగేస్తూ అక్రమ నిర్మాణాలు, అడ్డంగా గుడులు, మసీదులు, శ్మశానాలు
  • ప్రభుత్వ ట్రాఫిక్ సమాచార వ్యవస్థ లేదు
  • దారుణస్థితిలో ఉన్న మురుగునీటి వ్యవస్థ.
  • అడ్డదిడ్డమైన పార్కింగులు, అక్రమ పార్కింగులు
  • క్రమ పధ్ధతిలేని రోడ్డు తవ్వకాలు

 పైన పేర్కొన్నవి కాక, ఇంకా చిన్న చిన్నవి చాలా ఉన్నాయి. ఎన్నో విదేశీ యాత్రలు చేసి కూడా మన అధికారులు పని దగ్గరకొచ్చేసరికి ఆవులింతలు తీస్తున్నారు. పోలీసులలో చాలా మందికి కొన్ని రూల్సే తెలియవు. జాగ్రత్తగా గమనిస్తే వారి ఉద్యోగం పట్ల నిరాసక్తత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.

Wednesday, September 27, 2006

ఏడు తరాలు

ఈ రోజు జీ స్టూడియో వారు అలెక్స్ హేలీ రాసిన ప్రసిద్ధ రచన "రూట్స్" ఆధారంగా నిర్మించిన టెలీ చిత్రాన్ని రెండు భాగాలుగా ప్రసారం చేశారు. నవల నన్ను కదిలించినంతగా ఈ చిత్రం కదిలించలేకపోయింది.

కాకపోతే హృదయాన్ని కలచివేసే "ఏడు తరాలు" మరలా చదవాలనిపించే ఆసక్తి పుట్టింది.

Monday, September 25, 2006

విని వినిపించు లైఫ్ అందించు

బిగ్ 92.7 : ఈ కొత్త ఎఫ్.ఎం ప్రసార వాహిక మెచ్చుకోదగినదిగా వుంది. వ్యాఖ్యాతలు అధిక ప్రసంగం, అనవసరపు దీర్ఘ్హాలు తీయకుండా స్ప్రష్టంగా తెలుగు మాట్లాడుతున్నారు. ఇలా ఎన్నాల్లు ఉంటుందో తెలియదు గానీ, ప్రస్తుతానికి ఈ ప్రసార వాహిక నా మదిలో వరల్డ్ స్పేస్ తరువాత స్థానాన్ని పొందింది.

Wednesday, September 20, 2006

విశాఖ థియేటర్ల సమ్మెలో న్యాయం ఎంత?

గత నాలుగు రోజులుగా విశాఖలో థియేటర్ల మూసివేత చూస్తే మనవాళ్ళు సమ్మెకు కాదేదీ అనర్హం అనుకుంటున్నారు. నగర అదనపు కమీషనర్ మౌలిక సదుపాయాల కొరత కారణంగా ఒక హాలుని మూత వేస్తే, మిగతా థియేటర్లు ఆ కసిని ప్రేక్షకుల మీద తీర్చుకుంటున్నారు.

ఆ సంగతి అటు ఉంచితే, విశాఖ థియేటర్లలో ఈ విధమైన సౌకర్యాలు ఉన్నాయి.

  •  అతి చెత్తగా, రోజుకు ఒక సారి శుభ్రం చేసే టాయిలెట్లు.
  • పార్కింగు పైన కట్టేసిన థియేటర్లు (రమాదేవి)
  • అసలు కారు పార్కింగు కూడా లేక పోవటం (జగదాంబ)
  • ఇష్టానుసారం ధరలు పెంచి అమ్మే తినుబండారాలు
  • కనీస అగ్ని మాపక సదుపాయాలు, అగ్ని మాపక యంత్రం తిరిగే సదుపాయం కూడా లేక పోవటం. (ఏదో ఒకటి జరిగితేనే మన ప్రభుత్వం హడావిడి చేస్తుంది.)

ఎన్ని రోజులు సినిమాలు ఆపేసినా ఫర్వాలేదు కానీ, ఈ థియేటర్లు బాగుపడ్దాకే వాటికి అనుమతి ఇస్తే బాగుంటుందేమో...

Tuesday, September 19, 2006

ఐ.ఐ.టి కోర్సులు ఆన్‍లైన్ లో...

మన దేశంలో అత్యున్నత సాంకేతిక విద్యా సంస్థలయిన భారత సాంకేతిక విద్యాలయాలు అన్ని పాఠ్యాంశాలను వెబ్బీకరించే ప్రయత్నం మొదలుపెట్టాయి. దీని వలన అత్యున్నత ప్రమాణాలు కలిగిన పాఠాలు అన్ని స్థాయిల విద్యార్ధులు చదువుకునే వీలు కలుగుతుంది.

ఈ లంకెను అనుసరించండి.

  • http://nptel.iitm.ac.in
  • కోర్సులపై నొక్కండి.
  • కొత్త సభ్యునిగా చేరండి.
  • మీరు ఇప్పుడు అన్ని పాఠ్యాంశాలను చదవగలరు.

మంటగలసి పోయిన ఎమ్‍సెట్

ఎమ్‍సెట్ ని దిగ్విజయంగా మంటగలిపేసారు. దేశంలో ఐ.ఐ.టి లాంటి పరీక్షల స్థాయిలో కాకునా మన ఎమ్ సెట్‍ని అంతో ఇంతో గౌరవించేవారు. ఎందుకంటే పోటీ చాలా తీవ్రతరం కావటం, కోచింగు సెంటర్లు పోటీ పడి పిల్లల్ని చదివించటం, తల్లితండ్రుల బుర్రల్లో డాక్టరు, ఇంజనీరు తప్ప ఇంకేమీ వుండక పోవటమూ లాంటి కారణాలతో ఎమ్‍సెట్ ఎల్లప్పుడూ ఉత్కంఠభరితంగా ఉండేది.

అప్పుడే మన ప్రభుత్వాలకు దానిపై కన్ను పడింది. వీధికో కళాశాల పెట్టేస్తే మన పిల్లోల్లు అందరూ ఇంజనీర్లు, డాక్టర్లు అయిపోయి వాళ్ళ ఇంటిపేరు నిలపెడతారు, మనకి కూడా బోలెడంత ఫీజు డబ్బులు, కాలేజీల డబ్బులు వస్తాయి కదా అని ఆలోచించి గేట్లు ఎత్తేసారు. ఇప్పుడు సీట్లే సీట్లు. మనకు బుర్ర ఉందా లేదా? లేకా ప్రభుత్వం రుమాలు (రిజర్వేషన్లు) వుందా లేదా అక్కరలేదు. ఎలాగో ఒకలా ఇంటర్ అయిపోతే చాలు. మన కోసం ఒక ఇంజనీరింగు సీట్ తయారుగా వుంటుంది. ఎమ్‍సెట్ కూడా రాయనక్కరలేదు. దేవుడి దయవలన ఆ కోర్సు అయిపోతే బీ.టెక్  అని చెప్పి ఎదో ఒక కంపనీ దొడ్డిదారిలో సాప్టువేరు ఇంజనీరు కావచ్చు, లేకా మంచి కాంట్రాక్టరు అయ్యి బోలెడంత సంపాదించి చచ్చు పుచ్చు ఆనకట్టలు కట్టవచ్చు.

ఇక డబ్బు ఉండీ లేని మధ్యతరగతి ఇంజనీర్లు ఏం చేస్తారబ్బా? ఇంక ఏం చేస్తారు? ఈ వీధి కళాశాలలో పాఠాలు చెప్తున్న ప్రొఫెసర్లు వాళ్ళే కదా ! నాకు తెలిసీ అన్ని చిన్నా చితకా ఇంజనీరింగు కళాశాలలో  అందరూ ఈ కుర్ర ప్రొఫెసర్లే.


ఒక్క ఉపయోగం ఏమిటంటే, ఇక తల్లి తండ్రులకి కొద్దిగా స్వాంతన. ఎవడూ మీ అబ్బాయికి సీటు రాలేదా  అని దెప్పడు...పిల్ల్లల ఆత్మహత్యలు తగ్గుతాయి.  అసలు ఎమ్‍సెట్ నే తీసేస్తే ఆ ఖర్చు కూడా తగ్గుతుంది.కోచింగు సెంటర్ల గాలీ తగ్గుతుంది.

Saturday, September 16, 2006

కౌసల్యా సుప్రజా రామా...

ఈ రోజుకీ మన చెవులలో మారు మోగే ఒక పవిత్రమైన మేలుకొలుపు. ఆ పవిత్రతకు ప్రాణం పోసిన అమరజీవికి ఈ రోజు తొంభైవ జయంతి.

ఈ అసలు సిసలైన భారత రత్నానికి ఇవే హార్దిక నివాళులు.

ఇలా ఉంటే ఎలా ఉండేదో మన ప్రపంచం

అద్భుతమైన ఈ వీడియో చూడండి. ఈ ప్రకటన ప్రతిష్టాత్మకమైన ఎపికా బహుమతి గెలుచుకుంది.

ఇలాంటిదే ఆపిల్ వారి మరొక ప్రకటన...కాకపోతే ఇది వివాదాస్పదమైంది.

వెనకబడిన వాళ్ళ్సు ఎవరు?

తెలంగాణా వాణి ప్రధానంగా వెనుకబాటుతనం అన్నది తెలిసిందే. ఈ విషయంలో అసలు సందేహమే అక్కరలేదు.

టీ.జీ వెంకటేష్ : రాయలసీమ వెనకబడి వుంది.

రాయపాటి : ఆంధ్ర వెనకబడి వుంది. (ఇతనికి గుంటూరు తప్పితే ఇంకో ప్రాంతం తెలిసినట్లు లేదు).

కోస్తా మీద ఎవరూ ఇంతవరకూ మాట్లాడలేదు...(వాళ్ళు రాజకీయంగా కూడా వెనుకబడినట్లున్నారు :-))

ఇవన్నీ చూస్తోంటే రెండు విషయాలు అర్ధం అవుతున్నాయి.

౦౧. మన రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు వెనుకబడి వున్నాయి (ప్రపంచబ్యాంకు అప్పులు చూస్తే తెలుస్తాయి)

౦౨. అందరు రాజకీయ నాయకులు తమ భవిష్యత్తుకు బాటలు ఇలా వేర్పాటు కూతల ద్వారా వేసేసుకుంటున్నారు.

అంత వరకూ ఎందుకూ, మన రాజధాని నగరంలోనే పూటకి తిండిలేని అభాగ్యులు ఎంత మందో...

రైతుల ఆత్మహత్యలకు ఆంధ్ర, తెలంగాణా, రాయలసీమ తేడా లేదు.

కాంట్రాక్టర్ల, భూబకాసరుల పాపాలకు ఆంధ్ర, తెలంగాణా, రాయలసీమ తేడా లేదు.

కుల వివక్షతకు, వరకట్నాలకూ, హత్యలు, అభధ్రతకూ, అశాంతికి ఆంధ్ర, తెలంగాణా, రాయలసీమ తేడా లేదు.

మన రాష్ట్రం వంద రాష్ట్రాలైనా వీటి పెద్దగా ఎదురుండక పోవచ్చు. ఏమంటారు.

Friday, September 15, 2006

అంతా మన మంచికే...^%$#@#

ఈ మధ్య వింటున్న అప్పు ముక్కలు (క్రెడిట్ కార్డులు) వాళ్ళ ఆగడాలు చూస్తే ఔరా అనిపిస్తుంది. ప్రధమ దశలో వారి నక్క వినయాలు, మీరు అప్పు పడ్డాక వారి హైనా అరుపులు...ఇవన్ని వారికి గురుకులంలో పెట్టిన విద్యలు. దీనికి ఏ బ్యాంకు మినహాయింపు కాదు. ఎందుకంటే ఇందులో వారి ప్రమేయం చాలా తక్కువ. ఈ కాకా పనులు, ముక్కుపిండే పనులు బయటి కంపనీలు వీరికి చేసిపెడతాయి. అందువల్లన మీరు ఎంత పెద్ద, పాత వినియోగదారు అయినా, వాళ్ళు వారి బాష లోనే పని చేస్తారు. తస్మాత్ జాగ్రత్త సుమాండీ...

ఇదే విషయం మీద ఈ మధ్య నాకు ఒక హాస్య గుళిక ఈ-టపా లో వచ్చింది. అది ఇక్కడ మీ కోసం తెలుగులో....


ఒక జంట అలా విహారయాత్రకు వెళ్ళి వద్దామని, మలేషియాకు దక్కన్ అయిర్ లైన్స్ వారి  విమానం చెన్నయ్ లో ఎక్కారు. వారితో పాటూ ఒక ఇరవై మంది ప్ర్రయాణీకులూ వున్నారు. కొంత దూరం సాఫీగా ప్రయాణించాక విమానం తాలుకా ఇంజన్ ఒకటి పనిచెయ్యటం మానేసింది(ఇది దక్కన్ కు మామూలే).

పైలట్ తాపీగా విషయాన్ని ఇలా ప్రకటించాడు. "ధైర్యవంతులు, సాహసికులైన ప్రయాణికులారా ! మీరు ప్రయాణిస్తున్న విమానం యొక్క రెండు ఇంజన్‍లలో ఒకటి ఇప్పుడే పనిచెయ్యటం మానేసింది. రెండవది కూడా అతి తొందరలో  ఆగిపోవచ్చు. అందువల్లన మనం మధ్యలోనే ఎక్కడో విమానాన్ని దింపెయ్యటం తప్పని సరి. ప్రస్తుతం  నేను ఒక పేరు తెలియని ద్వీపం మీద క్రాష్ లాండింగ్ చెయ్యబోతున్నాను. మీరు మీ శేష జీవితాన్ని ఈ ద్వీపం పైనే గడపటానికి సిధ్ధపడండి. ఎందుకంటే ఇది ఎవ్వరికి తెలియని ద్వీపం మరియు మన రేడియో పాడయ్యింది కూడా.."

ఏడుపులు , పెడ బొబ్బలు నేపధ్యం‍లో విమానం ద్వీపం మీద దిగింది. అందరూ దేవుడా ఇక్కడ ఎలా జీవితం గడపాలిరా బాబు అని ఇటూ అటూ చూడటం మొదలుపెట్టారు.

అప్పుడు మన కథా నాయకుడు (జంటలో) ఆదుర్దాగా తన భార్యని అడిగాడు. " నువ్వామధ్య అలుక్కాస్ లో కొన్న వజ్రాల హారానికి, క్రెడిట్ కార్డు బిల్లు కట్టావా? ముందర కట్టాల్సిన తొంబైవేలకు నేను ఇచ్చిన చెక్కు డ్రాప్ బాక్సులో వేసావా? అన్నాడు.

భార్యకు ఒక్కసారి గుండె గతుక్కుమంది. ఆమె ప్రయాణం హడావిడిలో ఆ పనులు మర్చిపోయింది. "లేదండీ...మరి మరి ..." అంటూ భయంగా భర్త వైపు చూసింది.

మన హీరో ఒక్కసారిగా ఎగిరి గంతేసి భార్యను ముద్దుల్తో ముంచెత్తాడు.

"వాళ్ళు తప్పక మనలని కనుక్కుంటారు" పరమానందంగా అరిచాడు.

Wednesday, September 13, 2006

ఇది ఒక పరీక్ష

నాకు గత వారం రోజులుగా ఈ బ్లాగర్ తో తెగ చిక్కులొస్తున్నాయి. ఎన్ని సార్లు కొత్త పోస్ట్ జత చేసినా కూడా అది కేవలం ఒక్క గంట లో విచిత్రంగా మాయమవ్వటం. తీరా బ్లాగర్ సహాయ సమూహాలు గాలిస్తే నాలాంటి అభాగ్యులు అక్కడ ఎంతో మంది వున్నారని అర్ధం అయ్యింది. బ్లాగర్ సాంకేతిక సహాయ బృందంలో మహా అయితే ఇద్దరు ఉద్యోగులు వుంటారేమో, రోజులు గడిచిపోతున్నా మీ బాధ మాత్రం పట్టించుకోరు. ఎంతైనా గూగుల్ కదా, మనమూ పెద్దగా ఇలాంటి చెత్త సర్వీసును పెద్ద మనసుతో పట్టించుకోం...

Friday, September 08, 2006

తెలుగు వికీపీడియా శోధన

ఇప్పుడు దాదాపు అన్ని (ఐ.యి 7, ఫైర్ ఫాక్స్ 1.5 మొదలైనవి) కొత్త బ్రౌజర్లు ఓపెన్ సెర్చ్ మాధ్యమాన్ని ఉపయోగిస్తున్నాయి. అందువలన మనకు కావలసిన శోధనా పరికరాలను బ్రౌజరుకు జత పరుచుకొనవచ్చు. నేను ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుని తెవికీ యొక్క శోధనా యంత్రాన్ని జతపరిచేందుకు కావలసిన సరంజామా ఇక్కడ సిధ్ధం చేసాను.


తెలుగు వికీపీడియా శోధన

మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయగలరు. :-)

నేతి బీరకాయలు

మన తెలుగు ఛానల్స్ బాగా పరిశీలించితే నాకు ఈ క్రమంలో తెలుగుతనం కనిపించింది. చిట్టాలో చివర వున్నవి తెలుగు చానల్లు అని ఇంక చెప్పుకోనక్కరలేదు :-)

01. దూరదర్శన్ - సప్తగిరి
02. ఈనాడు టీ.వీ 2
03. ఈనాడు టీ.వీ
04. జెమిని
05. తేజా
06. మా టీ.వీ
07. టీ.వీ 9 (వీళ్ళ కట్టు బొట్టు కూడా తెలుగు కాదు)

వీటిలో కొన్ని ఛానల్లు, తెలుగులో మాట్లాడి నాలుక్కరుచుకుని ఆంగ్లంలో చెప్పిన సందర్భాలు వున్నాయి. మొత్తం ఆంగ్లపదాలనే కార్యక్రమాలకు పేర్లుగా వాడిన ఛానల్లున్నాయి.

మీరూ మీ అభిప్రాయాలు, క్రమం తెలియచేయండి...

Thursday, September 07, 2006

వందేమాతరం

వందేమాతరం
సుజలాం సుఫలాం మలయజ శీతలాం
సస్యశ్యామలాం మాతరం !!
శుభ్ర జ్యోత్స్నా పులకిత యామినీం
ఫుల్ల-కుసుమిత-ద్రుమ దళ శోభినీం
సుహాసినీం సుమధుర భాషిణీం
సుఖదాం వరదాం మాతరం

Tuesday, September 05, 2006

తొలి తెలుగు తీర్పు

ఒక హత్య కేసుకు సంబంధించి తెలుగులో తొలి తీర్పు (పూర్తిగా) ను గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదిత్య భాంజ్‌దేవ్ రాష్ట్ర న్యాయ చరిత్రలో తనకొక పుట రాసుకున్నారు.

ఈనాడు నుంచి సేకరణ

Monday, September 04, 2006

చరిత్రలో చెవిలో పువ్వులు

చరిత్ర, పురాణాలు చదువుతుంటే కొన్ని సార్లు అవి అవి రాసిన రచయతల అభూత కల్పనలకు, వక్ర బుధ్ధికి బలయి పోయాయేమొ అనిపిస్తాయి. ఎవరో చెప్పినట్లు చరిత్ర విజయవంతులు, బలవంతులు చుట్టూనే తిరుగుతుంది. శతాబ్దాల తరబడి ప్రజలను మోసగిస్తూ వుంటుంది.

ఉదాహరణకి : గెలీలియో పీసా శిఖరం ప్రయోగం.

అందరూ దీన్ని గురించి చదివే వుంటారు. గురుత్వాకర్షణ కు భారంతో సంబంధం లేదని నిరూపించడానికి గెలీలియో పీసా శిఖరం నుంచి ఒక సీసపు గుండును, పావురాయి ఈక ను వదిలాడని,అవి రెండూ ఒకే సారి భూమి మీద పడ్డాయని సవాలక్ష పుస్తకాలలో రాసేసారు. అయితే మీరు ఆ ప్రయోగమే ఒక వంద సార్లు చేసినా సీసపు గుండే ముందు భూమిని తాకుతుంది.ఎందుకంటే అక్కడ చాలా ప్రసిద్ధమైన జడత్వం, ఘర్షణ అనే కారకాలు పనిచేస్తాయి. ఇక్కడ గెలీలియో చేసిన ప్రయోగం తప్పు కాదు. చేసిన వర్ణన తప్పు. నిజానికి సీసపు గుండుని, పావురాయి రెక్కని ఒక శూన్య నాళికలో వదిలితే అవి ఒకే సారి భూమిని తాకుతాయి.

ఇలాంటివి చరిత్ర పుస్తకాలలో కోకొల్లలు.

Saturday, September 02, 2006

జ్వాలా జంబూకం

ఈ రోజు ఫైర్ ఫాక్స్ 2.0 బీటా 2 వ్యవస్థాపితం చేసాను. చాలా బాగుంది. మొదలవ్వటానికి కొంత సమయం పట్టినా కూడా, అంతా శుభ్రంగా అందంగా అనిపించింది. ముఖ్యంగా పుటలు (టాబ్స్) పొందిగ్గా వున్నాయి. అయితే తెలుగు చదవటంలో వున్న ఇబ్బందులు ఇంకా తొలిగిపోలేదు :-( ఒత్తులు, నుడికారాలు అన్ని విడిపోతున్నాయి. పద్మను కూడా వ్యవస్థాపితం చేసి చూడాలి.

అసలు ఫైర్ ఫాక్స్ మొదటి పుట (గూగుల్ శోధన) తెలుగు లో మార్చి అన్ని సైబర్ కేఫ్ లలో వ్యవస్థాపితం కోసం పంచితే ఎలా వుంటుంది? ఆ పుట లో తెలుగు వికీ, బ్లాగర్లు, దినపత్రికల లింకులు వుంచితే ఇంకా ఫలితం వుండవచ్చు.

(నా బ్లాగులో ఇది షష్టి పూర్తి టపా :-))

ఇంటర్నెట్ నిశ్శబ్దం

గత వారం రోజులుగా నేను ఇంటర్నెట్ నిశ్శబ్ధంలో వున్నాను. దానికి కారణం నేను శలవు పెట్టేసి ఇంటికి చెక్కెయ్యటమే కాక మరేమీ కాదు :-) నిన్నటి నుంచి మా ఇంట్లో కూడా ఇంటర్నెట్ ప్రపంచం మొదలయ్యింది. భారత సంచార నిగమం వాళ్ళకు కృతఙ్ఞతలు. చాలా నాణ్యమైన సేవలు అందిస్తున్నారు.

Friday, August 25, 2006

ద్రోహి...ద్రోహి...ద్రోహి...ఎవడురా ఈ ద్రోహి (రఘువరన్ ఫక్కీ లో)

తె.రా.స : కాంగ్రెస్ తెలంగాణా ద్రోహి
తె.దే.పా : తె.రా.స తెలంగాణని మోసం చేస్తోంది
కాంగ్రెస్ : తెలుగుదేశం తెలంగాణ ద్రోహి
భాజపా : కాంగ్రెస్,తెదేపాలు తెలంగాణా ద్రోహులు
వామపక్షాలు : రాష్ట్ర విభజన అంత వీజీ కాదు

విజయశాంతి : నేను పుట్టిందే తెలంగాణా కోసం, నాకు బుర్రలేదన్నవాళ్ళకి అస్సలు బుర్రలు లేవు
నరేంద్ర : రక్తవర్షం చిందిస్తాం, తడాఖా చూపిస్తాం (గత రెండు సం.లు గా ఇదే కలవరింత డాక్టరు గారు :-()
కే.సి.ఆర్ : ప్రజలు తిరగబడి దొమ్మీలు, దాడులు చేస్తే మా పూచి కాదు (ఇదొక హింటా?)

ఎమ్మెస్ : తెలంగాణ మరో పదేళ్ళకు కానీ రాదు
వై.యస్ : తెలంగాణాకి కావల్సింది విభజన కాదు..అభివృధ్ధి

తెలంగాణా ప్రజలు : అయో????? @$%%^%%్%$%$$%$ ???మయం

తెలుగు భాష : హమ్మయ్య ఇన్నాళ్ళకు ఒక అచ్చ తెలుగు పదం "ద్రోహి" పదే పదే అందరూ వాడుతుంటే బలే వుంది...శభాష్ బిడ్డలు, తాంబూలాలిచ్చేసారుగా ఇక తన్నుకు చావండి.

Thursday, August 24, 2006

ఆర్యభట్ట : అమెరికా సమావేశం

ఈ వెబ్ సైట్ చూసిన తరువాత నాకు చాలా సంతోషం కలిగింది. మన గడ్డ మీద పుట్టిన ఆర్యభట్ట ని మనం ఐన్‌స్టీన్ ని గుర్తించినంతగా కూడా గుర్తించక పోయినా, ప్రతిష్టాత్మకమైన ఆర్.యస్.ఏ సమావేశం ఈ సంవత్సరపు ప్రత్యేకాంశంగా స్వీకరించింది. ఈ సమావేశం ఫిబ్రవరి, 2006 లో జరిగింది.

ఆర్యభట్ట గురించి కొద్దిగా : ఆర్యభట్ట భారతదేశ అత్యున్నత గణిత శాస్త్రవేత్తలలో అగ్రగణ్యుడు. ఇతను క్రీ.శ. 476-550 ప్రాంతంలో నివసించినట్లు అంచనా. ఆర్యభట్ట కుసుమపుర (ఈనాటి పాట్నా) లో నివసించాడు. ఇతను ఆర్యభట్టీయ, ఆర్య సిధ్ధాంత, గోళాధ్యాయ మరియు సంస్కృత గణిత సంఖ్యా శాస్త్రాన్ని రచించాడు. ఇవే కాక ఆర్యభట్ట 'పై' విలువని సుమారుగా కనుకున్నట్లు చెప్తారు. గణితం లో మనం నేర్చుకున్న సైన్ మరియు కొసైన్ లను ఇతను "జ్యా" మరియు "కొజ్యా" గా నిర్వచించాడు.

ప్రపంచంలో చాలా మంది ప్రముఖ గణిత శాస్త్రవేత్తల కష్టాలకు కారణమైన భూమి యొక్క ఆకారాన్ని గోళాకారంగా ఆనాడే తన గోళాధ్యాయలో నిర్వచించాడు. అంతేకాదు మన గ్రహాల యొక్క ప్రకాశం స్వయంప్రకాశం కానే కాదని, అది కేవలం సూర్యకాంతి పరివర్తన వలన అని చెప్పాడు. సూర్య గ్రహణాలను ఖచ్చితంగా లెక్క కట్టాడు.

భూమి ఏదైనా స్థిర నక్షత్రం చుట్టూ తిరగటానికి పట్టే సమయం 23 గంటల, 56 నిమిషాల, 4.1 సెకనులు గా లెక్కగట్టాడు. ఈనాటి ఆధునిక లెక్కల ప్రకారం అది 23 గంటల, 56 నిమిషాల, 4.091 గా తేలింది. ఇప్పుడు చెప్పండి ఐన్‌స్టీన్ కంటే ఆర్యభట్ట ఏ విషయం లో తక్కువ. అతని కాలం లో శాస్త్ర పరికరాలు అంతగా అభివృద్ధి చెంది లేవు కూడా.

ఒక పరిపూర్ణ భారత రత్న అయిన ఆర్యభట్టకు చేతులెత్తి ఇవే నా జోహార్లు. మన దేశంలో మన ప్రాచీన గణిత ప్రాభవం తెలియని చాలా మంది ఇంజనీర్లు వుండటం ఎంతో విచారకరం. ఈ మధ్యనే ఎవరో గుర్తులేదు గాని, ఆర్యభట్ట అంటే సున్నా కనిపెట్టిన వాడు కదా అని నాతో అన్నారు. నిజానికి ఆర్యభట్ట ప్రతిపాదించిన సంస్కృత సంఖ్యలలో "శూన్య" లేదు. సున్నా కి చాలా పెద్ద చరిత్ర వుందండోయ్ :-)

Tuesday, August 22, 2006

ముఖ్యమంత్రిగారి "పత్రికల పై దాడి"


నాకు మన ముఖ్యమంత్రిగారి "పత్రికల పై దాడి" చూస్తే కాసేపు నవ్వు (అతని విధంగా కాదండీ) వచ్చింది. అంత బట్ట బయలుగా ఆ విషయాలను చెప్పినందుకు నాకు అతను ఒక కోణం లో చాలా నచ్చాడు :-). కానీ అతను మరీ చిన్న పిల్లాడిలా రామరావు సి.ఎం కావటానికి, చంద్రబాబు సి.యం కావటానికి ఒక పత్రిక కారణం అనటం ప్రజాస్వామ్యాన్ని కించపరచి మాట్లాడటమే అవుతుంది. నిజానికి రాజశేఖర రెడ్డి పాద యాత్రకు తెగ వార్తలు రాసింది,అతను ప్రతిపక్షం లో వుండే కాలం లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మద్యపాన నిషేధానికి పెద్ద ఎత్తున ఉద్యమం లేవదీసిందీ ఈనాడు పత్రికే. అయితే ఈనాడుకు ప్రజల వోట్ బ్యాంకును ప్రభావితం చేసే శక్తి వుందని అనుకోవటం అవివేకం. అలా వుండి వుంటే చంద్ర బాబు అంత చిత్తుగా వోడిపోయేవాడా? :-) ఎవరేమి అనుకున్నా ఈనాడు మరీ వార్త అంత చెత్త పత్రిక మాత్రం కాదు.

ఇక నవ్వటం అంటారా ? తప్పనిసరిగా ఎవరో మానసిక వైద్యులు ఇచ్చిన సలహా మేరకు ఒత్తిడి తగ్గించుకోవటానికి మన సి.యం గారు అలా తెగ నవ్వటం మొదలు పెట్టారని నా నమ్మకం. లేక పోతే సంజ్యూ ది ఆర్ట్ ఆఫ్ వార్ ని ఆచరణలో పెడుతున్నాడా కొంపతీసి :-)

వందేమాతర గీతం వరస మారుతున్నది

వందేమాతర గీతం ఏ సందర్భం లోనూ పాడనక్కరలేదంట. ఎందుకని అడక్కండి. అసలు ఆ గీతానికి రాజ్యాంగంలో వున్న/కల్పించిన ప్రాముఖ్యత మంటగలిసిపోతుందా అనిపిస్తోంది. ఆ గీతం ఏమైనా హిందూ గీతమా? సాహిత్యమా? మన పాఠశాలల్లో తెలుగు మాట్లాడితే జరిమానాలు, వందేమాతరం పాడమంటే నిరసనలు, పిల్లలో బలవంతపు మత మార్పిడులు, వారి చేత హిందూ దేవతల పటాలు తగుల పెట్టటం...ఏమిటిదంతా? మరో సాంస్కృతిక దండయాత్రా? హిందూ ధర్మానికి హిందూ మతం అని పేరు పెట్టి చాలా తప్పు చేశారేమో.

నా చెత్త రాత

నేను ఈ నెల తెలుగు బ్లాగర్ల సమావేశానికి వెళ్ళలేకపోయినా (మనం ఆదివారం లేచేదే పదిన్నరకి..ఇంకెక్కడకి వెళ్తాం. అయితే నేను కిరణ్ చావా కంటే నయమే లేండి..అతను పదకొండుకు లేచాడు :-)) నాకు బాగ నచ్చిన ఒక అంశం "తెలుగు చేతి రాతని బ్లాగ్ చెయ్యటం". వీవెన్ గారి ఈ పోస్ట్ చూసి, నేను కూడా ఆవేశంగా కలం కలపాలని నిర్ణయించుకున్నా అది పై విధంగా విషాదాన్ని చిందించిందండి :-(

నిత్య జీవితంలో హాస్య నటులు...

ఈ మధ్యలో నేను చూసిన చాల కామెడీ మనుషుల్లో కుమారి విజయ శాంతి ఒకరు. ఆమె తెలుగు వింటూ ఉంటే ఎవ్వరికైనా నవ్వు వస్తుంది. సినిమాలు జనాలని ప్రభావితం చెయ్యటం చూసాం గాని, ఇలా నటులను కూడా ఇలా ప్రభావితం చేస్తాయనుకోలేదు. నాకు తెలిసి దేవానంద్ తరువాత, విజయశాంతి తను నటించిన పాత్రల వల్ల బాగా ప్రభావితం చెందిందనుకోవచ్చు.:-)

మన తెలుగు ప్రజలు సినీ నటులకు ఇచ్చే అతి గౌరవాన్ని ఎలా వాడుకోవచ్చొ ఈమెనే అడగాలి. సినిమాలు తప్పితే, ఆమెకు అసలు ఈ రాష్ట్రం మీద ఏ మాత్రం అవగాహన వుందో తెలియటం లేదు. ఆమెకు తోడు మన టైగర్(ఈయన అంతా రక్తం, మాంసం అనే పదాలే వాడుతూ మాట్లాడుతారు) ఆంధ్ర (ఎవరు ఆంధ్రులు? తెలుగు మాట్లాడే వారా? లేకా ఇంకెవరైనా వున్నారా? :-)) వారి చిత్రాలు ఆడనివ్వరంట...ఇంత కంటే పెద్ద జోకు మరొకటి వుండదు. కర్నాటక లో కొద్ది రోజులు తెలుగు చిత్రాలు ఆపితేనే అక్కడి ప్రజలు తెగ నిరసించారు...మరి మన సొంత రాష్ట్రంలో మన చిత్రాలు కాక పోతే ఇంకెవరి చిత్రాలు చూస్తామబ్బా ! ఇదేదో తెలుగు తాలిబాన్ ల గుంపు లా కనిపిస్తుంది నాకు.

చిరంజీవ చిరంజీవ

 

తెలుగు/తెలుగేతర ప్రజలని గత ఇరవై ఏల్లకు పైగా తన నటనతో రంజింప చేయటమే పనిగా పెట్టుకున్న ఈ మేరునగ ధీరునికి, అద్వితీయం అనే పదానికి అర్ధం చూపించిన మన చిరు కి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.

Sunday, August 20, 2006

తాళి కట్టు శుభవేళ

గత వారం రోజుల వ్యవధిలో మన ఆంధ్ర రాష్త్రం లో ఇలాంటి అందమైన వివాహాలు ఒక మూడు వేలు జరిగాయంటంటండి :-) ఏది ఏమైనా తెలుగు పెళ్ళికి సాటి వచ్చేది మరలా ఆ సీతా రాముల పెళ్ళేనేమో? మరి ఈ సందర్భంగా మనకున్న అందమైన పెళ్ళి పాటలలో ఒక పాటని ఆనందిద్దాం.

Saturday, August 19, 2006

శభాష్ "ఇలక్కణం"

ఇలక్కణం అనే ఈ తమిళ చిత్రం భాషాభిమానులకు ఒక ఆదర్శంగా నిలుస్తుంది. ఈ చిత్ర నిర్మాతలు నన్నెరి సంస్థ ఈ చిత్రం లో ఒక్కటంటే ఒక్క ఆంగ్ల పదం వాడినట్లు చూపిస్తే ఒక లక్ష బహుమతి ఇస్తామని ఎంతో ధీమాగా ప్రకటించారు. తమిళ నాట భాషాభిమానం ఎప్పుడూ విజేత గా నిలబెడుతుంది అనేది విదితమే. ఇలా నిర్మించిన తెలుగు చిత్రాలకు ప్రభుత్వమే రాయతీలు ఇచ్చి ప్రోత్సహించేటట్లు మన ఏ.బీ.వీ.కే ప్రసాద్ గారు ప్రయత్నిస్తే బాగుండు.

Wednesday, August 16, 2006

ఆహా...మీడియా...నీకు జోహార్లు

నిన్న టీవీలో ఒక దారుణమైన న్యూస్ వీడియో చూపించారు. మనోజ్ మిశ్రా అనే ఉద్యోగి ప్రభుత్వ రంగ సంస్థ అయిన సుధా డైరీ ముందు కూర్చుని తన వంటికి నిప్పు అంటించుకోవటం.

అగ్గి పుల్ల గీసిన దగ్గరనుంచి (రెండు సార్లు వెలగలేదు) మీడియా మహానుభావులు దాన్ని చిత్రీకరిస్తూనే వున్నారు తప్పితే ఆపే ప్రయత్నం చెయ్యకపోవటం దారుణమైన విషయం. కెమెరా ముందరే అతను సజీవంగా మాడిపోయాడు. అది చూస్తున్నప్పుడు నేను మంచం నుంచి అప్రయత్నంగా లేచి నిల్చున్నా...ఏమి చెయ్యలేనని తెలిసినా..:-(


అసలు ఎందుకు ఇలా మానవత్వం మంట కలసిపోతుంది? పోలీసులు కాస్త ఆలస్యం చేస్తే విరుచుకు పడే మీడియా తనకు మాత్రం బాధ్యత అవసరం లేదనుకుంటుందా? రేపు ఎవరైనా నాగర్జున సాగర్ కింద బాంబు అమరిస్తే దాన్ని అమర్చడం వీడియో తీస్తారేమొ గాని, చచ్చినా దాన్ని ఆపరు....

కొన్ని చానల్స్ అయితే "మెరుగైన సమాజం కోసం" అని రాసుకుంటున్నాయి. వారు ఇంటిని చక్క బెట్టి రచ్చ మీదకి బయలుదేరితే మంచిది...

"హిందూ" ఎక్కడి నుంచి పుట్టింది ?

నాకు ఒక మిత్రుడు పంపిన వివరాలలో ఒక ఆసక్తిసరమైన విషయం తెలిసింది. అది మన 'హిందూ పదం యొక్క పుట్టుక. హిందూ నాగరికత ప్రధానంగా సింధూ నాగరికత అనే విషయం తెలిసిందే కదా. మరి ఈ హిందూ అనే పదం ఎక్కడి నుంచి పుట్టిందబ్బా? మనకు ఏ పురాణలలో కూడ ఈ శబ్దం ఎక్కడా వున్నట్లు లేదు కదా? (నాకు తెలియదు, వుంటే క్షమించాలి :-))

పారశీకులు ఈ శబ్దానికి మూల కారకులు అంట. వీరు ఋగ్వేద ఆర్యులు నుంచి విడిపోయిన ఒక జాతి. వీరికి "స" అక్షరం సరిగా పలకడం రాదు. వీరు భారత ద్వీపకల్పంలో అడుగు పెట్టిన మొదట్లో ఎదురైన నది "సింధూ నది". దాన్ని వారు "హిందూ నది" గా పిలవటం మొదలుపెట్టారు. నాగరికత అంతా సింధూ లోయ వెంబడే వుండటం చూసి, వారు మన దేశాన్ని "హిందూ దేశం" గా పిలిచారు. అదే తరువాత "ఇండస్ సివిలైజేషన్" అయింది. మన దేశం ఇండియా అయింది.

అందువల్లనే, హిందూ మతం అనేది ఒక అద్భుతమైన ఆర్య సంస్కృతి,సింధూ నాగరికతల మిశ్రమ ఫలితంగ ఏర్పడిన ఒక "మతం". ప్రత్యేకంగా హిందూ మతం అనేది ఎక్కడా పుట్టలేదు. వేదాలలో ప్రస్తావించబడలేదు. ఎందుకంటే వేదాలు కుల ప్రాతిపదికగ సమాజంలో పుట్టినవి. మతానికి అప్పట్లో అర్ధం లేనే లేదు.

Tuesday, August 15, 2006

భారత స్వాతంత్ర దినోత్సవ శుభాభినందనలు

 

ఆప్తులకు, మిత్రులకు మరియు ఈ బ్లాగు పాఠకులకు భారత స్వాతంత్ర దినోత్సవ శుభాభినందనలు.

 దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్నాడొక మహాకవి. మరి   ఆ లెక్కన మన దేశ ప్రజల మనస్సులకు నిజంగా స్వాతంత్రం వచ్చిందా? లేకా 'ఇండియా' అనే భూమికి మాత్రం చెర వీడిందా?

మన మనస్సులలోంచి బానిసత్వపు జాడలు పోయాయా? పోతే ఇంకా మనలో దొరలు, సార్లు, అయ్యగారు, అమ్మగారు, బాబుగార్లు ఇంకా ఎందుకున్నట్టబ్బా? మనకి ఇంకా పోలీసులంటే భూతాలే అనిపిస్తుందే !!! మన ప్రాధమిక హక్కులు ఎంటో కూడా చాలమందికి తెలియవే? అమెరికా లాంటి దేశం లో సైతం పోలీస్ తో నా హక్కులేంటో నాకు తెలుసు అని చెప్పే వీలుంది కాని, మన దేశం లో అలా చెప్తే పిచ్చోడిలా చూస్తారు.

చెప్పండి, ఇది స్వాతంత్రమా? సర్వతోముఖాభివృధ్ధా? ఎదో నూతన్ ప్రసాద్ కామెడీ డైలాగ్ లా వుందేమో గాని, నిజంగా దేశం చాల క్లిష్ట పరిస్థితులలో వుంది. గడచిన 60 ఏళ్ళలో లేనంతగా....

Monday, August 14, 2006

ఇది ఒక ప్రయోగాత్మక పోస్ట్

దీనిని నేను విండోస్ లైవ్ రైటర్ ని వుపయోగించి రాసాను. చాలా సులభంగా మరియు అందంగా వుంది. మీరూ ప్రయత్నించి చూడండి.

దీనిని వ్యవస్థాపితం చేసుకునటానికి ఇక్కడ చూడండి. http://download.microsoft.com/download/f/9/a/f9a19...

మరిన్ని వివరాలకు ఇక్కడ చూడండి : http://windowslivewriter.spaces.live.com/blog/

గమనిక : తెలుగు లిపిలో రాయటానికి నేను లేఖిని ని వాడాను. లేఖిని ఈ పరికరం లో భాగం కాదు.

Thursday, August 03, 2006

ఇంకా చంపకండి ప్లీజ్.

ఈ రోజు ఈనాడులో హుడా వారి ప్రకటన (5వ పేజీలో) చూసి నవ్వాలో, ఏడవాలో అర్ధం కాలేదు.ఒక ప్రభుత్వరంగ సంస్థ, ఇంత బజారు ప్రకటన చెయ్యటం అవసరమా అనిపిస్తోంది. సమాచార హక్కు కింద మీరు 10 రూపాయలు ఎన్ని సార్లు చలాన కట్టి అడిగినా రాని సమాచారం, ఈ భావోద్వేగాలతో ప్రచురించటం ఏంటో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికే అర్ధం కావాలి. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికే జవాబుదారీ కావాలి తప్ప, ఏ అధిక సర్కులేషన్ వున్న పత్రికకో కాదు. ఈ ప్రకటనకు నాకు అంచనా ప్రకారం ఒక 3 లక్షలు అవుతుంది(ఒక పత్రికకి).ఎవడబ్బ సొమ్మని ఈ ప్రకటనలు ఇస్తున్నారు? హుడా అంత ఉద్వేగానికి గురి కావల్సిన పని ఏముంది. అయితే వారి ప్రకటనలో ఒక వాస్తవం మనకు కనిపిస్తుంది. మన 5వ స్తంభం(మీడీయా) కూడా కుళ్ళిపోయింది. అది ఈనాడు కానియండి,వార్త లేకా టివి9 కానీయండి. నాకు ఈ విషయాలలో ప్రత్యక్ష అనుభవాలు వున్నాయి. అందుకే కొంతమంది విలేఖరులను చూస్తే లాగి కొట్ట బుద్ధి అవుతుంది.

రాజకీయ నాయకులకు, పత్రికలకు, బ్యూరాక్రాట్లకు ...చేతులు జోడించి ఇదే విన్నపం...చచ్చిన ప్రజాస్వామ్యన్ని, సోషలిజాన్నీ ఇంకా చంపకండి ప్లీజ్.

Tuesday, August 01, 2006

ఈ వారం విశాలాంధ్ర పై దాడి

కొత్తగా కొన్న పుస్తకాలు...

01. చివరకు మిగిలేది - బుచ్చిబాబు
02. మిసెస్ అండర్‌స్టాండింగ్ - బ్నిం
03. అమ్మ - గోర్కి (ఇది నేను మూడవ సారి కొనటం...2 సార్లు స్నేహితులు జాతీయం చేసేసారు)
04. సాహితీ సర్వస్వం - ముళ్ళపూడి వెంకట రమణ (8 సంపుటాలు)
05. తెలుగు నేర్పటం ఎలా - రంగ నాయకమ్మ
06. సమగ్ర ఆంధ్ర సాహిత్యం - ఆరుద్ర (తెలుగు అకాడమీ - 4 సంపుటాలు)
07. రామాయణ విషవృక్షం - రంగనాయకమ్మ

సాగర ఘోష...ఎవడికి పట్టిందీ?

రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తనకూ బాధ్యతలు వున్నాయని చాటి చెప్పింది. గణేశుడి నిమజ్జనంపై మూడు రోజులలో తేల్చాలని ప్రభుత్వానికి ఆఙ్ఞ ఇవ్వటం నాకు ఎంతో సంతోషంగా వుంది. మరో వైపు నిమజ్జన కమిటీ ప్రవర్తన మరీ బజారు ప్రవర్తన లా వుంది. ఒరేయ్ నీకు లెక్కలలో 3 మార్కులు వచ్చెయేంట్రా అని తండ్రి అడిగితే..పక్కింటి గోపి గాడికి 0 వచ్చాయి...వాడినెవరైనా అడిగారా అని తిరిగి కోపంగా చూసే పనికిరాని లాజిక్కులతో ప్రభుత్వాన్ని నిలదీస్తోంది.

ఒక పక్క టన్నుల కొద్ది ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో హుస్సేన్ సాగరం అడుగున ఒక గట్టి మందమైన పొర ఏర్పడిపోతుందిరా బాబు అని కాలుష్య నివారణ సంస్థలు ఏడుస్తుంటే, దాన్ని కనీసం ఒక సమస్యగా కూడా పట్టించుకోక పోవటం, వారి కళ్ళకు పట్టిన ధన మదం అని చెప్పకనే చెపుతుంది. అసలు మన దేశంలో పి.సి.బి కి అత్యున్నతమైన అధికారాలు ఎప్పుడు వస్తాయో కదా :-(.......

Wednesday, July 26, 2006

నా బాల్యం - మక్సీం గోర్కి

నాకు నచ్చిన మంచి పుస్తకాలలో మక్సీం గోర్కి రచించిన "నా బాల్యం". అసలు గోర్కి తన బాల్యాన్ని అంత నిశితంగా ఎలా అవలోకించాడా ? అనిపిస్తుంది నాకు...ఎంతో అసహ్యకరమైన విప్లవ పూర్వపు రష్యను ప్రపంచం లో అతను వర్ణనాతీతమైన అందమైన తన సొంత ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు.

"సూర్యుడస్తమిస్తూ అకాశాన్నంతా అగ్ని ప్రవాహంతో నింపేసేవాడు. నిప్పులు ఆరిపోయి తోటలో పరచిన ఆకుపచ్చని తివాచీ మీద బంగారంతోనూ, కెంపులతోనూ నిండిన బూడిద వెదచల్లేసేవి. దాంతో చుట్టుపక్కల నెమ్మదిగా చీకటి అలుముకుని విస్తరించి, సర్వాన్ని తనలో యిమిడ్చేసుకుని వుబ్బిపోయేది. సూర్య కిరణాలను తృష్ణ తీరా దిగమింగేసి తృప్తి చెందిన ఆకులు కొమ్మల మీద సొమ్మసిల్లి వాలిపోయేవి. గడ్డి మొక్కలు తమ ఆకులు భూమి మీద వాల్చేసేవి. ప్రతి వస్తువూ కొత్త విలువల నార్జించుకుని మరింత కోమలంగా మరింత శోభాయమానంగా రూపొంది సంగీతంలా మృదువైన సువాసనతో పరిమళించేది.దూరాన పొలాల్లో వున్న సైనిక శిబిరాల నుండి సంగీతం గాలిలో తేలుతూ చెవిన పడేది. తల్లి ప్రేమకి యెలాగైంతే మనిషి తేట పడి బలపడతాడో, అలాంటి అనుభూతినే కలిగిస్తుంది రాత్రి కూడా. తల్లి కౌగిలిలాగే ఆ నిశ్శబ్దం కూడా హృదయాన్ని మృదువైన వెచ్చని చేతులతో జోకొట్టుతూ మరచిపోవలసిన దాన్నంతా - పగటిపూట పది పేరుకుపోయిన తుప్పునీ, చౌడునీ ధూలిధూసరాన్నంతటిని తుడిచివేస్తూ మరపించేస్తుంది"

Monday, July 24, 2006

భాష ఇండియా.కాం వారి ఉత్తమ బ్లాగ్ అవార్డ్ (తెలుగు లో)...

నమ్మశక్యం కాకుండా ఉంది. నేను భాష ఇండియా.కాం వారి ఉత్తమ బ్లాగ్ అవార్డ్ (తెలుగు లో) గెలుచుకున్నాను. :-) కానీ నాకు తెలిసి మహా మహులైన తెలుగు బ్లాగర్లు వున్నారు. వారు బహుశా ఈ పోటీ లో పాల్గొనలేదేమో ? ఏమైతేనేమి కొంచెం ఆనందం గానే వుంది :-)



Thursday, July 13, 2006

రక్తాశ్రువులు..ఇంకా ఎన్నాళ్ళు ?

నరజాతి చరిత్ర సమస్తం
పరస్పరాహరణోద్యోగం..
నరజాతి చరిత్ర సమస్తం
రణరక్త ప్రవాహసిక్తం.

రణరంగం కానిచోటు భూ
స్థలమంతా వెదకిన దొరకదు..
గతమంతా తడిసె రక్తమున,
కాకుంటే కన్నీళులతో

ఒక వ్యక్తిని మరొక్క వ్యక్తీ,
ఒక జాతిని వేరొక జాతీ,
పీడించే సాంఘిక ధర్మం
ఇంకానా? ఇకపై సాగదు

ఏ యుద్ధం ఎందుకు జరిగెనో?
ఏ రాజ్యం ఎన్నాళ్ళుందో?
తారీఖులు, దస్తావేజులు
ఇవి కావోయ్ చరిత్రకర్ధం

మరొక్క సారి ముంబై నగరం రక్తాశ్రువులు చిందించాల్సి వచ్చింది. రెండవ పాకిస్తాన్ గా తయారవుతున్న హైదరబాద్ నుంచే ఈ కుట్ర ప్రధాన పాత్రధారి బయటపడటం కలవరపాడల్సిన విషయం. మన పోలీసులు ఎలాగు కలవర పడరులెండి..అది వేరే విషయం. మన నగర పోలీస్ శాఖ లో సగానికి పైగా పైరవీల మీద వచ్చిన వారే అన్నది నగ్న సత్యం. మన నగరం లో ముంబై పోలీస్ తమ శాఖ ను ఏర్పాటు చేస్తె బాగుంటుంది అనిపిస్తుంది.
ప్రశాంతంగా ధర్నా (సత్యాగ్రహం అనవచ్చా?) చేసుకుంటున్న ఇంటర్మీడియట్ విద్యార్ధుల మీద ప్రతాపం చూపించారు మన పోలీస్. వీళ్ళకు అసలు హృదయం అనేది వుందా అనిపిస్తుంది. ఇదే జులుం ప్రసాద్స్ ఐమాక్స్ మీద రాళ్ళు రువ్వినా వాళ్ళ మీద చెయ్యమనండి చూద్దాం. పోలీస్ కి కూడ వోట్ బ్యాంకు విలువ అవసరం లా వుంది. రంగ్ దే బసంతి గుర్తుకు వస్తోంది కదా.

Wednesday, July 12, 2006

కధా వాహిని 2006

రచన పత్రిక లో 2005 సంవత్సరం లో ప్రచురితమైన కధల లో ఎంపిక చేసిన 27 ముత్యాల లాంటి కధలు "కధా వాహిని 2006" గా ప్రచురించారు. ఈ కధల సంపుటి లో కవన శర్మ, కాళీపట్నం మాస్టారు, వసుంధర, పొత్తూరి విజయలక్ష్మి, వాసిరెడ్డి సీతాదేవి, వివిన మూర్తి, ఎలక్ట్రాన్, బీన దేవి, వి.యస్ రమాదేవి వంటి హేమా హేమి రచయతల కధలున్నాయి.

ప్రతులకు :
వాహిని బుక్ ట్రస్ట్, 1-9-286/3,విద్యా నగర్,హైదరాబాద్ - 44
పేజీలు : 201, వెల : రూ. 100/- మాత్రమే.

Saturday, July 08, 2006

సుజన రంజని జూలై నెల సంచిక

సుజన రంజని జూలై నెల సంచిక విడుదల అయ్యింది.

http://www.siliconandhra.org/monthly/2006/july2006/index.html

యూనికోడ్ లో వుంటే మరింత బాగుండేది కదా :-(

Friday, July 07, 2006

చీమ మరియు పట్టు పురుగు

ఈ కధ ఏసొప్ ఫేబుల్స్ నుంచి తర్జుమా చేసాను.

అది ఒక ప్రభాత సమయం. ఒక చీమ వడి వడి గా అడుగులు వేసుకుంటూ ఆహారాన్ని వెతుక్కుంటూ బయలుదేరింది. దారిలో దానికి ఒక పట్టు పురుగు కనిపించింది. అది దాదాపుగా సీతా కోక చిలుకగా మారే సమయం వచ్చింది కానీ ఇంకా పట్టు గూడు నుంచి బయట పడలేదు. చీమ దగ్గరకు రాగానే అది తన తోకను కాస్తా కదిలించింది. అది చీమను ఆకర్షించింది. చీమ ఎప్పుడూ అలాంటి జీవిని చూడలేదు మరి.
అరే, పాపం అనుకుంది చీమ. ఎంతటి దురదృష్టం నీది అంది. నేను ఎక్కడికి కావాలంటె అక్కడికి నడవగలను, చెట్లు ఎక్కగలను...చాలా సంతోషంగా జీవితం గడుపుతున్నాను...నిన్ను చూస్తే జాలి వేస్తుంది. నీ జీవితం అంతా ఆ గూడు లోనే వుండాలి...మహా అయితే నీ తోక ని అటూ ఇటూ కదపగలవేమొ అంది. ఇదంతా విన్న పట్టు పురుగు ఏమి మాట్లాడకుండా వూరుకుంది.

కొన్ని రోజుల తరువాత చీమ అదే దారి వైపు వచ్చింది. దానికి అక్కడ ఖాళీ గూడు తప్ప ఇంకా ఏమీ కనిపించలేదు. చీమ ఆశ్చర్యపోయింది. అయితే ఒక్క సారిగా ఏదో పెద్ద నీడ తనని కప్పివేసినట్లు అనిపించి వెనక్కు తిరిగి చూసింది. ఒక అందమైన సీతాకోకచిలుక పెద్ద పెద్ద రెక్కలతో తన వైపే చూస్తూ కనిపించింది.సీతాకోకచిలుక మాట్లాడ సాగింది...నన్ను తెగ వెక్కిరించిన ఓ మిత్రుడా.....ఇప్పుడు నీ శక్తులన్ని ఉపయోగించి నడిచి, పరిగెత్తి , చెట్టులెక్కి నన్ను వెంబడించగలవేమో చూడు అని ఒక్క సారిగా గాలిలోకి ఎగిరి ఆ వేసవి గాలుల వెంట ఎగురుతూ చీమ దృష్టి నుంచి శాశ్వతంగా మాయమయ్యింది.

నీతి : కంటికి కనిపించేవి అన్నీ నిజం కావు.మోసపూరితంగా వుండవచ్చు.

Sunday, July 02, 2006

ఒక రెండు వారాల విశేషాల కషాయం

రోజులు మంచి గానే పోతున్నయి. ఏదో ఏడిస్ ఈజిప్టీ అనే దోమంట, ఆ.ప్ర తో ఆడుకుంటుంది. మన ప్రభుత్వ పటిమ దోమలకూ అర్ధం అయినట్లుంది. అందరికి ఆ దోమ జ్వరం తో పాటు ఫుట్‌బాల్ జ్వరం కూడా పట్టుకుంది. నాక్కూడా (ఆట జ్వరం మాత్రమే):-)
మా ఆఫీస్ టీం అంతా కలసి ప్రగతి రిసార్ట్స్ అని ఒక ప్రదేశానికి వెళ్ళాం. మాతో పాటు అక్కడ మరో 7 కంపెనీల జనం వున్నారు. వెళ్ళీ వెళ్ళగానే ఆవేశంగా ఫుట్‌బాల్ ఆడటం మొదలుపెట్టాం. నాకు ఆ రోజు ఆ ఆట ఆడటం జీవితంలో మొదటిసారి. మొదట్లో సరదాగానే అనిపించింది గాని, ఒక 20 నిమిషాల తరువాత అది అంత ఆషామాషిగా ఆడుకునే ఆట కాదని తెలిసింది. వుత్తి పాదాలతో ఆడటం వలన అరికాళ్ళు మంట పుట్టటం మొదలయ్యింది. కాకపోతే నేను మా జట్టు తరఫున ఏకైక గోల్ చేసాను. అప్పటి నుంచీ నన్ను ఒకడు వెంబడించి మరీ అడ్డుకోవటం మొదలుపెట్టాడు. ఈ హంగామా లో నా ఒల్లంతా హూనం. ఈ రోజుకి (7 రోజుల తరువాత) కూడా అక్కడక్కడా నొప్పిగా వుంది.
ఆట బాగా ఆడి అలసిపోయాక, స్విమ్మింగ్ పూల్ లోకి దూకాము. ఆనందం వస్తే మది అన్నింటిని పక్కన పెడుతుంది కదా.....అందువలన ఒక 2 గంటలు పూల్ లో వివిధ విన్యాసాలు, ఆటలు జరిగాయి. దాని ఫలితమే ఈ రోజుకూ నన్ను పీడిస్తున్న రొంప.
జూలై 2, నా పుట్టిన రోజు, బహుశా ఈ మధ్య కాలం లో చాలా బిజీ రోజు అయివుండవచ్చు. ఈ రోజు పోకిరి అనే సినిమా చూసా. నాకు పెద్దగా నచ్చలేదు. శ్రుతి మించిన రక్తపాతం, పస లేని అతుకుల కామెడీ ట్రాకు. అయితే మహేష్ బాబు నటనకు చాల మంచి రోజున్నాయి అని ఈ సినిమా నిరూపిస్తుంది.
ఈ మధ్య చూసిన ఒక మంచి చిత్రం 'ఫనా". చక్కని కధ, పాటలు, కధా నాయక, నాయకీమణుల నటన పోటీ పడుతూ మనల్ని ఆనందింపచేస్తాయి. నా హిట్ లిస్ట్ లో వున్న కొన్ని సినిమాలు ..
01. గోదావరి
02. సూపర్‌మేన్
03. ఎం.ఐ 3
04. ది వైల్డ్
05. పైరేట్స్ ఆఫ్ కరీబియన్ - ది డెడ్ మ్యాన్స్ టేల్.

Saturday, July 01, 2006

హాయ్ నా పేరు గణపతి...అయాం ఫ్రం పారిస్.ప్లాస్టర్ ఆఫ్ పారిస్...

వినాయక చవితి వచ్చేస్తుంది...హుస్సేన్ సాగర్ కు ముచ్చెమటలు పోస్తున్నాయి. చాలా పకడ్బందీగా, ఐ.ఏ.యస్ లు, ఐ.పి.యస్ లు, రాజకీయ నాయకులు, విద్యావంతుల సాక్షిగా....ఆ బొజ్జ గణపతి పేరు మీద నగరానికి ఒక తల మానికమైన జలాశయం కొన్ని వందల టన్నుల విషాన్ని మౌనం గా దిగమింగాలి. గత సంవత్సరం ప్రభుత్వం అట్టహాసంగా ఏదో జీ.వో జారీ చేసినట్లు గుర్తుకొచ్చింది. అది ఏమిటంటే ఈ సంవత్సరం నుంచి అన్ని విగ్రహాలు కేవలం మట్టి తోనే చెయ్యలనీ. మరి ఎవరు దీన్ని పర్వవేక్షిస్తారు? ఈ రోజు కూకట్‌పల్లి లో చూసాను, వేల విగ్రహాలు యధాతధంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసేస్తున్నారు. ఒక 8 నెలల ముందు గానే ఆ కార్మికులకు కొంత అవగాహన, మట్టితో బొమ్మలు చెయ్యటానికి ప్రత్యేక శిక్షణ ఇప్పించవచ్చు కదా. మన ఖర్మ కొద్దీ మనకు ఈలాంటి పనికిమాలిన ఐ.ఏ.యస్ లు దొరుకుతున్నారు. వాళ్ళు హైదరాబాద్ కి లంచాల కోసమే బదిలీల మీద వస్తున్నట్టుగా వుంది.

Monday, June 05, 2006

సుస్వరాల...


గంధర్వులు నిజంగా అంత అద్భుతంగా పాడుతారో లేదో మనకి తెలియదు గాని, మన సుస్వరాల బాలు తప్పనిసరిగా శాపవశాత్తు భూమి పైన పడ్డ ఒక గంధర్వడై వుంటాడని అనిపిస్తుందండి :-)
ఆ అభినవ గాన గంధర్వుడికి జన్మదిన శుభాకాంక్షలు.

Friday, June 02, 2006

ఒక మరచిపోయిన పోస్టు...

జూన్ 2వ తేది..: మన స్వరాల రాజా, ఇళయరాజా పుట్టిన గొప్ప రోజు ఇది. ఇళయరాజా గురించి ఎంత సేపైనా రాయొచ్చు కాని, ఈ బిజీ ఆఫీస్ టైం వలన ఇక్కడితో ఆపుతా..

మన సురాగాల పల్లకి కి ఇవే నా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు

Monday, May 29, 2006

నీ కోసం ఎదురు చూసే వారెవరు...

మీరు "రంగ్ దే బసంతి" చూసారా? ఒక చూడ చక్కని చిత్రం కదా? నాకు మనసుకు హత్తుకున్న, ఎప్పుడు విన్నా నా కంట నీరు తెప్పించే పాట ఒకటుంది...దాన్ని నేను ఇక్కడ అనువదించాను.(song : luka chuppi)
విమానదళం లో వున్న ఒక సైనికుడి తల్లి యొక్క ఆరాటం, ఆ సైనికుని ఒంటరితనం ఇక్కడ చదవండి..

దాగుడు మూతలు చాలు ఇక నా ముందుకు రావా
నీ కోసమని అన్ని చోట్లా వెతికాను
ఈ అమ్మ ఇక అలసిపోయిందిరా
ఈ అసుర సంధ్య వేళ నీ గురించే నా భయమంతా
ఈ కనులు చూసేందుకు మొరాయిస్తున్నాయి, నా దగ్గరగా రా

నేనున్న ఈ చోటు గురించి ఏమని చెప్పేది అమ్మా
ఇక్కడ స్వేచ్చా స్వాతంత్రాలు ఆకాశమంతటా పరచుకుని వున్నాయి
నువ్వు చెప్పిన కథల లాంటి అమాయకత, అందమే అన్ని వైపులా
ఇది ఒక అద్భుతమయిన కలలా వుంది
నా గాలిపటం నిరాటంకంగా ఎగురుతోంది
దాని దారాన్ని ఎవ్వరూ ఇక్కడ తెంపలేరు

నా కళ్ళు నీ కోసం ఎదురు చూస్తున్నాయి
మరి హ్రుదయం పరి పరి విధాల పోతుంది
మెల్ల మెల్లగా చీకట్లు అలముకుంటున్నాయి, నా దీపం ఎక్కడుంది?
సూర్యుడు దిగిపోతూ చంద్రుడికి సైగ చేస్తున్నాడు, మరి నీవెక్కడ ?
నా చంద్రుడెక్కడ?

ఇవన్నీ నీకు ఎలా చూపించను
నేను జలపాతాల నీటిని త్రాగానమ్మా
నా కలల ప్రతి పార్శ్వాన్ని ఇక్కడ తాకాను
ఇక్కడ కాంతి తో పాటె నీడా వుంటుంది
వాతావరణం అంతా క్రొత్తగా, గమ్మత్తుగా వుండింది
నేను కోరుకున్న ప్రతి ఒక్కటీ ఇక్కడ వున్నాయమ్మా...కానీ...

నీవు లేక నాకు ఒంటరితనమే కనిపిస్తుంది...

Saturday, May 13, 2006

మనసు కవి ఆత్రేయ 85 వ జయంతి

ఈ రోజు మనసు కవి ఆత్రేయ 85 వ జయంతి. ఈ సందర్భంగా వరల్డ్ స్పేస్ లో ఆత్రేయ పైన భావ వీచికలు కార్యక్రమం చేసిన మృణాలిని గారికి కృతఙ్ఞతలు.

కిలాంబి వెంకట నరసింహాచార్యులు రాసి మనల్ని, రాయకుండా నిర్మాతలను ఏడిపిస్తాడని ఎందుకు అంటారో మళ్ళీ అర్ధం అయ్యింది.

Sunday, April 30, 2006

నాకు నచ్చిన తెలుగు

ప్రతి రోజు ఓ కూర
తిన్నాక మరి నోరార
కావాలి గోంగూర
ఓ కూనలమ్మ

ఇది నా చిన్నప్పుడు చదివిన కూనలమ్మ పదాలలోని ఒక ఆణిముత్యం. రాసిన మహానుభావుడు - ఆరుద్ర

మన సినిమా హాస్యం నిజంగా హాస్యమేనా ?

ఈ రోజు అలా ఎక్కడికో వెలుతుండగా ఒక సినిమా పోస్టరు కనిపించింది. "కిత కితలు" అంట. అంటే కిత కితలు పెట్టుకుంటే గాని నవ్వు రాదని అర్ధమా లేక కిత కితలు పెట్టించేదో అర్ధం కాలేదు గాని ఈ జన్మ కి మన తెలుగు దర్శకులు కొంత మందికి భావ వ్యక్తీకరణ పరంగా విలువలు పెరగవు అని అర్ధం అయ్యింది. అందులో ఈ.వి.వి లాంటి కుళ్ళు హాస్యం తో సినిమా లు తీసే వారికి అస్సలు పెరగవు. ఇక్కడ నేను హాస్యం ని నా మనస్త్వత్త పరంగా గాని నా సెన్స్ ఆఫ్ హ్యూమర్ పరంగా గాని నిర్వచించటం లేదు. నాకు హాస్యం అనేది ఒక సాపేక్షమయిన అనుభూతి అని తెలుసు.

మన సినిమాలలో మానసిక వికలాంగుల మీద, శారీరక లోపాల మీద హాస్యాన్ని పండించే సినిమాలను ఇప్పటికయినా "సెన్సారు" వారు కత్తిరిస్తే మంచిది. లేకపోతే వారికి వారి లోపం వల్ల బాధ కంటే ఇలా సంఘం పెట్టే "చిత్ర" వధ ఎక్కువవుతుంది.

దయచేసి ఇలాంటి చిత్ర రాజాలని మీరు గాని, మీ పిల్లలు గాని చూడకండా జాగ్రత్త పడండి.

Thursday, April 27, 2006

అయ్యా ! అధ్యక్షా ! పరలోకం లో వున్నారా అధ్యక్షా ?

బాబూ పిచ్చి నవ్వుల జడ్డి రాజశేఖర రెడ్డి గారు, అయ్యా మీరొక్కసారి ఆ చేతకాని నవ్వులు ఆపి ఈ రాజధాని లో ఒక్క అమాయకపు (హెల్మెట్ తొడుక్కున్న) బైకు ప్రయాణికుని వెనక ఎక్కి ఒక 20 కి.మీ తిరుగుతారా సార్?

అయ్యా అధ్యక్షా ! కోట్లు ఖర్చు పెట్టి వేసిన ప్లీనరీ రోడ్లు ఒక్క సారి చూడండి. ప్రతి 10 అడుగులకు ఒల్లు హూనం చేసే గోతులు...అవికూడా ఎదో డ్రయవింగు లో శిక్షణ ఇవ్వటానికా అన్నట్లు అడ్డం దిడ్డం గా.

అయ్యా మా సాఫ్టువేరు ప్రజలకు పని వలన వచ్చే వెన్ను నొప్పికి తోడు మీరు నవ్వుకొంటూ పిచ్చి పిచ్చిగా వేస్తున్న రోడ్లు ఇచ్చే వెన్ను నొప్పి ఒకటా?

నా జీవితం లో హైదరాబాద్ అంతటి భ్రష్టు పట్టిన నగరాన్ని ఎక్కడా చూడలేదంటే నమ్మండి అయ్యా !

ఇక్కడి జనాలకు బ్రతుకు మీద ఆశ లేదు, ఎందుకంటే ఆత్మహత్య చేసుకోవాలనే వాళ్ళే రోడ్లు అలా దాటుతారు.

ఆటోవాళ్ళు అధ్యక్షా ! చెయ్యవిసిరినా పోయి మరలా బెల్లం చుట్టూ మూగే ఈగల్లా వాళ్ళు నరకానికి దగ్గరగా ఈ నగరాన్ని తీసుకువెలుతున్నారు.

ఇదంతా చూసి, విని, అనుభవిస్తున్న వారికి ఏడుపు వస్తుంటే మీకు నవ్వు ఎలా వస్తుంది అధ్యక్షా? మిమ్మల్ని గాంధి మహాత్ముడి తో ఏ భజన వెధవ పోల్చాడొ కానీ, వాడికి మహాత్ముడి గురించి కొద్దిగా హిస్టరీ చెప్పి లాగి పెట్టి ఒక 100 పీకాలని వుంది అధ్యక్షా !

Saturday, April 22, 2006

నా మనసుకు నచ్చిన ఒక మధుర గీతం

చిత్రం : శుభోదయం (1980)
పాడినవారు : బాలు, సుశీల
సంగీతం : కె.వి.మహదేవన్

కంచికి పోతావా క్రిష్ణమ్మా ఆ కంచి వార్తలేమి చెప్పమ్మ
కంచికి పోతావా క్రిష్ణమ్మా ఆ కంచి వార్తలేమి చెప్పమ్మ
కంచిలో ఉన్నది బొమ్మా అది బొమ్మ కాదు ముద్దు గుమ్మా
కంచికి పోతావా క్రిష్ణమ్మా ఆ కంచి వార్తలేమి చెప్పమ్మ
కంచిలో ఉన్నది బొమ్మా అది బొమ్మ కాదు ముద్దు గుమ్మా
కంచికి పోతావా క్రిష్ణమ్మా

త్యాగరాజ కీర్తనల్లే ఉన్నాది బొమ్మ
రాగమేమో తీసినట్టు ఉందమ్మ
త్యాగరాజ కీర్తనల్లే ఉన్నాది బొమ్మ
రాగమేమో తీసినట్టు ఉందమ్మ
ముసి ముసి నవ్వుల పువ్వులు పూసింది కొమ్మ
మువ్వ గొపాలా మువ్వ గోపలా
మువ్వ గొపాలా అన్నట్టుందమ్మ
అడుగుల్లొ సవ్వళ్ళు కావమ్మా
అవి ఎడదలో సందళ్ళు లేవమ్మా
అడుగుల్లొ సవ్వళ్ళు కావమ్మా
అవి ఎడదలో సందళ్ళు లేవమ్మా

రాసలీల సాగినాక రాధ నీవేనమ్మ
రాతిరేల సంత నిదుర రాదమ్మ
రాసలీల సాగినాక రాధ నీవేనమ్మ
రాతిరేల సంత నిదుర రాదమ్మ
ముసిరిన చీకటి ముంగిట వేచింది కొమ్మ
ముద్దుమురిపాల మువ్వగోపాలా
నీవు రావేలా అన్నట్టుందమ్మా
మనసు దోచుకున్న ఓయమ్మా

నీ మనసు దాచుకోకు బుల్లెమ్మా
మనసు దోచుకున్న ఓయమ్మా
నీ మనసు దాచుకోకు బుల్లెమ్మా
కంచికి పోతావా క్రిష్ణమ్మా
ముద్దుమురిపాల
ఆ కంచి వార్తలేమి చెప్పమ్మ
మువ్వగోపాలా
కంచిలో ఉన్నది బొమ్మా అది బొమ్మ కాదు ముద్దు గుమ్మా

Monday, April 17, 2006

అంధ్ర భారతీ నమస్త్యుభ్యం



తేనె కన్నా తీయనిది తెలుగు భాష అయితే ఇక్కడొక తేనె పట్టు మనకు దొరికిందని చెప్పుకోవచ్చు. తెలుగు బ్లాగర్ల లేఖా గ్రూప్ లో త్రివిక్రం గారు ఈ అద్భుతమైన సమాచారం పంపారు.
ఆంధ్ర భారతి ని తనివితీరా దర్శించుకోండి

శేషతల్ప సాయి గారు, నాగ భూషణ రావు గారు నిజంగా ధన్యులు.

Thursday, April 06, 2006

విండోస్ ఎక్స్ పి ఇక మన తెలుగు లో

ప్రతి చోటా గ్రామీణ కంప్యూటర్ రాక గురించి వార్తలు వెలువడుతున్న సందర్భంలో మంచి తేనె లాంటి తెలుగు వార్త. విండోస్ ఎక్స్ పి తెలుగు భాషలో మిమ్మల్ని అలరించబోతున్నది. ఇక మీరు మీ బామ్మ గారికి ఈమెయిల్, చాట్ నేర్పించే రోజులు వచ్చేసినట్లే.

tel_lip

మీరు ఈ దిగువన ఇవ్వబడిన లింకు ను ఒక సారి క్లిక్ చెయ్యండి.
తెలుగు భాషా సరంజామా విండోస్ ఎక్స్ పి కొరకై సంగ్రహించండి

త్వరిత వివరాలు
ఫైల్ పేరు: LIPSetup.msi
వెర్షన్ : 1.0
ప్రచురించబడిన తేది: 05-04-06
భాష: తెలుగు
డౌన్ లోడ్ పరిమాణము: 6.5 ఎం.బి (డయల్ అప్ పైన సుమారు 16 నిమిషాలు పడుతుంది)

Wednesday, March 29, 2006

కొన్ని రోత పుట్టించే నిజాలు

మన రాజశేఖరుడికి సోనియా ఇటాలియన్ త్యాగాల (???)ముందు ఎవ్వరూ కనిపించటం లేదులా వుంది. మెదక్ లో రైతులు టొమాటో పంటను రోడ్లపైనే పడేసి పోయారంట. 250 కి.మీ దూరం లో వున్న భాగ్యనగరం లో అవి కిలో 7 రూ పలుకుతున్నాయి. ఇంత కంటే సిగ్గు చేటు మరొకటి లేదు. దీనికి కూడా గత ప్రభుత్వమే కారణం అంటారేమో మన రోసయ్య గారు(వారి అల్లుడు గారి చెత్త ప్రవర్తన కి కూడ అదే కారణం మరి).

రక్తాలు చూస్తామన్న రాజకీయ నాయకులను, హత్యలు చేసె ఫ్యాక్షనిస్ట్లను మనం ఎమి చెయ్యలెము గాని, మూలన కూర్చుని కలం తో ధైర్యంగా మాట్లాడే రచయతలను మాత్రం కారగారం లో పెడతాం. ఎందుకంటే వారు మనం ముద్దుగా చూసుకునే మైనారిటీలు కారు, బలహీన వర్గాలమని చెప్పుకోరు. కులం అనే వ్యవస్ఠని అసహ్యించుకుంటారు. ఏ ఓటు బ్యాంకును ప్రభావితం చెయ్యలేరు. ఇంకెవడికి కావాలి వీళ్ళు? అందుకే ప్రతిపక్షం కూడ మూగబోయింది.

అసలు సమీకరణం ఏంటి అంటే :

జనం --> కులం/మతం --> ఓట్లు --> అధికారం --> కాంట్రాక్టులు --> డబ్బు

పిచ్చిగా స్వరాష్ట్రాల కోసం కుస్తీ పడుతున్న వాళ్ళు ఒక్క విషయం తెలుసు కోవాలి, మీరు కులం/మతం స్థానం లో భూమి ని పెట్టాలనుకున్న అది పని చేస్తుందనే నమ్మకం లేదు. ఎందుకంటే మన తెలుగు వాళ్ళకు భూమి మీద అంత మమకారం, భావ ఉద్వేగాలు ఉన్నయంటారా?

Monday, March 13, 2006

నా వరల్డ్ స్పేస్ రేడియో మరల పని చెయ్యటం మొదలు పెట్తింది

ఈ నెలంతా చాలా గందరగోళంగా, హడావిడి గా వుంది నాకు. పని ఒత్తిడి అయితే ఇక చెప్పనక్కరలేదు. కొద్దిగా తృప్తిగా వున్నదేంటి అంటే, నా వరల్డ్ స్పేస్ రేడియో మరల పని చెయ్యటం మొదలు పెట్తింది. నిజం చెప్పాలంటే "స్పందన తెలుగు ఛానెల్" ఆకాశవాణి ఘనమైన గత కీర్తిని మరల గుర్తు తెస్తోంది. స్పందన కు నా అభినందనలు. నాకు నచ్చిన కార్యక్రమాలు..
1.ప్రతి వారం ఒక సంస్కృత నాటక పరిచయం - విశ్లేషణ. (డా. మృణాళిని గారు) - ఈ వారం : అభిఘ్నాన శాకుంతలమ్ (ఘ్నాన అనే పదం తప్పు కావచ్చు...ఈ సాఫ్టువేరు సహకరించటం లేదు---)- "అభిజ్ఞాన" - లేఖిని తో రాయగలిగా :-)

2.ప్రతి శని, ఆది వారాలలో మధ్యాహ్నం ఒంటి గంటకు వచ్చే "పడక కుర్చీ కబుర్లు" -- యమ్.యస్.వి. ప్రసాదు గారు. ఈ వారం నెహ్రు, టంగుటూరి ప్రకాశం పంతులు గారి గురించి తెలియని పరిశోధనాత్మక విషయాలు చాలా చెప్పారు. వింటూ వుంటే కాలమే తెలియలేదు.
రావి కొండల రావు గారి హ్యూమరధం కూడా మొదలయింది కాని నేను ఇంకా వినలేదు.
వీటన్నింటిని మించి అధ్బుతమయిన మన పాత మధురాలు...వాటిలో కొన్ని
1. ఎవ్వరిదీ ఈ పిలుపు - మానస వీణ2. వీణ వేణువైన - 2. రవి వర్మకే అందని ఒకే ఒక - రావణుడే రాముడైతే

Friday, February 24, 2006

ప్ర.కోడి ప్రేమ

మన ప్రభుత్వానికి కోడి మీద ఎంత ప్రేమో చూస్తూ వుంటే చాలా ఆనందంగా ఉంది. జిల్లా అధినేతల నుంచి వై.ఎస్ వరకు స్వయంగా కోడి కూర తిని ప్రోత్సహిస్తున్నారు. కానీ ఒక్క సారి వెనక్కి తిరిగి చూస్తే, ఒక్క సారి అయినా మన అన్నదాత కు ఇలా అండగా నిలబడ్డామా అని అనిపిస్తుంది. మన అన్నదాత టొమేటో కిలో అర్ద రూపాయ కి అమ్ముకున్న రోజులు, ఉల్లిని దళారులు కిలో నలభై రూపాయలకు అమ్ముకున్న రోజులు గుర్తుకొస్తున్నాయి.
నిజం చెప్పాలంటే మన రాష్ట్రం లో కోళ్ల పరిశ్రమ ఇప్పుడు నష్ట పోయిన దాని కంటే వందల రెట్లు రైతులు ప్రతి సంవత్సరం నష్టపోతున్నారు...ఎవడికి పట్టిందీ?

నకిలీ ఎరువు అమ్మితే అయిదు వందల జరీమానా లేదా ఆరు నెలల ఖైదు...దాదాపు ఒక ట్రాఫిక్ ఉల్లంఘన కు విధించే శిక్షతో సమానం. కాని ఆ నేరం విలువ ఒక నిండు ప్రాణం కావచ్చు....మన వై.ఎస్ ప్రభువులు దాన్ని మానసిక దౌర్భల్యం అననూ వచ్చు...ఈ నేల పై ఏదైనా సాధ్యమే...

Tuesday, January 31, 2006

మనమెక్కడ?

ప్రపంచం లో అత్యధికంగా వాడబడే భాషల పట్టిక మీరు ఇక్కడ చూడవచ్చు.

ఆశ్చర్యకరంగా బెంగాలీ బాబులు తమ తిరుగులేని బాషాభిమానం తో 5 వ స్థానం లో
వున్నారు.

మిగిలిన భారతీయ బాషలు, వాటి స్థానాలు..

06. హిందీ
17. తెలుగు
19. మరాఠీ
20. తమిళం
25. గుజరాతీ
30. మలయాళం

కానీ ఇది వాస్తవం కాకపోవచ్చు కూడా...ఎందుకంటే వికిపీడియా ప్రకారం హిందీ రెండవ స్థానం లో వుంది.

Monday, January 30, 2006

ఎవరు నేర్పారమ్మ ఈ పల్లెకూ? అందాలనద్దమని అడుగు అడుగుకు...

ఇటీవల సంక్రాంతి తరువాత ఇంటి నుంచి తిరుగు ప్రయాణం ఫలక్ నుమా లో (రెండు గంటలు ఆలస్యం) వచ్చాను.రాత్రి అంతా బాగానే గడిచింది కాని, తెల్లవారాకా నాకు ఆ ఏ.సి కంపార్టుమెంటు తిక్క పుట్తించింది.పెద్దగా మాటలాడటానికి ఇష్టపడని ప్రయాణీకులు, ఇష్టపడినా భాష రాని బెంగాలీ వాళ్లు, తెరవలేని గాజు అద్దాలు, తెల్లవారి బారెడు పొద్దు ఎక్కినా, బెర్తులు దిగని మహానుభావులు, అందరిని చూస్తే జాలి, కోపం రెండూ వచ్చాయి.

బయట అందమయిన పొలాలు, కరకు రాతి నేలలు, చిన్న చిన్న కాలువలు వెనక్కు పరుగులు తీస్తుంటే చూసి ఆనందించలేక, కృత్రిమ చల్లదనాన్ని ఆబగా ఆలింగనం చేసుకున్న బడుధ్ధాయిలు అనిపించింది.

బయటకు వెళ్లి కాసేపు కోచ్ అటెండెంట్ తో మాట్లాడాకా, తలుపు తీసా, ఎదో పచ్చని పల్లె ఒక్క సారి నా కళ్లను మొత్తం తన వయిపు తిప్పుకునేలా చేసి, ముసి ముసి నవ్వులు రువ్వినట్టయింది.ఆ నిలుచున్న కాసేపు నా మదిలో సాగిన ఆలోచనల రూపం ఇది.

సంక్రాంతి లక్ష్మి పెద్దగా సిరులు ఇవ్వక పోయినా, పల్లె మొహాలలో వదిలివెల్లిన సంతోషం ఛాయలు...
పండక్కి కొత్త టైరు దొరికితే, దాన్ని బెంజి కారులా తోలుకెల్తున్న భావి పల్లె పౌరులు...
దొరికిన గాలిపటాల నన్నింటిని, అందిచ్చుకుని, ఎడా పెడా జడలో తురుముకుని మురిసిపోతున్న మర్రిమానులు, రావి చెట్లు...
ఆ చెట్ల పైనే కొత్తగా వచ్చిన గాలి పటాల తో యుద్ధం చేస్తూ, వాటిని కుళ్ళబొడిచేస్తున్న కాకులు...
మేని నిండా రాసిన పసుపుతో గర్వంగా, భూమిలోకి ముందుకి చొచ్చుకు పోతున్న ఇనుపనాగల్లూ...
శ్వేత ఛాయ మేనితో మెరిసిపోతూ, యజమాని కళ్ల మెరుపు లో కదుల్తున్న గిత్తలు...

ఇవన్నీ చూస్తుంటే, ఎవరు నేర్పారమ్మ ఈ పల్లెకూ? అందాలనద్దమని అడుగు అడుగుకు అని పేరడీ పాడాలనిపిస్తుంది.

Sunday, January 29, 2006

తెలుగు బ్లాగు, తెలుగు టెలివిజన్ లో...

రేపు టివి 9 (తెలుగు లో ఒక ప్రముఖ వార్తా ఛానెల్) వారి టెక్నోబైట్స్ అనే సాంకేతిక సంబంధిత కార్యక్రమం, తెలుగు లో బ్లాగింగు గూర్చి కిరణ్ చావా గారితో ముఖాముఖి ప్రసారం చెయ్యబోతోంది.

నేను కూడా కాసేపు బ్లాగుల గూర్చి మాటాడాను కాని, English లో :-) నేను ఈ కార్యక్రమం లో, కాసేపు బ్లాగు అంటే ఏమిటి? ఏలా మొదలు పెట్టాలి? మొదలగు విషయాలు చెప్పాను.

ఈ కార్యక్రమం, ఈ ఆదివారం అంటే 30-January-2006, 12:30 PM కి ప్రసారం కాబోతుంది. మరలా, తరువాతి బుధవారం, సాయంత్రం అయిదున్నర గంటలకు ప్రసారం అవుతుంది.

Thursday, January 05, 2006

Rx...మన తేనె, ఒక చెంబుడు, ప్రతీ రోజు...ఏదో ఒక సమయం లో...

నాకు ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. తెల్లవారు జామునే తేనెపట్టు దొరికితే ఎవరికి ఆనందంగా ఉండదు చెప్పండి :-)అందులో నాకు ఎంతో నచ్చిన "రచన" ఇంటర్నెట్ లో లభ్యమవటం ఒకటి. తపో సాధన లాంటి ఆ సాహిత్య మరియు బాషా తృష్ణకు మన తెలుగు భాషా సంఘం శాయి గారి ని సత్కరించి తీరాలి.

నాకు రచన పరిచయమయ్యింది నేను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజులలో అనుకుంటా...మల్లాది క్రిష్ణమూర్తి గారి "మూడు ప్రశ్నలు, ఒకటే సమాధానం" పోటీ ని నేను చాలా సీరియస్ గా చదివే వాడిని. ఒక సారి మాత్రం నాకు ద్వితీయ బహుమతి క్రింద 58 రూ. (అర్ధనూటపదార్లు అన్నమాట :-)) వచ్చాయి. అందులో ఒక అయిదు రూపాయలు తెచ్చిన పోస్టుమాన్ కి. కాకపోతే అది తప్పనిసరిగా లంచం కాదు సుమండీ :-)

తెలుగు వారంతా ఒకరిని అదుకొని తమని తాము అభిషేకించుకోవాలంటే తప్పక "రచన" లాంటి పత్రిక చదవాలి, వాటి మనుగడకు తోడ్పడాలి. ఒక్కసారి ఈ జనవరి నెల సంచిక చదవండి. మొదటి పుటలోనే నేను ఈ మధ్యనే కొన్న "బాల విహంగ వీక్షణ సంపుటి" గురించి ప్రకటన చూసాను.

ఈ రోజు దొరికిన ఇంకొక సాహిత్య కుసుమం, ఈమాట. నాకు ఇది కిరణ్ గారి సోది కామెంట్లు చదువుతుంటే దొరికింది. ఇది నిజంగా ఒక తేనె పట్టు. ఖాళీ సమయాలలో idlebrain.com చదవటం కంటే ఈ రెండూ కళ్లకద్దుకోవటం మంచిదని నా అభిప్రాయం.

Tuesday, January 03, 2006

పుస్తకాలతో పరిచయం

చాలా రోజుల తరువాత మరలా నేను తెలుగు లో రాయటానికి సమయం చిక్కింది. ఇంత కాలం ఏమి వెలగ బెట్టాడంటా అని అనుకోవచ్చు.దానికి ఒక కారణం ఉంది. ఎప్పుడు బ్లాగు చెయ్యాలన్నా, ఎవేవో పిచ్చి పిచ్చి విషయాలు, పనికి రాని రాజకీయాలు బుర్రలో కొట్టుకుని చివరకి నా చేతి పైన విజయం సాధించి వాటి గూర్చి రాయించుకునేవి.

వాటిని జయించాలంటే, ఒకటి మన సంఘం లో కుళ్లు పట్టించుకోకూడదు. (ఇది మనకు కష్టమయిన పని). రెండవది, తెగ పుస్తకాల తో సావసం చెయ్యటం. నేను రెండవ మార్గం ఎంచుకున్నాను. ఎందుకంటే నేను చదవని పుస్తకాలు తెలుగులో చాలా వున్నాయి మరి.

ఈ మధ్య భాగ్యనగరం లో పుస్తక ప్రదర్శన జరిగింది. నేను కూడా మా మిత్ర బృందం తో కలసి దొరికిన మంచి పుస్తకాలు అన్ని కొన్నాను. ఇదిగో ఆ చిట్తా...

01. బాల పత్రిక (1945-1959) విహంగ వీక్షణ సంపుటి (4 సంపుటాలు)
02. వంశీ గారి "మా పసలపూడి కధలు"
03. ఈ విప్లవం అంతరంగం లో - జిడ్దు కృష్ణమూర్తి గారు
04. ఒక యోగి ఆత్మ కధ
05. ఓంకార్ ఆల్ ఇన్ ఒన్
06. కాలబిలాలు పిల్లవిశ్వాలు - హాకింగ్
07. కాలం కధ - హాకింగ్
08. ఈనాడు కార్టూనులు - శ్రీధర్
09. ఇండియా ట్రావెల్ గైడు.
10. అమ్మ - గోర్కి

ఇవి కాక మునుపు కొన్న 18 సంపుటాల కాశీ మజిలీ కధలు, వేయిన్నొక్క రాత్రులు పూర్తి చెయ్యాల్సి వుంది. ప్రస్తుతం మంచి పల్లె లో, మొగలి డొంకల్లో పుట్టిన మొగలి పువ్వుల్లాంటి "మా పసలపూడి కధలు" చదువుతున్నాను. త్వరలో వాటి గురించి రాయాలని అనిపిస్తుంది.
About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name